Tuesday 30 September 2014

ఈ బుక్ 'మృత్యంతరమేలు--మరికొన్నికధలు '.-http://kinige.com/kbook.php?id=3766--

సాహితీమిత్రులందరికీ!
నమస్సులు!
దసరా శుభాకాంక్షలు!

వివిధపత్రికల్లోప్రచురితమైన నా కధలు ఒక పుస్తకంగా  ఈ బుక్ గా 'మృత్యంతరమేలు--'మరికొన్నికధలు--- కినిగె వారు ప్రచురించారు.-http://kinige.com/kbook.php?id=3766--అవకాశం ఉంటేచదివి తమ అమూల్య అభిప్రాయాలు తెలియజేయగలరు.
మీ అభిప్రాయాలు ఆహ్వానించే,
ఆదూరి.హైమవతి.

Wednesday 9 July 2014

ప్రతిభాశాలి చాచా నెహ్రూ


Like andhraprabha.com on facebook

ప్రతిభాశాలి చాచా నెహ్రూ...

కథ: ఆదూరి హైమవతి

చిన్నారులూ! పూవు పుట్టగానే పరిమళిస్తుందనే మాట వినే ఉంటారు. తెలివైన వారు పసితనంలోనే తమ ప్రఙ్ఞను చూపుతారు. ఇది సుమారుగా 113 ఏళ్ళక్రిందట జరిగిన సంఘటన. ఒక మారు కొందరు బాలురు ఒక తోటలో బంతి ఆట ఆడుతున్నారు. వారంతా పది పన్నెండేళ్ళ వారు. షుమారుగా పాతికమంది ఉంటారు. వారి చేతిలో బత్తాయి కాయంత బంతి ఉంది. అంతా వర్తులాకారంగా నిలబడి బంతి విసురుకుంటూ ఆడుతున్నారు. అది పెద్ద తోట, పెద్దపెద్ద వృక్షాలతో ఉంది. సాయంకాలం చల్లని గాలులు వీస్తున్నాయి. పిల్లలతా ఆ చల్లని వాతావరణంలో హాయిగా ఉత్సాహంగా ఆడుకుంటున్నారు.
ఇంతలో ఒక బాలుడు ఠీవిగా నడుస్తూ చిన్న లాఠీలాంటి కర్ర విలాసంగా ఊపుకుంటూ విహారానికై ఆతోటలోకి వచ్చాడు. దూరంగా తనతోటి వయస్సు పిల్లలు  ఆడుకోడం గమనించాడు. మెల్లిగా నడుస్తూ వారి సమీపానికి వస్తున్నాడు. ఇంతలో ఒకబాలుడు విసిరిన ఆ బంతి వెళ్ళి అక్కడే ఉన్న ఒక చెట్టు తొర్రలో పడింది. అంతా పరుగుపరుగున వెళ్ళి చెట్టుచుట్టూ మూగారు. అది చాలా పెద్ద చెట్టు. దాని కాండమే  ఐదడుగుల వ్యాసంతో  ఉంది. దాని మొదట్లో ఉన్న తొర్ర ఇంకా చాలా లోతుగా ఉండటాన ఆపిల్లల చేతికి ఆ బంతి అందలేదు.
అంతా బతి విసరిన బాలుని తిట్టసాగారు. "నీవంత వేగంగా విసరటం వల్లే ఆబంతి ఈ తొర్రలో పడింది. ఇప్పుడెలా ఆడుకుంటాం. నీవల్లే ఆట ఆగి పోయింది. అందరూ తనని తిట్టడంతో ఆబాలుడు  ఏడవసాగాడు. ఇంతలో ఠీవిగా నడుస్తున్న బాబు వారి వద్దకు చేరి ఎందుకు మీరంతా అతడ్ని తిడు తున్నారు? అతడేం చేశాడు? ఆట ఆపేసి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏదైనా సాయంకావాలా? అంటూ వారిని అడిగాడు. దానికి అంతా వీడు బంతిని వేగంగా విసరటంతో అది వచ్చి ఈ చెట్టు తొర్రలో పడింది, చేతికి అందటం లేదు. ఇహ ఎలా ఆడుకుంటాం, అంతా వీడి వల్లే..' అంటూ అంతా మళ్ళీ మళ్ళీ అనడంతో వాడు ఏడ్పు సాగించాడు.
ఏడ్వకు, ఉపాయం ఆలోచించాలి. ఊరికే తూలనాడుకుంటే ఉపయోగం లేదుకదా!' అంటూ తొర్ర సమీపానికి వెళ్ళి చూశాడా బాబు. తనచేతిలోని లాఠీని లోపలికి పెట్టి చూశాడు. అది చాలా లోతుగా ఉంది. కొద్దిసేపు ఆలో చించాక 'మీరు ఆ పంపువద్దకెళ్ళి ఆ బొక్కెనతో నీరు తీసుకురండి' అంటూ చెట్లకు నీరు పోసేందుకై అక్కడ ఉన్న పంపును చూపాడు. బిరబిరా వారిలో కొందరు వెళ్ళి బొక్కెన నిండా నీరు తెచ్చారు. దాన్ని ఆ బాబు ఆచెట్టు తొర్రలో పోశాడు.అది నిండలేదు. మరో బొక్కెన , మరో బొక్కెన నీరు పోశాక చెట్టు తొర్ర నిండి తేలికగా ఉండటాన ఆ బంతి పైకి తేలింది. దాన్ని చేత్తో తీసి వారికి అందించాడు ఆబాబు. అంతా చప్పట్లు చరిచి అతడి తెలివితేటలకు ఆశ్చర్య పోయారు. బంతి తీసుకుని వెళ్ళారు.
పసితనం నుండే అలా తన ప్రఙ్ఞచూపిన ఆ బాలుడే పడిత జవహర్ లాల్ నెహ్రూ. పిల్లలందరికీ చాచా నెహ్రూ, స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రిగా సేవలందించిన ప్రఙ్ఞాశాలి.
ఆదూరి హైమవతి.

మహాత్ముడెలా అయ్యాడు?







హోం >> చిన్నారి

మహాత్ముడెలా అయ్యాడు?

కథ: ఆదూరి హైమవతి

"తాతగారూ! త్వరగా రండి ఈరోజు మా తెలుగు టీచర్ గారు మనదేశంలో గొప్పవారి గురించీ చెప్తూ ‘గాంధీజీ‘ మహాత్ముడని చెప్పారు. ఆయనెలా మహాత్ముడయ్యాడో మీరు నాకు చెప్పరూ!” అంటూ తాతగారి వడి చేరాడు మనవడు మనోహర్.
“ఓ అదా! తాతా! మంచి ప్రశ్నే అడిగావు. విను మరి. గాంధీకి తల్లి తండ్రులు పెట్టిన పేరు మోహనదాస్ వాళ్ళ నాన్నగారి పేరు 'కరంచంద్' వారి ఇంటిపేరు 'గాంధీ.' మొత్తం కలిపి మోహనదాస్ కరంచంద్ గాంధీ అయింది. ఆయన చిన్నతనం నుండీ అమ్మా నాన్నగార్లతో పురాణ కాలక్షేపాలకు సత్సంగాలకు వెళ్తూ, దేవాలయానికి వెళ్తూ అమ్మా నాన్నల మాట వింటూ ఉండేవాడు. వాళ్ళ అమ్మ చాలా సాంప్రదాయాలు పాటించేది. ఆమె 'కోకిల వ్రతం' అనే వ్రతం చేసేది".
" అంటే ఏంటి తాతగారూ!"
" అంటే వసంత కాలం వచ్చిందంటే కోకిల కూత విన్నతర్వాతే భుజించేది. బాల గాంధీకి అమ్మంటే అమిత ప్రేమ. ఒకరోజున ఎంతకూ కోయిల కూయలేదు. సాయంకాలం మూడైంది. బాలగాంధీ పెరట్లోని మామిడి  చెట్టు వైపుచూస్తూ కూర్చున్నాడు, కోయిల ఎప్పుడు కూస్తుందా, అమ్మ ఎప్పుడు అన్నం తింటూందాని. ఎంతకూ కోయిల కూయక పోవడంతో, ఆమామిడి చెట్టు చాటుకెళ్ళి తానే కోయిల లాగా ' కూహూ కూహూ ' అని కూసి, లోపలికి వెళ్ళి" అమ్మా! అమ్మా! అదో కోయిల కూసింది, విన్నవా! ఇహ రా అన్నం తిను." అని పిలిచాడు.
వెంటనే పూజ గదిలో ఉన్న ఆమె బయటికి వచ్చి, బాలగాంధీ దగ్గరకు వచ్చి, అతడి చెంప పైన ఒక దెబ్బవేసింది. ఆదెబ్బకు బాల గాంధీ క్రిందపడ్డాడు. "ఛీ! నీవంటి అసత్యం చెప్పేవాడు నాకొడుకైనందుకు నేను చాలా దుఃఖిస్తున్నాను." అని లోపలికి వెళ్ళింది. బాలగాంధీకి తాను చేసినది తప్పని తెలిసింది, దానివల్లే తల్లికి కోపం వచ్చిందని అర్ధమై, దేవుని గదిలో ఉన్న తల్లి వద్దకెళ్ళి కాళ్ళుపట్టుకుని" ఇహ నా జీవితంలో ఎన్నడూ అసత్యం చెప్పను. నీమీది ఆన." అని ఏడ్చాడు. ఆమాట జీవితాంతం పాటించాడు.
ఆతర్వాత ఆయన 19 వఏట న్యాయశాస్త్రం చదవను ఇంగ్లాండు వెళ్ళేప్పుడు, అది చలిదేశం గనుక, అక్కడివారికి అలవాటైన మద్యం త్రాగననీ, మాంసాహారం తినననీ తల్లికి మాట ఇచ్చి ఆ ప్రకారము సత్ ప్రవర్తనతో నడుచుకున్నాడు. స్వాతంత్య్ర సమరంలో ఆయన ఆయుధాలు సహాయ నిరాకరణ, సత్యాగ్రహము. విదేశీ వస్తువులను బహిష్కరించడం, స్వయంగా నూలు వడికి దానితో నేసిన ఖద్దరు బట్టలు ధరించడం, సత్యము పాటించడం. అహింసతో వ్యవహరించడం. కొల్లాయి గుడ్డ కట్టుకుని, చొక్కలేకుండా చేత కర్రపట్టుకుని, మురికి వాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి చెప్పాడాయన.
నీలాంటి ఒక చిన్నకుర్రాడు ఒకసారి ఆయన ఒక ఊర్లో  ఉపన్యసించాక దగ్గరకు వెళ్ళి" తాతగారూ! మీరు చొక్కా లేకుండా ఉన్నారే? చలేయదా! మానాయన గారిని అడిగి మీకు ఒక చొక్క కుట్టించి తెస్తాను వేసుకుంటారా!" అని అడగ్గా ఆయన చెప్పిన మాటేంతో తెలుసా!
"బాబూ! మంచిమాట అడిగావు, ఐతే మనదేశంలో చాలా మంది పేదలకు చొక్కాలే లేవు, నీవు వారందరికీ చొక్కాలు కుట్టించి తెస్తే నేనూ చొక్కా వేసుకుంటాను." అని నవ్వుతూ చెప్పారుట! చూశావా అదీ గొప్పతనమంటే! తెల్సిందా! ఆయన నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు జరిగాక 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతం త్య్రం వచ్చిన శుభ సందర్భంగా సంబరాలు చేసుకొంటూ ఉండగా దేశ విభజన వల్ల బాధపడుతూ, గాంధీమాత్రం కలకత్తాలో ఒక హరిజనవాడను శుభ్రముచేస్తూ గడిపాడు. ఏనాయకుడైనా ఇంత నిరాడంబరంగా ఉండటం మనం ఈ రోజుల్లో చూడం.
అందుకే ఆయన’ మహాత్మగాంధీ‘ అనీ, పిల్లలకు’ గాంధీతాత ‘అనీ, అంతా  ‘జాతిపిత’ అనీ పిలుస్తాం. తెల్సిందా! ఇహ పద లోపలికి కాళ్ళు కడుక్కుని బామ్మపెట్టే టిఫిన్ తిని పాలుత్రాగు, పార్కుకు వాకింగ్ కెళదాం అంటూ ముగించాడు తాత.

