వేసవి ఇంకా రాకనే ప్రశాంతిపాలెంలో నీటిఎద్దడి మొదలైంది.
వర్షాభావం వలన నూతుల ఊట సన్నగిల్లింది. చెరువులో నీరు ఇంకిపోయింది. నదిలో సైతం నీరు లేకుండాపోయింది. గ్రామస్తులందరూ‌ రచ్చబండ దగ్గర చేరి నీటి సమస్య గురించి మాట్లాడుకోడం ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన పెద్దపంతులు పెరుమాళ్ళయ్యగారు విన్నారు.
ఆమరునాడు ప్రార్ధనా సమయంలో ఆయన తన బడిపిల్లలని అడిగారు- "పిల్లలూ! మీరంతా ఈరోజు స్నానం చేసి వచ్చారా?" అని.
"లేదు సార్! మేము వారానికి ఒక్కసారే స్నానం చేసేది- స్నానం చేయను నీళ్ళు లేవుగా!" అన్నారు కొందరు.
"మేము వారానికి రెండుసార్లు స్నానం చేస్తాం సార్!" అన్నారు మరికొందరు.
"మేము రోజూ స్నానం చేస్తాం సార్! మాఇంట్లో బోరు బావి ఉంది " అన్నారు కొద్దిమంది.
"మంచిది పిల్లలూ ! మన ఊళ్ళో ప్రస్తుతం నీటి ఎద్దడి ఉందికదా, అందుకని మనమంతా నీటిని ఎలా పొదుపు చేయాలో ఆలోచించాలి. మీరు రోజూ స్నానం చేసే చెంబులు ఎంతవి ?ఇంత సైజు ఉంటాయా?" అంటూ బడితోటకు నీరుపోసేందుకు గాను తాను తెచ్చిన చెంబును చూపారాయన. పెద్ద కొబ్బరి బోండాం అంత ఉంది అది. దాన్ని చూడగానే పిల్లలంతా "మా ఇంట్లో చెంబు ఇంతదే సార్" అని కొందరూ, "మా చెంబు ఇంకాపెద్దది సార్" అనికొందరూ చెప్పారు.
"సరి సరి. ఈరోజు సూరి ఎందుకు బడికిరాలేదు?" అడిగారు పెద్ద పంతులుగారు.
"వాడికి జ్వరం వచ్చింది సార్! వాళ్ళింటి ప్రక్కనే మురికి కాలవ ఉంది. దాని నిండా దోమలే దోమలు! పాపం, అవి కుట్టినట్టున్నాయి వాడిని. రాత్రి మందుకోసం వాళ్ల అమ్మ వచ్చింది సార్, మా యింటికి" ఆనంద్ చెప్పాడు- వాళ్ల నాన్న ఆ ఊర్లో వైద్యుడు.
"అలాగా ! మరి మనకు వాడుకునేందుకే నీరులేవే! మీలో కొందరు వారానికి ఒక్కసారి, కొందరు వారానికి రెండుసార్లు స్నానాలు చేస్తున్నారే, మరి అంత నీరు ఎలా చేరుతున్నది, ఆ మురిక్కాలవలోకి? ఆలోచించండి, మనం నీళ్ళని వృధా చేయటం వల్ల, అవి అలా మురిక్కాలవ ల్లోకి పారి, దోమలకు నివాసమై- ….“ అని పంతులుగారు చెబుతుండగానే-
“మనకే జ్వరాలు వస్తున్నాయి సార్ !" పూరించాడు వాసు. వాసు చాలా తెలివైనవాడు.
"అవునురా వాసూ! నువ్వు బాగా గ్రహించావు. మన దగ్గర పది బలపాలు ఉన్నాయను-కుందాం. మరి రోజుకో బలపం చొప్పున వాడి పారేస్తే ఏమవుతుంది, చెప్పు?"
“పదిరోజులకు అవన్నీ ఐపోతాయ్ సార్! "
"కదా మరి! మన దగ్గర ఒకసీసాడు మంచినీళ్ళు ఉన్నాయనుకో. నీళ్ళు క్రిందపడిపోయేలాగా, చొక్కా తడిసి-పోయేలాగా ఆ సీసానెత్తి గటగటా నోట్లో పోసుకు త్రాగితే ఏమవుతుంది, చెప్పండి?"
“ఒక్క గంటకే మంచినీళ్ళన్నీ ఐపోతాయి. మద్దాన్నం బువ్వ తినేటేలకు ఉండవుసార్ ! వాటిని కింద పడ కుండా కొద్ది కొద్దిగా తాగితే, అవి సందేళ వరకూ బద్రంగా ఉంటాయి సార్!”చెప్పింది చెన్నమ్మ.
"కదూ మరి ! మీకు నీళ్ల పొదుపు గురించి బాగానే తెలుసు. ఇప్పుడు మనం మన ఇళ్ళలో నీళ్ళు వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పుకుందాం. మీలో ఎవరైతే వీటిని పాటిస్తారో, వాళ్లకి చక్కని కధల పుస్తకాలు బహుమానం. సరా?! మరి వినండి-" అంటూ పంతులుగారు చెప్పిన సంగతులన్నిటినీ శ్రద్ధగా విన్నారు పిల్లలు.
ఆ రోజునుండీ మొదలైంది- ప్రశాంతిపాలెంలో అసలుకధ. పిల్లలే పిడుగులైనారు. పొదుపరి తనానికి పెద్దలైనారు. పెద్దలకే గురువు లైనారు.