--ఆదూరి హైమవతి, బెంగళూరు
 
 
 
 
 
 

బరువు దించేవాడు

బరువు దించేవాడు

కథ: ఆదూరి హైమవతి

మేలుకో కిట్టయ్య మేలుకోవయ్యా! మేలుకుని మమ్మల్ని ఏలుకోవయ్యా!
నందునీ పుత్రుడా యశోద కన్నయా ! రాధమ్మ మిత్రుడా! మాపాలిదేవుడా! తానే రాసుకున్న మేలు కొలుపులు పాడుతూ బామ్మ దేవుని గదిలో పూజకు అన్నీ సమకూర్చుకుంటున్నది.
అబ్బా! బామ్మా! ఏంటే శలవు రోజు కూడా నన్ను నిద్ర పోనివ్వవా! పాటలు మొదలెట్టావ్! కోపంగా కప్పుకున్న దుప్పటితోనే వచ్చింది వసుధ.
నీకు శలవైతే నా పూజ మానుకోవాలా ఏంటే వసూ! నా కిట్టయ్యను నిద్ర లేపోద్దుటే!
నిద్ర లేపితే కానీ లేవడా నీ కిట్టయ్య? ఐనా నీ బాధలూ బరువులూ ప్రత్యేకంగా  ఏమన్నా తీరుస్తాడా ఏం నీ కిట్టయ్య! అంటూ వాదనకు దిగింది వసుధ.
మరి బరువు బాధా తీర్చేవాడు గనుకే కదా ఆయన్నే నమ్ముకుని పూజించడం! నీకేం తెలుసే మహా ఐదోక్లాస్ చదువుతున్నావ్! దేవుడ్ని గురించీ నీకేం తెల్సుచెప్పు.  బరువు దించుతాడన్నావే అదెలాగో చెప్పు చూద్దాం... నా పరీక్షల బరువు తీర్చుతాడేమో చూస్తాను.“ బామ్మతో పంతానికి దిగి ఎదురుగా బాసిం పెట్లు వేసుకుని కూర్చుంది వసుధ, దుప్పటికప్పుకునే..  
వత్తులపెట్టె ఎదురుగా పెట్టుకుని విబూదిలో చేతులు అద్దుకుని వత్తులు చేసుకుంటూ చెప్పసాగింది బామ్మ. గోపికలు కృష్ణయ్యను ఎంతో ప్రేమించేవారు. ఒక్కరోజు కృష్ణుని  చూడకండా ఉండలేకపోయేవారు. గోపికలంతా మంచినీటి బావికి దుత్తలు తీసుకుని వెళ్ళేప్పుడు, కృష్ణయ్య కూడా వెళ్ళేవాడు. మురళి వాయిస్తూ వారికి శ్రమ తెలీకుండా  మాటలు చెప్తూ వెంటే ఉండేవాడు. వారు కృష్ణ నామం చేసుకుంటూ తమ పనులన్నీ సునాయాసంగా చేసుకునే వారు.
ఒక రోజున ఒక గోపిక వంటరిగా మంచి నీళ్ళ బావి కెళ్ళింది, వెంట కృష్ణయ్య కూడా వెళ్ళాడు మురళి వాయిస్తూ. ఆ గోపిక మూడు దుత్తలు తీసుకెళ్ళి బావి నీరు చేది దుత్తలు నింపుకుని, అక్కడే ఉన్న కృష్ణయ్యను కిట్టయ్యా! మూడు బుంగలు తలపై కెత్తు కోడం కష్టంగా ఉంది, కాస్తంత సాయం చేయవా అని అడిగింది.
కృష్ణయ్య నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు. గోపిక మళ్ళా వేడి కోలుగా అడిగింది. కిట్టయ్యా! సాయం చేయవా ఈ బుంగలు నాతల పైకెట్టవా అని. కృష్ణయ్య మళ్ళా తల అడ్డంగా ఊపాడు.                            
ఇదేం న్యాయం కిట్టయ్యా! సాయం చేయమంటే తల అడ్డంగా ఊపుతావు ఇదేనా స్నేహ మంటే! అంది.
నవ్వుతూ అక్కడి నుండీ వెళ్ళిపోయాడు కృష్ణుడు. గోపిక ఎలాగో తంటాలు పడీ పడీ బుంగలు మూడూ తల పైకెత్తుకుని మెల్లిగా ఇల్లు చేరింది. గుమ్మంవద్దే ఉన్న కృష్ణయ్య, ఆ బుంగలు దింపుకోను సాయం చేశాడు.
గోపిక కోపంగా ఏం కిట్టయ్యా! మహా వచ్చావు సాయం చేయను. బుంగలు తల కెత్తుకున్న దాన్ని దింపుకో లేననా! పెద్ద వచ్చావు సాయం చేయను! అంటూ కోపంగా మూతి ముడుచుకుని మాట్లాడింది.
'కృష్ణుడు నవ్వుతూ నేను బరువులు దింపే వాడినే కానీ బరువులు ఎత్తే వాడిని కాను. మీ బరువులు, భారాలన్నీ దింపుతాను అన్నాడు.
గోపికకు దానిలోని అంతరార్థం తెల్సివచ్చింది. భక్తితో కిట్టయ్యకు నమస్కరించింది.
“తెలిసిందిటే! కృష్ణ తత్వం నీకు తెలియాలంటే ఇంకాపెద్ద దానివి కావాలి. అప్పుడు అర్థమవుతుంది కానీ వెళ్ళి స్నానం చేసి రాపో. ప్రసాదం తయారుగా ఉంది. వేడివేడి చక్కెర పొంగలి కిట్టయ్యలాగా నీకూ ఇష్టమేగా పదపద. అంటూ బామ్మ పూజ చేసుకోడంలో మునిగిపోయింది.
రచన: ఆదూరి హైమవతి.
 

ప్రచార సాధనాలు

http://ipr.ap.nic.in/AndhraPradeshPatrika/issues/2014/July/Telugu/page22.html#

ఈ లింక్ లో ఆంధ్రప్రదేశ్ పత్రికలో  july 2014 ప్రచురితమైన నాకధవ్' ప్రచార సాధనాలు ' చదవి తమ అమూల్య అభిప్రాయాలు

తెలుపవలసినదిగా మిత్రులందరికీ మనవి..

**************************
 
ప్రచార సాధనాలు

జూన్ నెల రెండోవారం ప్రవేసించినా సూర్యప్రతాపం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.మధ్యాహ్న భోజనం పూర్తిచేసి శ్రీమతి స్వయంగా చేసి అందించినకమ్మనికిల్లీ బుగ్గనపెట్టుకుని  సుగంధభరిత

ఊటనీరు కొంచెంకొంచెంగా మ్రింగుతూ , వేప చెట్టుక్రింద వాలుకుర్చీలో కళ్ళుమూసుకుని

పరవశంగా పడుకునున్నాను. వేపచెట్టు చల్లని గాలులు హాయిగా శరీరాన్ని తాకుతుంటే,మనస్సూ,మేనూకూడా  స్వర్గానికి బెత్తెడే

ఎడంలో వున్నట్లున్న ఆశుఖాన్ని అనుభవిస్తూ ,శ్రీనాధుని తలంచుకుంటూ మెల్లిగానిద్రలోకిజారు

కున్నట్లున్నాను. ఎప్పుడునిద్రపట్టిందో తెలీదు.----------పూర్తికధ ఈ పై లింక్  లో

Saturday 17 May 2014

చిటికెలపందిరి.

 

 

 

హోం >> చిన్నారి                        

 

చిటికెలపందిరి.

 

కథ: ఆదూరి హైమవతి

 

 


చిన్నారులూ! మీరు చిన్నారులు కాదు మహా మేధావులు. ఏలాగంటారా! ఇది చదవండి మీకే తెలుస్తుంది, మీలాంటి ఒక చిన్నారి చివరకు ఆంజనేయ స్వామినే బురిడీ కొట్టించాడు మరి! ఆ కథనం బెట్టిదనిన...
కిరణ్‌కు క్రికెట్ అంటే ప్రాణం. చదువంటే అంతగా గిట్టదు. ఏదో అమ్మా నాన్నగార్ల కోసం స్కూల్ కెళుతుంటాడు, పైగా అక్కడ వాడి తోటి క్రికెట్ ఆటగాళ్ళంతా ఉంటారాయె!
నాన్న నరసింహం కిరణ్ మార్కులు చూసినపుడల్లా అపర నరసింహావతారం దాల్చుతుంటాడు. తల్లి లీలావతి ఆపద కాస్తుంటుంది.
"ఈ మారు మార్కులు 60 దాటకపోతే హాస్టల్లో పడేస్తాను. అక్కడ మెడలు వంచి చదివిస్తారు."అని హెచ్చరించాడు. కిరణ్‌కు హాస్టలంటే మహాభయం. అక్కడ వాడిక్లాస్ మేట్ ఒకడున్నాడు. చాపమీద క్రిందపడుకోవాలిట, చన్నీటి స్నానమట. తిండి రేషన్‌లా పెడతారుట! రాత్రి 11గం.వరకూ చదవాలిట! తెల్లవారు ఝామున మూడింటికే లేపుతారుట! లేకపోతే కొడతారుట! బాబోయ్! వాడురోజూ ఏడుస్తుంటాడు. భయంతో కిరణ్ తల్లి కొంగుచాటున చేరి "అమ్మా! నేను హాస్టల్లోచేరనే, ఇంట్లోనే చదువుకుంటా. నాన్నకు చెప్పవే!"అంటూ బ్రతిమాలాడు.
"ఏంటండీ మీరుమరీనీ, ఒక్కగానొక్కబిడ్డను హాస్టల్లో వేస్తారా! వాడేం దిక్కులేనివాడా! చాల్చాలు ఆపండి" అంటూ వాడ్ని వెనకేసుకొచ్చింది. తల్లిప్రేమకదా.
"ఒరేనాయనా! నీవు నాతోపాటుగా రోజూ ఆంజనేయస్వామి ఆలయానికి రారా! ఆయన పిలిస్తే పలికే దేవుడురా! నిన్ను తప్పక ప్యాస్ చేయిస్తాడు." అంటూ వాడికి భక్తినూరిపోసింది. దాంతోవాడు ఉదయం గుడికీ, స్కూల్ తర్వాత క్రికెట్‌కూ హాయిగా వెళుతూ ఆంజనేయ స్వామిమీద భారం మోపాడు.
పరీక్షలు దగ్గరపడేసరికి పదోతరగతి పిల్లలందరికీ దేవునిపై భక్తిపెరిగిపోయింది. ముడుపులు కట్టేవారూ, ఆంజనేయ స్వామికి తమలపాకుల దండలేస్తామనేవారు, చిట్టిగారెలు, అప్పాలూ వేస్తామనే వారు, మక్కువగా రోజుకో మొక్కు మొక్కుతున్నారు. 
ఒకరోజున కిరణ్ "అమ్మా! ఆంజనేయస్వామి నన్ను ప్యాస్ చేయిస్తాడుగా?'మా క్లాస్ మేట్సంతా చాలామొక్కులు మొక్కుతున్నారమ్మా! నేను ఏదో ఒక కొత్తమొక్కు మొక్కుకుంటానే!" అన్నాడు.
"దాందేముంది నాయనా! 40రోజులు ప్రదక్షిణాలూ, పాసయ్యాక వంద కొబ్బరికాయలూ కొడతానని మొక్కుకో."అంది వాళ్ళమ్మ కిరణ్ తల ప్రేమగా నిమురుతూ.
ఆమాటలు విన్న వాళ్ళనాన్న "చదివితే పాసవుతారుగాని, పుస్తకం పట్టకుండానే మొక్కులు మొక్కినంత మాత్రాన ఏదేవుడూ పాస్ చేయించడు, బధ్ధకపు వెధవా! వాడికితోడు నీవో బడుధ్ధాయి తల్లివి. కూర్చోబెట్టి చదివించు. ఫలితం ఉంటుంది." అని కోప్పడ్డాడు. తల్లి నాయనా కాస్తంత చదవరా! దేనికైనామంచిది" అని బ్రతిమాలగా కిరణ్ పుస్తకాలు ముందేసుకుంటే, ఒక్కటీ అర్థమై చావట్లేదు వాడికి. ఏనాడైనా పుస్తక తెరిస్తేనా!
"ఒరే భలే ఐడియారా! ఈ ఒక్క ఐడియాతో మన జీవితాలే మారిపోతాయి. మనం ఆంజనేయ స్వామికి పూల పందిరి వేయిద్దాం, కనీసం బిట్ పేపర్ ఆన్సర్స్ తెలిసేలా చేయమని ప్రార్ధిద్దాం , బిట్స్ మాత్రమే చదువుదాం సరా!" అని కిరణ్ క్రికెట్ ఫ్రండ్స్ అంతా బిట్స్ ఏకబిగిని కంఠతా పట్టసాగారు.
పరీక్షలు రానే వచ్చాయి. మొదటి రోజున కిరణ్ ఫ్రండ్స్ అంతా చిటికె లేసుకుంటూ పరీక్ష హాల్లోకి వెళ్లసాగారు. అప్పుడే కిరణ్‌కు ఒక గొప్ప ఐడియా తట్టింది."స్వామీ! ఆంజనేయా! నీకు చిటికెల పందిరేయిస్తాను స్వామీ! నన్ను పాస్ చేయించు ప్రభూ!" అని మొక్కుకుని పరీక్ష హాల్లో ప్రవేశించాడు.
ఆలయంలోని ఆంజనేయస్వామికి చాలా సంభ్రమం కలిగింది.'ఇంతవరకూ ఒక్క భక్రుడైనా వేయించని ' చిటికెల పందిరి ' వేయిస్తానంటున్నాడు, ఈమొక్కు ఏ నాడూ నేను కనలేదూ, విననూలేదు, వీడినెలాగైనా పాస్ చేయించి ఆ ’చిటికెల పంది’రేయించుకోవాలి ' అనుకుని, బిట్స్ అన్నీవాడు చదివినవే వచ్చేలా చేశాడు. కిరణ్ బిట్సన్నీ బాగా వ్రాసి పరీక్షపాసయ్యాడు. 
తల్లి మురిసి ముద్దైపోయి "రానాయనా! ఆంజనేయ స్వామి ఆలయానికెళ్ళి మొక్కులు తీర్చుకొద్దాం “ అని తమలపాకుల మాలా, చిట్టి గారెలమాలా, కొబ్బరి కాయలూ పట్టుకుని బయల్దేరింది. అన్ని మొక్కులూ తీర్చుకున్నాక ,"అమ్మా! ఉండవే! మరో మొక్కు మిగిలి పోయింది.దేవుడికి చిటికెలపందిరేయాల" అంటూ దేవునికి ఎదురుగా నిల్చుకుని,
"స్వామీ! ఇదిగో చిటికెల పందిరి --" అంటూ చేత్తో చిటికె లేస్తూ ఇది ఒక స్తంభం, ఇది మరో స్థంభం అంటూ నోటితో పలుకుతూ చిటికె లేస్తూ స్థంభాలూ, అడ్డపట్టెలూ నిలువుపట్టెలూ, ఆకులూ ‘అని పలుకుతూ చిటికెలు వేస్తూ," స్వామీ నీమొక్కు తీర్చుకున్నాను చిటికెల పందిరేశాను." అని చెప్పి నమస్కరించి వెళ్ళాడు కిరణ్. 
ఆంజనేయస్వామి "ఓరీ నన్నే బురిడీ కొట్టించావు కదరా! ఇదా చిటికెల పందిరంటే!" అని విస్తుపోయాడు, పాపం దేవుడు.
రచన: ఆదూరి హైమవతి.

Friday 16 May 2014

ఇ బుక్ గా కినిగె లో నీతికధలు పిల్లలప్రీతికధలు, బామ్మచెప్పిన భలే భలే కధలు అనే రెండు

అందరికీ నమస్కారం!

ఈ లింక్ లో నేను చిన్నపిల్లలకోసం  వ్రాసిన నీతికధలు , కొత్తపల్లి, ఆంధ్రభ్రభ దినపత్రికల్లో ప్రచురితమైన కధలు ఇ books ,[పిల్లలప్రీతికధలు, బామ్మచెప్పిన భలే భలే కధలు అనే రెండు  ] గా కినిగె లో   ప్రబ్లిష్ అయ్యాయని  తెలుపు టకు సంతోషించుచున్నాను. , దయచేసి చదివి మీ అమూల్య అభిప్రాయాలు తెలుపవలసినదిగా మనవి.మీకు నచ్చితే ఆవిషయం  కినిగె లో ప్రచురించవలసినది గాకోరుచున్నాను..
with best regards,
ఆదూరి.హైమవతి.   

Wednesday 16 April 2014

నిజాయితీ మహిమ


 

నిజాయితీ మహిమ

రచన: ఆదూరి హైమవతి

రాజు, రవి చదువు పూర్తయి, ఉద్యోగంకోసం ఎదురుచూస్తున్నారు. ఇద్దరికీ ఒకే కంపెనీలో ఇంటర్వూకు పిలుపు వచ్చింది. ఆ పట్టణంలోని ఒక ఆంజనేయ స్వామిని అంతా  ' ఉద్యోగాల ఉపాసన ఆంజనేయ స్వామి' అని పిలుస్తూ భక్తిగా  పూజిస్తారు. చాలా ప్రసిధ్ధిపొందిన ఆ హనుమాన్ ఆలయానికి ఇద్దరూ 'ఉద్యోగం తమకు దక్కా'లని ప్రార్ధించడానికి వెళ్ళారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉండేవారంతా ఆఆలయానికివెళ్ళి, గర్భగుడి వెనుక గూట్లో ఉన్న ఆంజనేయ ప్రతిమవద్ద వంటరిగా పెద్దగా తమ కోర్కెను విన్నవించుకోడం వాడుక! అలా ఆ గూట్లో ప్రతిమకు విన్నవించుకున్నవారికంతా ఉద్యోగాలు వచ్చేసినందున ఆ వీరాంజనేయస్వామికి 'ఆ పేరు స్థిరపడిందిట!. 
స్నేహితులిద్దరూ ఆలయంలో ప్రవేశించి, అర్చించాక ముందుగా రాజు ఆలయం వెనుకకు వెళ్ళి ఆంజనేయ ప్రతిమకు తన కోర్కెవిన్నవించుకుని వచ్చాక, రవి వెళ్ళి తన విన్నపం మనవిచేసుకుని వచ్చాడు. 
మరునాడు ఇద్దరూ ఉద్యోగానికై ఇంటర్య్వూకు హాజరైనారు. ఆఫీసర్ గారు ఆ ఉద్యోగానికి వచ్చిన వారందరి సర్టిఫికేట్స్ పరిశీలించి అందరిలో ఎక్కువ అర్హత ఉన్న రాజు, రవిలను ఎంపికచేసి "ప్రస్తుతం ఒకే ఖాళీ ఉంది. మీఇద్దరిలో ఒకరికే ఉద్యోగం వస్తుంది. మీరు 'ఉద్యోగాల ఉపాసన ఆంజనేయ స్వామి'ని ప్రార్ధించే వచ్చి ఉంటారనుకుంటాను. మీరు ఏమని ప్రార్ధించారో ఈ పేపర్లో వ్రాసిఇవ్వండి" అని వారిద్దరికీ చెరో తెల్లకాయితం ఇచ్చారు. వారిద్దరూ తాము ఆంజనేయునికి విన్నవించుకున్న కోర్కెను వ్రాసి ఇచ్చారు. ఆఫీసర్ అవి చదివి..
"భళీ! బావుంది. సరే నేను నామనస్సు మార్చుకుంటున్నాను. మీఇద్దరికీ ఉద్యోగాలు ఇవ్వదలచాను" అని చెప్పి టైపిస్టును పిలిచి "వీరిద్దరికీ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ టైప్ చెసి ఇచ్చి, ఈరోజే చేర్చుకోండి" అని చెప్పారు. ఇద్దరికీ ఆశ్చర్యమేసింది, ఒకే ఉద్యోగం ఉందని చెప్పిన ఆఫీసర్ ఇద్దరికీ ఉద్యోగం ఇవ్వడంలోని ఆయన ఆంతర్యం వారికి అర్ధంకాలేదు.
వారిద్దరూ ఏమని హనుమతుని ప్రార్ధించారో ఊహించగలరా! పిల్లలూ! రాజు "హనుమంతా! రవి నాకంటే ప్రఙ్ఞావంతుడు, నాకు ఉద్యోగం వెంటనే అవసరం, మాతండ్రి రిటైరయ్యారు, చెల్లి పెళ్ళి చెయ్యాలి, అమ్మ ఆరోగ్యం బాలేదు, వైద్యం చేయించాలి, రవి నాప్రాణమిత్రుడే! కానీ అతని కంటే ముందుగా నాకు ఉద్యోగం అవసరమని నీకూ తెల్సు! రవికి బాధ్యతలు నాకంటే తక్కువ, కనుక ఒకే ఉద్యోగం ఉంటే నాకే ఇప్పించు. ఇది స్వార్ధంకాదు, మిత్రద్రోహమూ కాదు. నా బాధ్యతలు నిర్వహించుకునే అవకాశం ఇప్పించమనే విన్నపం." అని ప్రార్ధించాడు.
రవి "స్వామీ! ఇద్దరం ఉద్యోగానికై హాజరవుతున్నాం, కానీ రాజుకు నాకంటే ముందు ఉద్యోగం అవసరం, ఒకే ఉద్యోగం ఉంటే ముందుగా రాజుకే ఇప్పించు, ఇది నావిన్నపం." అని ప్రార్ధించాడు. ఐతే అధికారి వ్రాసి ఇవ్వమని కోరగా, ఇద్దరూ నిజాయితీగా, తాము ఆంజనేయ స్వామిని కోరిన కోర్కేలనే వ్రాశారు, ఆఫీసర్ గారు వారి నిజాయితీకి మెచ్చుకుని, అలాంటి నిజాయితీపరులే తనకు అవసరమని భావించి ఇద్దరికీ ఉద్యోగాలు ఇచ్చారు. నిజాయితీ మహిమ చాలా గొప్పదిమరి!.