ఆ రోజు నుండీ పిల్లలంతా చేరి ప్రతి ఇంటి ముందూ రెండేసి వేప మొక్కలు నాటారు. అప్పటికే వాళ్ళు దాచిపెట్టుకున్న మొత్తానికి పంతులుగారు ఇచ్చిన సొమ్ము కలిపి, అంతా వాళ్ళవాళ్ల ఇళ్ళలో వాడే స్నానం చెంబులు , మంచినీరు త్రాగే లోటాలు- సగం సైజువి- కొనుక్కొచ్చారు. స్నానపు గదుల వద్ద కాలువలు తీసి, వాడిన నీళ్లన్నీ మొక్కలకు పోయేలా చేశారు:
అమ్మ వంటచేసేప్పుడు దగ్గరుండి " అమ్మా! నువ్వు బియ్యం కడిగిన నీళ్లతోటే పప్పుకూడా కడుగు; ఆ నీళ్లతోనే ఆకుకూరలూ, కూరగాయలూ కూడా కడుగు. వంటగది పక్కనే నేను వేసిన తోటకూర , పుదీనా, బచ్చలి, గోంగూర మొక్కలకు పొయ్యి ఆ నీళ్ళు. నీళ్లను వేటినీ‌ వృధాగా క్రింద పోయనక్కర్లేదు" చెప్పింది పద్మ, వాళ్ళమ్మకు.
"నీకిన్ని విషయాలు ఎలాతెలిశాయి- నాకే పాఠం చెప్తున్నావే!" ఆశ్చర్యంగా అడిగింది పద్మ వాళ్ళ అమ్మ. ఆమె పంచాయితీ ఆఫీస్‌లో గుమాస్తా.
"అమ్మా! బట్టలు ఉతికిన నీళ్ళతోనే స్నానం గది కడిగేసి, ఆ నీళ్లనే పెరట్లో దుమ్ము రేగకుండా చల్లుతాను. నువ్వు ఆ నీళ్లని వృధాగా పారబోయకు" అంది ఆనంది, వాళ్లమ్మతో.
"నాయనా! నువ్వు పొలం నుండి వచ్చాక, మట్టి కాళ్ళు కడుక్కునేందుకు ఒకే చెంబునీళ్లు వాడు. ఈ బండమీద కూర్చుని మెల్లగా కడుక్కో, సరిపోతాయిలే, చూడు" చెప్పాడు నారయ్య , వాళ్ల నాన్నకు.
"నాయనా! స్నానానికి పెద్ద బొక్కెన కాదే, ఈ చిన్న చెంబుతో, చిన్న బొక్కెనన్ని నీళ్ళే వాడాలే! మనింట్లో బోరుబావి ఉందని ఎక్కు వెక్కువ నీళ్ళు వాడితే భూగర్భజలాలు ఇంకిపోతయే ! స్నానం చేయను మామూలు చెంబుతో ఆరు చెంబుల నీరు చాలటనే!" నాన్నకి చెప్పాడు తాతిరెడ్డి.
ఇట్లా పిల్లలంతా పొదుపు పధకాలు అమలుచేసారు. నీళ్లు వృధాకాకుండా, మురికి కాలవ నిండి ప్రవహించకుండా ఆపారు. ఎండి క్రింద పడినవేపాకు తెచ్చి ఇళ్ళముందు మంటలేశారు. వేపనూనెతో దీపాలు వెలిగించారు. మడ్డి, కిరోసిన్, వేప నూనె, ఫినాయిల్ మురికి మీద చిలకరించారు. దాంతో ఊళ్ళో దోమల పోటు తగ్గింది. నీళ్ళను అందరూ పొదుపుగావాడటం వల్ల, క్రమంగా వాడుక నీటి ఇబ్బంది తగ్గింది .
ప్రతి ఇంటిముందూ ఇంకుడు గుంతలు తీసే కార్యక్రమంలో ఊరి జనమంతా పిల్లలకూ, పంతుళ్ళకూ సాయపడ్డారు-
ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఒక్కరోజులో గుంతలు త్రవ్వారు- వాననీళ్ళు రోడ్లెమ్మట పారి పోకుండా చేశారు. రోడ్ల మీద పడిన నీటిని కాలువలద్వారా చెరువుకు మళ్ళించారు. చెరువు గట్ల మీద పెద్ద మానులయ్యే వేప, చింత, రావి, గంగిరేగి మొక్కలు నాటారు. ఊరు ఊరంతా తలా కొన్నిమొక్కల్ని దత్తత తీసుకుని పెంచసాగింది.
ఇంతలో వేసవి వెళ్ళి వర్షా కాలం వచ్చేసింది.
ఎక్కడపడ్డ చినుకును అక్కడే జాగ్రత్త చేయటం వలన బావుల నిండా నీరు చేరింది; చెరువు అలుగు(మరవ) పారింది; నది నిండుగా ప్రవహించింది. ఆ యేడాది పంటలు చక్కగాపండాయి. రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
తను అన్న మాట ప్రకారం పెద్ద పంతులుగారు పిల్లలందరికీ కథల పుస్తకాలు బహుమతులుగా ఇచ్చారు!
మార్చి 2013 కొత్తపల్లి - తెలుగు పిల్లల ఈ(e) మాస పత్రిక ప్రచురితం --