Thursday 10 April 2014

మహిళా 'మణిపూస'

Click Here
 

మహిళా 'మణిపూస'

రచన: ఆదూరి హైమవతి.

స్వతంత్ర భారత దేశానికి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఉప ప్రధానిగా  ఉండేవారు. ఆయన కుమార్తె మణీబెహన్. తండ్రి వలె నిరాడంబర స్వాభావం, ధైర్య సాహసాలు, ఓర్పు కలది. ఆమె ఇంటి పనులన్నీ తానే స్వయంగా చేసేదిట! పనివారేలేరు! ఒక రోజున అప్పటి హోం మినిస్టర్ ‘మహావీర్ త్యాగి‘, పటేల్‌తో మాట్లాడటానికి ఆయన ఇంటికి వచ్చారుట! ఆసమయంలో మణీబెహన్, తన తండ్రి ఇంట్లో ధరించే పాత పంచలు చిరిగినవి తీసేసి అతికించి చీర వలె ధరించి ఉందిట.
ఆ సమయంలో ఆమె తండ్రి పటేల్, సుశీలానయ్యర్, అక్కడ ఏదో విషయం చర్చిస్తూ కూర్చుని ఉండగా, మహావీర్ త్యాగి లోనికి వచ్చి, మణీబెహన్‌ను చూసి, 'అమ్మాయీ! నీవు ఉప ప్రధాని కుమార్తెవు కదా! ఆయన గౌరవానికి తగినట్లు ఉండాలి కదా! నీవిలాంటి అతుకుల పాత చీరను ధరించడం ఆయనకు అవమానం కాదా! నీ వస్త్రధారణ బావు లేదు' అన్నాట్ట.
దానికి మణీ బెహన్ కోపంతో, ధైర్యంగా ఇలా చెప్పింది! 'త్యాగిగారూ! నీతి నిజాయితీలను గాలికి వదిలేసి స్వార్ధంతో డబ్బు సంపాదించడం అవమానం! కష్టపడి నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నదానితో సరిపెట్టుకోడం అవమానమెలా అవుతుంది ఇలాంటి చీర ధరించడం నాకే మీ అవమానంగా లేదు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ధనాన్ని విలాసాలకు దుర్వయం చేస్తూ ఆ సంపదను వృధా చేసే వారు అవమానపడాలి, నా గౌరవ మర్యాదలూ, నాతండ్రి గౌరవం ఎలా నిలుపు కోవాలో నాకు తెల్సు, ఇతరులు చెప్పాల్సిన పని లేదు. నా తండ్రికి ఏ ఇబ్బందీ కలుగ కుండా చూసుకుంటూ జీవిస్తున్న నాకేమీ అవమానం లేదు' అనిచెప్పి లోనికెళ్ళి పోయిందిట! 
ఈ మాటలన్నీ వింటున్న సుశీలానయ్యర్ “త్యాగిగారూ! మణీబెహన్ విషయం మీకు కొత్త! ఆమె ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ క్షణం వృధా చేయక పని చేస్తూనే ఉంటుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటుంది. పాత్రలు తోమటం, తండ్రి బట్టలు శుభ్రం చేయటం, సమయం దొరగ్గానే రాట్నంతో నూలు వడికి, దానితో తండ్రికి కావల్సిన చొక్కాలూ, పంచలూ స్వయంగా నేస్తుంది. చిరిగిన పంచలను కుట్టి ఇలా చీర వలె తాను ధరిస్తుంది. తండ్రి హోదాను తన కోసం, వాడుకోడం ఆమెకు గిట్టదు. ఇలా జీవించడం ఆమెకు అగౌరవం కాదు. గర్వంగా భావిస్తుంది. ఆమెను చూసి మనం గర్వించాలి, ఆమెను మనం ఆదర్శంగా తీసుకోవాలి, నేటి యువతకు ఈమె ఆదర్శం. అని వివరిస్తుంది. 
మరి నేటి యువతకు ఆదర్శం ఎవరో మనకు తెలీదు.          

మనసుంటే మార్గం.

హోం >> చిన్నారి

మనసుంటే మార్గం.

రచన: ఆదూరి హైమవతి

చిన్నారులూ! హనుమంతుడు అఖండ రామ భక్తుడు. ఆయన రోమరోమానా రామనామం వినిపిస్తుంటుందిట! అంటే నిరంతరం నిద్రలో సైత రామనామాన్ని ఏమారక స్మరిస్తుంటాడన్నమాట హనుమ. 
రాముని ఒక్కనిముషమైనా వదలి ఉండలేడు హనుమ. శ్రీరాముడు అరణ్య వాసం పూర్తయ్యాక అయోధ్య చేరి పట్టాభిషిక్తుడౌతాడు. ఆపట్టాభిషేకానికి సుగ్రీవుడు తన సేనతో వచ్చి సంతోషంగా కొద్దిరోజులు గడిపి తిరిగి కిష్కింధకు వెళుతూ, హనుమను కూడా రమ్మంటాడు. తాను మరి కొంతకాలం రాముని సేవచేసుకుని వస్తానని వారిని సాగనంపుతాడు హనుమ.
 ఎంతోకాలంగా అరణ్యాలలో సంచరించిన అన్నగారికి సకల సౌకర్యాలూ సమకూర్చాలని అనుకుంటారు ఆయన తమ్ముళ్ళంతా. లక్ష్మణ, భరత ,శతృఘ్నులు రామునికి చేసే సేవలన్నీ ఒక పట్టిక రాసుకుంటారు. అవన్నీముగ్గురూ పంచుకుని రాముని వద్దకుపంపి అనుమతి కూడా పొందుతారు. 
స్నానం చేసేప్పుడు అవసరమైనవన్నీ అందించడం, స్నానానంతరం ధరించే దుస్తులు ఎంపికచేసి అందించడం, విసనకర్ర పట్టుకుని గాలి వీచడం, పాదాలు వత్తడం, భోజన సమయంలో దగ్గరుండి అన్నీ చూడటం మొత్తం రామునికి చేసే పనులన్నీ ఉదయం నుండీ రాత్రివరకూ ముగ్గురూ పంచుకుంటారు. 
హనుమకు ఏ సేవా మిగలదు. హనుమ వారి ముగ్గురితో "నాకు ఏసేవా మిగల్చకుండా చేశారే?" అని అడగ్గా, వారు "హనుమా! ఈ పట్టికలో లేని సేవ ఏదైనా ఉంటే దానిని నీవు చేసుకోవచ్చు" అంటారు ముక్తకంఠంతో.
హనుమ తీవ్రంగా ఆలోచించి, ఒక్క గెంతువేసి "ఆ! దొరికింది రామ ప్రభువు ఆవలిస్తే 'చిటికె' వేసే సేవ నేను తీసుకుంటే మీకేమీ అభ్యంతరం లేదుగా?" అంటాడు. వారు నవ్వుకుని "మాకేమీ అభ్యంతరం లేదు" అంటారు. 
ఐతే ఆక్షణం నుండీ హనుమ రాముని వీడక నీడవలె వెంట ఉండసాగాడు. రాముని తమ్ములు ముగ్గురూ " హనుమా! నీవు ఇలా నిరంతరం రామ ప్రభువును అంటిపెట్టుకుని ఉంటే మేము మా సేవలెలా చేసుకుంటాం? నీ సేవ అవకాశం వచ్చినపుడు చేసుకో, నియమ భంగం చేయకు" అంటారు. 
అప్పుడు హనుమ నవ్వుతూ" అయ్యలారా! రామ ప్రభువు ఎప్పుడు ఆవలిస్తాడో ఎవరికెరుక? అందుకే నిరంతరం వెంటనే ఉండి ఆవలించగానే చిటికె వేస్తాను" అని చెప్పాడు. అలా నిరంతరం రామ సన్నిధిని పొందే అవకాశం అందిపుచ్చుకున్నాడా భక్తుడు. అందుకే ' మనసుంటే మార్గ ముంటుంది' అంటారు పెద్దలు.  

రామాయణమూ.. పారాయణమూ..


హోం >> ఆధ్యాత్మికం

రామాయణమూ.. పారాయణమూ..

రచన: ఆదూరి హైమవతి

ఆంధ్రదేశంలోనే కాదు భారత దేశంలో కూడా రామాలయము, ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదని చెప్పాలి. అంతగా రామాయణము దానిలోని ప్రధాన పాత్రలు దేశప్రజల్లో అల్లుకుని పోయాయి. అసలు రామాయణం లోని ప్రధాన పురుషులు ఏడుగురు. రాముడు, లక్ష్మణుడు, హనుమ, సుగ్రీవుడు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. ఈ సప్త వీరుల మధ్యే ప్రధానంగా రామాయణం సాగింది.

కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్.
కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత-- 

రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరిత్ర , ఆంజనేయ భక్తి భరితం.                                                         
దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా                                   
పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్                   
గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్       
రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్

రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మకం. రామ నామములో పంచాక్షరీ మంత్రం ఓం నమశ్శివాయ నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము ఓం నమోనారాయణాయ నుండి 'రా' బీజాక్షరం పొందుపరచబడివున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు రామ నామమును పలికి నంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభిస్తుందని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తు ల్యమ్ రామనామ వరాననే

అసలు రామాయణం 24వేల శ్లోకములతో కూడిన ఉద్గ్రంథం. భారతదేశం యొక్క హిందూధర్మాల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర, తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సత్సంబంధ, బాంధవ్యాలను, ప్రవర్తనా విధానములను వివరించడం జరిగింది. రామాయణములోని పాత్రలన్నీ ఆదర్శ జీవనానికి ప్రమాణంగా స్వీకరించాల్సి ఉంది.
వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము కూడా పేరుగాంచినవే!. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావాలు, తత్వాలు, అంతర్గతంగావున్న పురాణాలు, కథలు, కావ్యాలు, పాటలు అన్నీ భారతదేశంలోని చాలా భాషల్లో ఉన్నాయి.  వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణంగా సర్వత్రా అంగీకరింపబడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్ధన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.
రామాయణమును చాలా మంది కవులు తెలిగించారు. వారిలో మొల్ల వ్రాసిన మొల్ల రామాయణము, కంకంటి పాపరాజు గారి ఉత్తర రామ చరితము; గోన బుధ్ధారెడ్డి గారి రంగనాథ రామాయణము; విశ్వనాధ సత్యనారాయణ గారి -- రామాయణ కల్పవృక్షము, వావిలికొలను సుబ్బారావు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణము, ఉషశ్రీ గారి ప్రవచనమూ ప్రసిధ్ధాలు.

సూక్ష్మ రామాయణం                              
సూక్ష్మంగా రామాయణ కధను ఇలా చెప్పుకోవచ్చు. ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని పాలిస్తుంటాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే భార్యలున్నా పిల్లలు లేని కారణంగా దశ రధుడు పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు. యఙ్ఞ పురుషుడు సతృప్తి చెంది దశరధునికి పాయసపాత్ర ప్రసాదిస్తాడు. దాన్ని దశరధుడు ముగ్గురురాణులకూ సమంగా పంచుతాడు. ముగ్గురూ అభ్యంగనం ఆచరించి పాయసాన్ని స్వీకరించమంటాడు. సుమిత్ర సహజ స్త్రీ చాంచల్యం చేత తన పాయసపాత్రను అంతః పురంపైన తల ఆర్చుకుంటూ ఆ పిట్టగోడమీద ఉంచుకుని ‘పెద్దరాణి గనుక కౌసల్య పుత్రుడు రాజవుతాడు, లేదా ముద్దులభార్య ఐన కైకేయీ తన యుడు రాజుకావచ్చు, ఏ ప్రత్యేకతా లేని నాకుమారుడు వారికి బంటుగానే ఉండవచ్చేమో’ అని తలంచుచూ ఉండగా ఒక గ్రద్ద మెరుస్తున్న ఆ బంగారు పాయసపాత్రను తనకు ఆహారంగా భావించి తీసుకెళుతుంది. సుమిత్ర భయ పడుతూ ఈవిషయం సవతులకు చెప్పగా, కల్లాకపట ఎరుగని ఆకాలం వారు గనుక ఇద్దరూ తమ పాయసంలో చెరో సగం సుమిత్రకు ఇస్తారు. ముగ్గురూ పాయసం సేవించిన అనతికాలంలోనే గర్భవతులౌతారు. వారికి ఆ రాజుకు నలుగురు కుమారులు జన్మిస్తారు. రెండుభాగాలు సేవించిన సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మిస్తారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేస్తారు.                                
సుమిత్ర భాగం తీసుకెళ్ళిన గ్రద్ద దాన్ని అడవిలో క్రింద జారవిడువగా అది ఈశ్వరుని అభిషేకిస్తున్న అంజనాదేవి సమీపంలో పడుతుంది. ఆమె దాన్ని ఈశ్వరప్రసాదంగా భావించి సేవించగా ఆమెకు 'హనుమ' జన్మిస్తాడు. ఇలా హనుమ రాముని సోదరుడై తర్వాతికాలంలో ఆయన్ని సేవించి తరిస్తాడు.
పులస్య బ్రహ్మ కుమారుడైన రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తుండు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతమార్చనే నరుడై, రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై విదర్భరాజైన జనక మహారాజు ఇంట పెరుగుతుంది. రాముని సవతి తల్లియైన కైకేయి ఆమె చెలికత్తె మంధర మాటలువిని పూర్వం దశరధుడు ఆమెకిచ్చిన రెండువరాలనూ ఇలా కోరుతుంది. మొదటిది భరతుని పట్టాభిషేకము, రెండవదిరామునకు 14 ఏండ్ల వనవాసము. దశరథుడు దుఃఖంతో కృంగి పోతాడు. రాముడు తండ్రి మాట నిలబెట్టను కృతనిశ్చయుడౌతాడు. సీతా, లక్ష్మణుడూ రామునితో వనవాసానికి బయల్దేరుతారు.   సీతారామలక్ష్మణులు సకలసౌఖ్యాలూ వర్జించి, నారదుస్తులు ధరించి వనవాస దీక్షకు వెళ్తారు. గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు. దశరధుడు రామునికై విలపిస్తూ స్వర్గస్తుడౌతాడు. వారు పంచవటితీరాన పర్ణశాలను నిర్మించుకొని నివసిస్తుండగా, కామరూపియైన శూర్పణఖ అనే రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి రాగా, లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోస్తాడు. శూర్పణఖ రోదిస్తూ వెళ్లి తన అన్న ఐన రావణునితో సీత అందం గురించీ చెప్పి ఆమెను భార్యగా స్వీకరింపమని బోధిస్తుంది.. రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులు దానికీ దూరంగా వెళ్ళగానే, సీతను లంకకు ఎత్తుకుపోతాడు. 
అది రాక్షసమాయ అని తెల్సుకుని తిరిగివచ్చిన వారికి సీత కనిపించక హతాశులైన ఆమెను వెతుకుతుండగా వారికి హనుమ కనిపిస్తాడు, సుగ్రీవమైత్రి వాలీ వధ, సుగ్రీవునిపట్టాభిషేకం సీతాన్వేషణ ,కుంభ కర్ణ రావణ వధానంతరం విభీషణునికి లంకారాజ్య పట్టాభిషేకంరావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి, తాను సీతను ఎత్తుకుపోయాడు. అడ్డు వచ్చిన జటాయువు రెక్కలు తెగనరికాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు. కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు. అయోధ్యాగమనం, తదనంతరం రామ పట్టాభిషేకం...
రామాయణ కధను కట్టెకొట్టె తెచ్చె, ఇలా రామాయణాన్ని మూడు మాటల్లోనూ ఒకే శ్లోకంలోనూ చెప్పుకోవచ్చు.

పూర్వం రామ తపోవనాదిగమనం హర్వామృగంకాంచనం
వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదహనం
పశ్చాద్రావణ కుంభకర్ణ హనమ ఏతత్ హి రామాయణం

దీన్ని ఏకశ్లోకి రామాయణం అంటారు.

అసలు రామాయణం ఏడుకాండలు అంటే భాగాలన్నమాట. బాలకాండము, అయోధ్యా కాండము, అరణ్యకాండ, కిష్కింధకాండము, సుందరకాండము, యుద్ధకాండము, ఉత్తరకాండము అని ఏడుకాండల పేర్లు. ఐతే సీతారాములు సాక్షాత్ లక్ష్మీ విష్ణువులు.

స్మరియింపుడు రామనామమున్

స్మరియింపుడు రామనామమున్

రచన: ఆదూరి హైమవతి

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
అని చదువుకుంటూ తాత, క్రికెట్ బ్యాట్‌తో వెళుతున్న మనవడ్ని కేకేశాడు.
“ఒరేయ్ మనవడా! ఈరోజు సాయంకాలం రామాలయంలో ఉపన్యాసముంది. నన్ను తీసుకెళ్ళాలిరా!”
“నీకేం పనిలేదా తాతా! ఊరికే ఇంట్లో కూర్చోలేవా! ఎప్పుడూ ఉపన్యాసాలూ, సత్సంగాలూ, హరికధలూ, బుర్రకధలూ అంటూ నాబుర్ర, తినేయకపోతే ఇంట్లో కూర్చుని ఆ రామనామమేదో అనుకోకూడదా!” విరుచుకుపడ్డ మనవడు రాముని చూస్తూ బోసినవ్వు నవ్వాడు తాత.
“ఒరే రాముడు కూడా నీలాగే  ఇంట్లోకూర్చుని, కడుపులో చల్లకదలకుండా హాయిగా భార్యతో రాజ్యమేలుకోక అడవులపాలై తిరుగుతూ ఎందరో రాక్షసులను సంహరించి ఉండకపోతే ఈనాడు లోకమంతా రాక్షసమయం అయ్యేది!
'ఇప్పుడైనా ఆ సంతతివారే కదా తాతా పాలించేది' అంటూ వచ్చాడు రాము జతకాడు రాఘవ.
'ఐనా తాతా! నీకు రాముడంటే అంత ఇష్ట మెందుకూ! ఆయనా మామూలు మనిషేగా! భార్యను ఎవరో అపహరిస్తే ఏడ్చాడుట కూడానూ..' అంటున్న రామును చూసి, 'ఔనురా నీలాంటివారికంతే  తెల్సు. అందుకే రారా రామాలయానికి అంటున్నా, నాతో వచ్చి వినండి, సందేహాలుంటే అడిగి తీర్చుకోండి. కాస్తంత భారతీయ సంస్కృతి తెల్సుకోండి, ఇప్పుడే ఇవన్నీతెల్సుకోవాలి. పాశ్చాత్యత వంట బట్టించుకోక, భారతీయత గురించీ తెల్సుకుంటే భారతీయ సంతతిగామిగులుతారు., పదండి, ఇద్దరూనూ' అంటూ తాత ఇద్దర్నీ వెంట బెట్టుకుని రామాలయం చేరాడు.
అక్కడ శ్రీరామనవమి కావటంతో జనం క్రిక్కిరిసి కూర్చునున్నారు. ఉపన్యాసకులు ఉపేంద్రనాధ్ రాగానే అంతా లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించారు. ఆయన చిరునవ్వుతో అందరికీ ప్రతినమస్కారం చేసి రామార్పణం అంటూ, అందర్నీ కూర్చోమని సైగ చేశాడు. తనకు కేటాయించిన తుంగచాప మీద కూర్చుని ముందుగా, గణేశునీ సరస్వతీదేవినీ ధ్యానం చేసుకుని, గొంతు సవరించుకుని కమ్మని కంఠంతో ఇలా పాడాడు.
“వేదవేద్యే పరేపుంసీ జాతే దశరధాత్మజే 
వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాత్  రామాయణాత్మనా.."
వేదవేద్యుడైన భగవంతుడే రామునిగానూ వేదమే రామాయణం గానూ అవతరించింది. ఆవేదవేద్యుని గురించీ చెప్పుకోడం వినడం మహద్భాగ్యం.’ రామోవిగ్రహవాన్ ధర్మః ‘ అన్నారు, అంటే శ్రీరామచంద్రుడే ధర్మాన్ని ఆకారంగా దాల్చినవాడు.
అదెందుకో చెప్పుకుందాం. 'రామ' అనగానే మన మనస్సు ఆనందంతో నిండిపోతుంది.' రమతీతి రామః అంటే ఆనందించేవాడు రాముడు ,' రమయతీతిరామః ' అంటే ఆనందాన్ని కలుగజేసేవాడు అనికూడా అర్ధం. అంతేకాదు బాల్యం నుండే రాముని చేష్టలుకానీ మాటలుకానీ అతి మధురంగా ఉంటాయి. తన తమ్ముల పట్ల అన్నగా నిరంతరం బాధ్యతగా ప్రవర్తించేవాడు కూడా, అపారమైన ప్రేమవాత్సల్యాలను చూపేవాడు.
ఇతరుల ఆనందమే తన ఆనందంగా భావించేవాడు. ఒక చిన్న సంఘటన చూడండి.
అప్పుడు రాముడు బాలుడు. ప్రతినిత్యం తన తమ్ములైన భరత, లక్ష్మణ, శతృఘ్నులతో బంతాట ఆడేవాడు. సమర్ధుడూ, లాఘవం తెల్సినవాడూ కనుక ప్రతిరోజూ రామునిదే విజయం, తమ్ములు ముగ్గురూనూ అన్నైన రాముడు గెలిచినందుకు సంతోషించేవారు. ఒకరోజున బంతాట అయ్యాక రాముడు పరుగుపరుగున తల్లి కౌసల్య వద్దకువచ్చి  'అమ్మా! ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది' అంటాడు.
కౌసల్య స్వేదంతో నిండి ఉన్న ప్రియ తనయుని ముఖాన్ని, తన పట్టు చేలాంచలంతో అద్దుతూ ఎందుకు కుమారా! అంత సంతోషం. నీవు నిత్య సంతోషివే కదా! ఈరోజు ప్రత్యేకత ఏముందీ, అని అడుగుతుంది.
తల్లీ! ఈరోజున నా తమ్ముడు భరతుడు బంతాటలో విజయుడయ్యాడు. అందుకే నాకు ఇంత సంతోషం అంటూ చిన్నగా గెంతసాగాడు. ఇంతలో తమ్ములు ముగ్గురూ పరుగుపరుగున కౌసల్య మందిరానికి వచ్చి, అమ్మా! అమ్మా! అన్నెక్కడా!! ఈరోజు మేం ముగ్గురం చాలా విచారంగా ఉన్నాం. అంటారు, దుఃఖిత వదనాలతో.  
అమ్మా! నేను మరీ విచారంగా ఉన్నాను. ఈరోజు అన్న రాముడు బంతాటలో తాను ఓడి నన్ను గెలిపించాడు. అంటూ బాధపడసాగాడు భరతుడు.. కౌసల్య చిరునవ్వు నవ్వి  నాయనలారా! రాముడేమో ఈరోజు బంతాటలో తమ్ముడు భరతుడు విజయం సాధించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. మీరేమో అన్న రాముడు ఓడిపోయినందుకు బాధపడుతున్నారు. భరతుని గెలుపు రాముని సంతోషమూ, ఆమోదమూనూ, మరి మీరు విచారించడం ఎందుకూ అంది చిరునవ్వుతో.
అమ్మా! అన్న ఓడిపోడం ఎరుగుదుమా! విన్నామా! తాను కావాలని ఓడిపోయి నన్ను గెలిపించాడు. అంటూ కళ్ళు తుడుచుకోసాగాడు భరతుడు.
భరతా! నీ విజయం నాకెంతో  ముదావహం. నీవు వివారించకు. అంటూ తమ్ముని భుజం తట్టసాగాడు రాముడు.
కౌసల్య... నాయనలారా! మీ పరస్పర ప్రేమాభిమానాలు నాకు చాలా సంతోషం కలిగిస్తున్నాయి మీరు ఇలాగే మీస్వభావాలను శాశ్వతంగా నిలుపుకోవాలని నా అభిలాష. మీలో ఎవరు విజయం పొందినా అది అందరిదీనీ, ఆవిజయం మన రఘువంశానిదే కదా! అంటూ అందరినీ దగ్గరకు తీసుకుంటుంది.
రాముడు బాల్యం నుంచే అలా తన తమ్ముల ఆనందమే తన ఆనందంగా ప్రవర్తించేవాడు.
మరి ఈ రామావతారంలో వారు ప్రత్యేకంగా మానవులకు ఎలా ఆదర్శప్రాయులయ్యారో రామకధను మనస్సుకు పట్టించుకుంటే కానీ తెలీదు. రాముని సేవించిన కపులు అనితర సాధ్యమైన వారధిని ఐదు రోజుల్లో నిర్మించగలిగారు అది రామనామ మహత్వం. 
విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి కట్టారు. వానర భల్లూకసేనలు రాక్షసులనందర్నీ సమూలంగా నిర్జించాయి. ఇదీ రామనామ మహిమే! వారధి కట్టడంలో ఉడుత సైతం సముద్రపు నీటిలో మునిగి ఆ తర్వాత ఇసుకలో తన శరీరాన్ని పొర్లించి వారధికట్టే రాళ్ళపై ఆ ఇసుకని విదిల్చసాగింది. రామ కార్యానికై తన వంతు కృషి చేసినందుకు రాముడు సంతసించి దాని శరీరాన్ని మూడు వేళ్ళతో నిమురగా చారలు పడ్డాయిట! అంటే రాముడు చిన్నప్రాణి సేవనుకూడా గుర్తించేంత ఉత్తముడన్నమాట.
అరణ్య వాస సమయంలో ఒకమారు రాముడు నదీతీరంలోని ఇసుకలో తన విల్లునుంచి, చేతిలోని బాణాన్ని ఇసుకలో గ్రుచ్చి, ముఖ ప్రక్షాళన కావించుకుని వచ్చి గ్రుచ్చిన బాణం లాగగా దాని కొసకు రక్తం అంటి ఉండటం చూస్తాడు. ఆశ్చర్యంగా అక్కడ ఇసుక త్రవ్వి చూడగా ఇసుకలో ఒక కప్ప ఉంటుంది, దాన్ని బయటకు తీసి ఉపచారం చేసి ఓ మండూకమా! నాబాణం దిగగానే నీవు నన్నేల పిలువవైతివి అని ప్రశ్నించగా, ఆ అజిరము రామా! ఏమి నాభాగ్యము నేడు కదా నా జన్మ తరించినది. ఈ దెబ్బవలన కదా నాజన్మ సార్ధకమగునట్లు భగవాన్ రాముని అరచేత నిల్చితిని రామా! నాకెవరైనా ఆపద కలిగించినచో నేను 'రామా! అని తమను సాయంకోసం అర్థించే దాన్ని, కానీ, రామా నీ బాణమే నా మేనిలో దిగినపుడు సాయంకోసం మరెవర్ని అర్థించగలను. అందుకే నీ బాణం కలిగించిన బాధను ఓర్చుకుని ఉన్నాను అంటుందిట. రాముడు కారుణ్య  భావంతో దాని గాయాన్ని నయం చేస్తాడు. చూశారా! రాముని దయా స్వభావం. అంత చిరు జీవి కదాని దాన్ని పట్టించుకోకుండా వెళ్ళక దానిబాధ నివృత్తి చేసిన దయామూర్తి రాముడు.
మరొక మహాగొప్ప సంఘటన చెపుకుందాం. రామునికి మహిళల పట్లగల ఔదార్యం, గౌరవం మహా గొప్పవి.
రామ రావణ యుధ్ధంలో, రావణుడు సర్వ సేనా సహితంగా మరణించాక, ఎంతోకాలంగా నిల్చుని ఉండి కాళ్ళు పీకుతుండగా రాముడు ఒక ఎత్తైన రాతిమీద కాళ్ళూ బార్లగా జాపుకుని కూర్చుని సేదతీరుతున్నసమయంలో, దూరం నుండీ అక్కడికి ఒక స్త్రీ మూర్తి వస్తున్నట్లుగా గమనిస్తాడు. ఆమె మరికాస్త దగ్గరకు రాగానే చాపుకున్న తన కాళ్ళను ముడుచుకుని లేచి నిలుచుంటాడు.
అమ్మా! మీరెవరు ఈ నిశీధిలో, పీనుగుల గుట్టల మధ్య, వంటరిగా ఇలా నిర్భయంగా ఎందుకొచ్చినట్లూ అని ప్రశ్నిస్తాడు.
ఆమె చేతులు మోడ్చి రామా! నేను రావణుని పట్టపురాణిని మడోదరిని. నాకు ఎంతోకాలంగా మిమ్ము చూడాలనే కోరిక ఉండినది. ఐతే నేను విరోధిని చూడను నాభర్త అనుమతించడు. పైగా నాకు కొన్ని కట్టుబాట్లు, నిబంధనలూ ఉంటాయి. ఇప్పుడు అంతా మరణించాక నాకు ఏ అవరోధమూ లేదు కనుక, సకలగుణాభిరాముడనీ, సీతను తప్ప ఏ ఇతరస్త్రీనీ ముట్టుకోడనీ, ముట్టనివ్వడనీ విన్నాను. నా భర్త పరాయిస్త్రీలందరినీ నిర్భంధించి తన కౌగిట బంధించి బాధించేవాడు. పరస్త్రీల పట్ల మాతృభావం కల అంతటి ఉత్తమునీ, సకల సద్గుణాభిరామునీ, ఔన్నత్య మూర్తిని దర్శించి తరించాలనే మనసు తీరింది. వస్తాను, అని నమస్కరించి వెళుతుంది మండోదరి.
ఇదీ రాముని ఔన్నత్యానికి నిదర్శనం. అంతేకాదు రాముడు, సీతాకూడా చాలా హాస్య స్వభావులు. రాముని వివాహమయ్యాక ఒకరోజున వంటరిగా సీతతో పరిహాసమడుతూ రాముడు..  'సీతా మా అయోధ్యలో ప్రజలు నేల చాలుకు నాగళ్ళకు ’ఆడబిడ్డలు’ పుడుతున్నారని విని భయంతో భూమిదున్ననే సందేహిస్తున్నారు సుమా!' అన్నాట్ట పరిహాసంగా నవ్వుతూ.
సీత తల ఊచి 'అయ్యో... సత్యమా! మరి మా విదర్భ రాజ్యంలో ప్రజలంతా పండుగలకూ పబ్బాలకూ పాయసం వండుకోనే భయపడుతున్నారుట! పాయసానికి మగబిడ్డలు పుడుతున్నారని వారికి భయంట!' అంటుంది మరో విసురు విసుర్తూ. ఇద్దరికిద్దరూ పరిహాస ప్రియులే!
ఇహ సీతా మాత రామాయణంలో చాలా కధలు చెప్తుంది. సీత రామ లక్ష్మణులు వనవాస సమయంలో రోజుకో ఆశ్రమంలో నివసిస్తూ వారితో సత్సంగాలు చేసుకుంటూ ధర్మమీమాంస చేస్తూ వెళ్ళేవారుట! ఒక మారువారు ఒక ఆశ్రమాన్ని దర్శించను బయల్దేరుతుండగా సీత రాముని ధనుర్భాణాలు అందిస్తూ చిరునవ్వు నవ్వుతుంది. మెల్లిగా నాధా! వనవాసానికి వచ్చి, మీరిలా ఈ ధనుర్భాణాలు రోజూ ధరించడం నాకు ఆశ్చర్యంగా ఉంది సుమా! ఇవి ప్రస్తుతం, మనకు అవసరమా! అందిట. రాముడు నవ్వి  సీతా! మనం మునివేష ధారులమే కానీ మన స్వీయ రక్షణార్ధం బాణాలు ధరించడంలో తప్పేముందీ! అన్నాట్ట.
స్వామీ! నేను పసితనంలో ఉండగా మా తల్లిగారు నాకు చెప్పిన ఒక కధ గుర్తు వస్తున్నది చెప్పమన్నారా అందిట. 'రాముడు అరుగుపై కూర్చుని, చెప్పు వింటాను అన్నాట్ట. సీతమ్మ తల్లి, నాటికే నేటికీ ప్రభోధాత్మకమైన ఒక కధ ఇలా చెప్పిందిట. సీత తానూ కూర్చుని చెప్పసాగింది.
“పూర్వం ఒక ముని తపస్సు చేసుకుంటూ భగవత్ ధ్యానంలో కాలం గడపసాగాడు. ఆయన తపో మహిమకు భయపడ్డ ఇంద్రుడు తన పదవికి భంగం కలుగుతుందనే భీతితో యోచించి ఒక పధకం పన్నాడు. తాను ఒక బ్రాహ్మణ రూపంలో, పదునైన తళతళ లాడే ఒక పొడవైన కత్తిని జాగ్రత్తగా ఒరలో ఉంచుకుని ఆ ముని ఆశ్రమానికి వస్తాడు. ఆ ముని తపస్సు చాలించి విశ్రాంతి పొందేవేళ చూసి కళ్ళుతెరచి నంతనే సమీపిస్తాడు.
ఓ మునీశ్వరా నీవే దిక్కు రక్షించు.” అంటూ పాదాలపై బడతాడు. ముని,  బిడ్డా! నీవెవరు నీకొచ్చిన కష్టమేమి చెప్పు, నాచేతనైనదైతే తప్పక నీఇబ్బంది తీర్చే ప్రయత్నం చేస్తాను, అని అభయమిస్తా డు.
స్వామీ! మీరు చేయతగినదే! నేను ఒక పనిమీద  దూరప్రాంతం వెళ్ళవలసి వచ్చింది. నా ఈ కరవాలం నాప్రయాణానికి సమస్యగా ఉంది. దీన్ని జాగ్రత్త పరచను ఎవ్వరూ అంగీకరించడంలేదు. అందుకే  మిమ్ము ఆశ్రయించాను. దీని పదును తరుగ కుండా ప్రతినిత్యం తైలం అద్ది తుడిచి శుభ్రపరచి ఒరలో ఉంచాలి. మీకు శ్రమ ఇస్తున్నందుకు మన్నించండి మునీంద్రా! అంటూ వినయంగా చేతులు జోడించి నమస్కరిస్తాడు. ఆ మారు వేషధారి ఇంద్రుడనీ, అతడి కోరిక సరైనది కాదనీ, తన నిత్య కృత్యాలకు దానివల్ల ఆటంకం రానున్నదనీ గ్రహించలేని ఆముని ఆ బ్రాహ్మణుని కోరిక మన్నించి పంపుతాడు. లోకోపకారమే కదా మా ధర్మం! తప్పక నీకరవాలాన్ని మాఆశ్రమంలో భద్రపరుస్తాను వెళ్ళిరా బ్రాహ్మణోత్తమా! అని హామీ కూడా ఇస్తాడు. 
ఆరోజునుండీ ఆముని తన తపస్సు పక్కనపెట్టి, ప్రతిరోజూ స్వయంగా ఆకత్తిని  ఒరలోంచీ తీసి తైలంపూసి మెత్తని వస్త్రంతో తుడిచి శుభ్రపరచి తిరిగిదాన్ని ఒరలో ఉంచడం దిన చర్యగా మారుతుంది. కొంతకాలానికి తనమాట మేరకు దాన్ని చక్కగా శుభ్రపరుస్తున్నానో లేదో అనే  భావన మనస్సులో బలపడి దాన్ని తీసిచూడటం, పదును పరీక్షించడం మొదలెడతాడు. అతడి తపస్సు, ధ్యానం అటకెక్కుతాయి. మనస్సంతా ఆకర వాలం మీదే! కళ్ళుమూసినా తెరచిన్నా ఆ కత్తే కనిపించసాగింది. కొంతకాలమయ్యాక ఆకత్తిని  చేత్తోపట్టుకుని నడవసాగాడు. 
ఒకరోజున  అతడి కరవాలం తగిలి ఒక చిన్న మొక్క తెగిపోతుంది. ఆముని ఆహా! కరవాలం తగులగానే మొక్క తెగి పోయిందంటే దానికి పదును చక్కగా ఉంది, మరి ఈ వృక్ష శాఖ తెగుతుందేమో  చూద్దామని తలచి, ఒక వృక్ష శాఖను నరి కాడు. ఒక్క వేటుతో అది తెగిపడింది. ఆమునికిఎంతో సంతోషమైంది. అలాఆ అడవి లోనిమొక్కలు, వృక్షశాఖలను నరక సాగాడు, క్రమేపీ ఎదురైన జంతువులనూ, అడవిలో కనిపించిన మనుష్యులను సైతం నరికి నరహంతకునిగా మారి పోయాడు. అతడి తపస్సు కార్యక్రమాలన్ని నశించి, ఒక క్రూరునిగా తయారై, మరణానంతరం యమలోకాన్ని చేరాడు.
ఆయుధాలు ధరించి ఉంటే జరిగే అనర్ధాన్ని నేను ఈకధ వల్ల విన్నందున మీరు ఈ అరణ్య వాసంలో ఈధనుస్సు, బాణాలూ ధరించవలసిన అవసరం ఉందాని నా శంక కొలదీ అడుగుతున్నాను. అంది సీతమ్మతల్లి.
ఇలా రామాయణంలో ప్రతిపాత్రా రానున్న యుగాల్లోని మానవులకు ఆదర్శంగా నీతులనూ, కర్తవ్యబోధనూ చేసినవారే! ఇలా రామాయణం సర్వ వేళాలా సర్వ జనాళికీ ఆదర్శమైంది. 
వింటే రామాయణం వినాలి, తింటేగారెలు మాత్రమే తినాలి అనే మాట వినే ఉంటారు. రామాయణం సుధామధుర సమమైంది.  అందుకే ఈ పద్యం వినండి.
చక్కెరకంతె తీపి దధిసారముకంటెను రుచ్యమౌను పెం
పెక్కిన తేనెకన్న అతిరుచ్యమునీటనుపల్క పల్కగా
మిక్కిలి కమ్మనౌ అమృతమే యనిపించును కాన నిత్యమున్
చక్కగ దాన్ని మీరు మనసా!స్మరియింపుడు రామనామమున్--

భక్తాగ్రేసరులారా! ఈరోజున శ్రీరామనవమి సందర్భంగా మనందరం రామ చరిత్ర కాస్తంత సేపు చెప్పుకుని తరించాం. పవమాన సుతుడు పట్టుపాదారవిందములకూ నీనామ రూపములకూ నిత్య జయా మంగళం నిత్యంజయామంగళం.. అంటూ హారతి ఇచ్చాడు ఉపన్యాసకుడు. అంతా హారతి అద్దుకుని ప్రసాదం స్వీకరించి , ఇంటిదారిపట్టారు.
ఏరా మనవడా! రామాయణంలో ఏమీ లేదా వడపప్పు నముల్తూ అడిగాడు తాత. 
'తప్పైపోయింది తాతా, రామాయణమంటే ఏంటో తెలిసింది. రామనామం లోని గొప్పదనం తెలిసింది, మరెప్పుడూ నీరాముడ్ని, కాదు కాదు మన రాముడ్ని ఏమీ అనను గాక అనను' అంటూ లెంపలేసుకున్నాడు మనవడు టపటపామని.
ఓం శ్రీ రామాయ నమః

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రభ.కామ్‌ పాఠకులకోసం ఆదూరి హైమవతిగారు పంపిన ప్రత్యేక కథ.

Monday 10 March 2014

పరీక్ష.

హోం >> చిన్నారి Andhraprabha.com

పరీక్ష.

రచన: ఆదూరి హైమవతి

అదో ప్రాధమికోన్నత పాఠశాల. అసెంబ్లీ సమావేశం జరుగుతున్నది. హెడ్మాస్టర్ గారు పిల్లలనుద్దేశించి మాట్లాడుతున్నారు. "పిల్లలూ! ఈరోజు మన పాఠశాలలో ఒక ప్రత్యేకమైన పండుగ. అందరూ మొదటి పీరియడ్లో మీమీ తరగతులను అలంకరించుకోవాలి. ఒకగంట తర్వాత మీ తరగతి గదులను పరిశీలించి ఎవరి తరగతి గది అందంగా ఉంటుందో ఆ తరగతి పిల్లలకంతా అభినందన పత్రాలూ, కలర్ పెన్సిల్స్ బహుమానం. అసెంబ్లీకాగానే మీమీ తరగతి గదులను హడావిడి లేకుండా నిశ్శబ్దంగా శుభ్రపరచుకోండి.." అని తన ప్రసంగం పూర్తిచేశారు.

అసెంబ్లీ పూర్తయి అంతా తమ గదుల్లోకి వెళ్ళారు. ఎంత నిశ్శబ్దంగా ఉండాలని హెడ్మాస్టర్ చెప్పినా అన్నితరగతి గదుల్లోంచీ పెద్దగా మాటలు, హడావిడీ వినిపిస్తూనే ఉంది. ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ వరండాల్లో తిరుగుతూ అన్నీ గమనిస్తూనే ఉన్నారు.

గంట సమయం పూర్తి కాగానే బెల్ మ్రోగింది. పిల్లలంతా తమ బెంచీల్లో కూర్చున్నారు. హెడ్మాస్టర్ టీచర్లందరితోపాటు ఒక్కోక్లాసూ పరిశీలిస్తూ అన్ని తరగతులూ తిరిగారు. పిల్లలందరికీ ఒకే టెన్షన్. ఏ తరగతికి ఈబహుమతి వచ్చి ఉంటుందో' అని. 

సాయంకాలం కానే ఐంది. పిల్లలంతా నిశ్శబ్దంగా వచ్చి అసెంబ్లీలో లైన్లలో నిల్చున్నారు.

హెడ్మాస్టర్ గారు "పిల్లలూ! మీరంతా ఎంతో అందంగా మీమీ తరగతి గదులను అలంకరించుకోడం చాలాసంతోషం. ఐతే మేము మధ్యాహ్నం లంచవర్లో ప్రతి తరగతి నుంచీ ఆయా తరగతుల లీడర్లను పంపి మేము వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నాము. ఇప్పుడు ప్రతితరగతి లీడరూ వచ్చి వారు ప్రతి తరగతిలో తాము చూసిన అంశాలంపై తమ అభిప్రాయాలను అసెంబ్లీలో అందరితో పంచుకోవాలని కోరుతున్నాను. ఆ తర్వాతే బహుమతి ఎవరికో ప్రకటిస్తాము." అని చెప్పారు.   

ముందుగా ఏడోతరగతి నుంచీ ఆతరగతి లీడర్ ఏడుకొండలువచ్చి "మాక్లాస్‌ను మేము బాగా శుభ్రపరుచుకుని , గోడల దుమ్ము దులుపుకుని మా బెంచీలన్నీ శుభ్రంచేసుకున్నాం. అందరికంటే మా క్లాసే పరిశుభ్రంగాఉంది. ఆరో తరగతివారు, దుమ్మంతా కిటికీలోంచి బయటపోశారు. ఐదో తరగతి మూలల్లో బూజు ఉంది. నాల్గోతరగతి వారి బెంచీలమీద దుమ్ము ఉంది. మూడో తరగతిలో నేలమీదంతా రంగు చాక్పీసులతో పిచ్చిపిచ్చిగా ముగ్గులేశారు. రెండోతరగతిలో దుమ్ము ఉంది. ఒకటో తరగతి గోడలనిండా పిచ్చిరాతలే.అందరికంటే మాక్లాసే బ్యూటిఫుల్ గా ఉంది. ఈ పరిశుభ్రతా  బహుమతి మాకే రావాలి " అని వెళ్ళితనలైన్లో నిల్చున్నాడు.

అలా అన్నిక్లాసుల లీడర్లూ వచ్చి తమ ఉద్దేశాలనూ, తాము అన్నితరగతుల్లో గమనించిన విషయాలనూ చెప్పారు చివరగా ఒకటో తరగతి లీడర్ లాస్య ఛాన్స్ వచ్చింది. 

లాస్య వచ్చి “టీచర్లందరికీ నమస్కారం! ఫెద్దతరగతి అన్నలకూ అక్కలకూ నమస్కారం! నేను ఒకటో తరగతి. స్కూల్ అందరి లోకీ మేముచాలా చిన్నవాళ్ళం. ఐతే నేను మన హెడ్మాస్టర్ గారు చెప్పినట్లుగా అన్ని తరగతి గదులూ తిరిగాను. ఏడోతరగతి వారు రంగు కాయితాలతో గదిని బాగా అంకరించుకున్నారు. ఆగది చాలా బావుంది. అన్ని బెంచీలూ శుభ్రంతా తుడుచుకున్నారు. నల్లబల్ల కూడా బాగా తుడుచుకున్నారు. ఆరోతరగతి వారు తమ గదిని పూలతో అలంకరించారు. ఐదోతరగతి వారు తమ గదిని కాయితం పూలతో అలంకరించుకున్నారు. నాలుగో తరగతి వారు వారి గది అంతా కడుక్కున్నారు. మూడో తరగతివారు వారి బల్లలను గదిచుట్టూ గుండ్రగా వేసుకుని మధ్యలో ముగ్గులు వేసి, దానిలో టీచర్ కుర్చీ వేసి ఆకుర్చీమీద పూలు పెట్టారు. రెండోతరగతి వారు వారి తరగతిని చిమ్ముకుని తమ తెలుగు వాచకంలోని సరస్వతి బొమ్మను చింపి గోడమీద అంటించారు. నేను అన్ని తరగతుల్లో గమనించిన విషయాలు ఇవే సారూ!" అని చేతులు కట్టుకుని చెప్పింది.

“లాస్యా! మరి అందరి తరగతుల అందంగురించీ చాలా బాగా చెప్పావు కానీ నీతరగతి గురించీ చెప్పలేదేం అన్ని తరగతుల లీడర్లూ వారిగది ఎలా అలంకరించుకున్నారో చెప్పారు, నీవుకూడా చెప్పుమరి ?” అని అడిగారు హెడ్మాష్టర్ గారు. 

“సారూ! మేము ఒకటో తరగతి కదా! మా గదిని బాగా అలంకరించుకోడం మాకు అంతగా రాదు. మేము మాగదిని చీపురుతో తుడుచుకుని, మన బడి చిమ్మే రావులమ్మ వద్ద ఒక గుడ్డ తీసుకుని తడిబట్టతో తుడుచుకున్నాం, ఎందుకంటే నీటితో కడిగితే మాగది ముందు నీరు నిలిచి మేము జారిపడతామని, ఆ తర్వాత మా బల్లలన్నీ ఒకే లైన్ లోకి జరుపుకుని, మా బేగులన్నీ వాటిక్రింద పెట్టుకున్నాం, మా చెప్పులన్నీ మా తరగతి ముందు ఒకే వరుసలో పెట్టుకున్నాం. మాకు వచ్చిన అక్షరాలు, అంకెలూ అన్నీ మా గది నాలుగు గోడలకు ఉన్న నల్లబల్లపై ఎవరి ఎదురుగా వాళ్ళం రాసు కున్నాం.  రావులమ్మ నడిగి ఒకపాత అట్టపెట్టె తెచ్చుకుని ఒకమూలగా చెత్త వేసుకోను, మా పెనిసెళ్ళు చెక్కుకున్న పొట్టుగదిలో పడకుండా వేసు కోను, పెట్టుకున్నాం, రంగు కాయితాలు కానీ, పూలమాలలు కానీ కట్టుకోనూ, ముగ్గు లేసుకోనూ మాచేత కాలేదు. అందుకని మా గదిని మేము ఇంతే చేసుకున్నాం సారూ! అందుకే మాగది అందరి గదుల కంటే అందంగా లేదు." అని మెల్లిగా, స్పష్టంగా  చెప్పింది లాస్య. 

ముందుగా హెడ్మాస్టర్ గారు క్లాప్స్ ఇచ్చారు, ఆతర్వాత టీచర్లంతా క్లాప్స్ ఇచ్చారు. అదిచూసి అన్ని తరగతుల పిల్లలూ క్లాప్స్ ఇచ్చారు.

"గుడ్ లాస్యా! అందుకే మీ ఒకటో తరగతికే ఈ పరిశుభ్రతా బహుమతి ఇస్తున్నాం. ఎందుకంటే ముందుగా శుభ్ర పరుచుకోవలసినది మనస్సును. అది మీ తరగతి లీడరుగా నీకుంది. పెద్ద తరగతుల వారి గదుల అందం, శుభ్రతా గురించి చక్కగా చెప్పావు. నేను అడిగేవరకూ మీ తరగతి గురించీ చెప్పనేలేదు. తమ గురించీ తక్కువగా చెప్పుకోడం పెద్దవారి గురించిన మంచిని ఎక్కువగా చెప్పడం సంస్కారం. పైగా తరగతి గది ఎలా ఉండాలో మీ ఒకటో తరగతి గది అలాగే ఉంది. మీకు వచ్చిన అక్షరాలనూ, అంకెలనూ, బొమ్మలనూ  బోర్డుమీద మీకు  కేటాయించిన స్థలంలో వ్రాశారు.బల్లలనూ, బ్యాగులనూ, చివరకు చెప్పులనూ వరుసగా ఉంచుకున్నారు. నీళ్ళతో కడిగిన మిగతా క్లాసులముందు నీరు చేరి తడిగాఉంది. మీతరగతి గదిముందు తడే లేదు, ఒక అట్టపెట్టె చెత్తవేయను స్వయంగా ఆలోచించి తెచ్చి ఉంచుకోడం గొప్ప ఆలోచన. 

ఉన్నదాంతో మీగదిని ఒక తరగతి గదిలా రూపొందించిన మీ తరగతికే బహు మతి, ఒకటో తరగతి పిల్లలంతా చిన్నవారైనా తమ లీడర్ మాటలను విని అన్ని తరగతుల కంటే నిశ్శబ్దంగా పని చేసుకున్నారు. సాధారణంగా చిన్న పిల్లల తరగతిలోనే ఎక్కువ అల్లరి ఉంటుంది, దానికి వేరుగా మీ తరగతి గది నిశ్శబ్దంగా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ తరగతి ఉపాధ్యాయిని ని  నేను అభినందిస్తున్నాను. దీని వెనుక ఆమెకృషి ఎంతగానో ఉంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆమెకు ప్రత్యేక బహుమతి ఈ పూల  బొకే ఇస్తున్నాము.

చిన్న వారైనా వారిలోని క్రమశిక్షణకు వారిని అభినందిస్తూ ఒకటో తరగతి పిల్లలందరికీ  ప్రశంసాపత్రాలూ, రంగుపెన్సిళ్ళూ బహుమతిగా ఇస్తున్నాను. చిన్నదైనా పెద్దవారిని గౌరవించడం, తన తరగతి గది అలంకరణలో పిల్లలందరినీ కలుపుకు పోయి ఈ విజయం సాధించిన, నాయకత్వ లక్షణాన్ని పుణికి పుచ్చుకున్న లాస్యకు నా ప్రత్యేక బహుమతి ఈ బొమ్మల పుస్తకం. ఈ శుభ్రత నిజానికి తరగతి గదికి కాదు మనస్సులకు, మంచితనానికీ పరీక్ష." 

అంటూ హెడ్మాస్టర్ గారు బహుమతి లాస్యకు ఇవ్వగానే ఆ ప్రాంతమంతా చప్పట్ల శబ్దంతో నిండిపోయింది.