Tuesday 4 August 2020

దేశమాత దీవెన.


దేదేశమాత దీవెన. 


   ఆరోజు తమ మేనకోడలికి పెళ్ళి కుదిరిందని వచ్చిన ఉత్తరం పట్టుకుని ఆఘమేఘాలమీద బయలుదేరి వచ్చింది మేనత్త మేఘన.
   " ఏంటీ! ఒక్కగా నొక్క కూతుర్ని మీలటరీలో పని చేసేవాడికిచ్చి చేస్తున్నారా రాఘవా!అన్నయ్యా!వారికి లేకపోతే నీకన్నా ఆలోచన ఉండద్దూ! మీ అందరికీ ఏమన్నా పిచ్చా? ఎం.ఏ. చదివి టీచరుద్యోగం చేస్తున్న రుద్రమణికి పెళ్ళికొడుకే దొరకడా! ముగ్గురన్నలముద్దుల చెల్లాయి రుద్రమణి!.."అంటూ ఏదేదో మాట్లాడుతున్న మేనత్త మాటలకు అడ్డొచ్చాడు మణి పెద్దన్న ప్రదీప్ రాఘవన్  .
"అత్తా! మణి ఇష్టపడ్డాకే ఈ సంబంధం స్థిరం చేశాం. వాళ్ళ స్కూల్లో పని  చేసే పెద్ద పంతులు ప్రకాశం గారి ఏకైక కుమారుడు శివాజీ.వారిది దేశభక్తి గలకుటుంబం. చాలా మంచి మనుషులు .అంతా సెటి లైంది మేఘనత్తా! ముందుగా నీకే తెలియపరచాము. నీకంటే మాకు ముఖ్యులు ఎవరున్నారు చెప్పు!వివాహం కూడా చాలా సింపుల్గా చేయమన్నారు.నీకు తెల్సుగా మణికి దేశభక్తి ఎక్కువని, దేశానికి సేవచేసేవాడే తనకు భర్తగా కావాలని పెట్టు పట్టింది అత్తా!"  అని ఆమెను స్థిమిత పరిచాడు ప్రదీప్ రాఘవన్  .
 అంతావిన్నాక అంగీకరించింది మేఘన. ఆమెకు రుద్రమణి అంటే ప్రాణం.తనకు కొడుకులు లేక పోడాన తన ఇద్దరు కూతుళ్ళతో కలుపుకుని మూడో కూతురిలా ప్రేమిస్తుంది ఆమె రుద్రమణిని.కొడుకు వుంటే  మణిని వదులుకునేది కాదు. 
అంతా తానేఐ చకచకా పెళ్ళిపనులు చేసింది మేఘన. అలా అనుభవమున్న మేఘనత్త తోడుగా వుండి అన్నీ చేయడం అందరికీ చాలా సంతోషాన్నీ ,తృప్తినీ ఇచ్చింది. పెళ్ళిపనులన్నీ కుదురుగా పూర్తై  శివాజీకీ రుద్రమణికీ వివాహం జరిగిపోయింది.
  శివాజీ శలవు పూర్తై తిరిగి డ్యూటీలో జాయినవను వెళ్తూ మణితో ఇలా అన్నాడు.
"మణీ! నీలాంటి భార్య నాకూ, నీవంటి ఉత్తమురాలు కోడలుగా మా తలిదండ్రులకూ లభించడం మా అదృష్టం. ఒకరకంగా నీకుమాత్రం అన్యాయమే! నేను యాడాదికి మూడు నెలలు మాత్రమే రాగలను. అదీ నమ్మకం వుండదు ఒక్కోమారు. అందాకా అమ్మా నాన్నలకు నీవే దిక్కు, వారే నీకు అండా దండా." అంటూ బాధ పడ్దాడు.
" మీరేమీ విచారించ కండి, వారిని మీలాగా చూసుకుంటాను. దేశమంటే ఇలా భక్తి ఉన్న వ్యక్తి నాకు భర్తగా లభించాలని కోరుకున్నాను. నా కోరికను భగవంతుడు తీర్చాడు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. మీ రాక కోసం మేమంతా వేయికళ్ళతో ఎదురుచూస్తుంటాం" అంటూ ధైర్యం చెప్పి పంపింది రుద్రమణి.
మరుసటి సంంవత్సరం లాభంగానే వచ్చాడు  శివాజీ. ప్రెమోషన్ తో. అతడికీ లాభాన్ని అందించింది రుద్రమణి వంశోధ్ధారకునితో.
మరి రెండేళ్ళకు  శివాజీకి ఇంకోప్రెమోషన్ వచ్చింది. అలా అలా శివాజీకి పెద్ద మిలటరీ ఆఫీసరయ్యాడు. రుద్రమణి ముగ్గురు పిల్లల తల్లైంది.ఇద్దరు కొడుకులూ ఒక కుమార్తె.
 భర్త దూరంగా ఉన్నా బిడ్దలను బాగాచదివించి దేశ భక్తులుగా తయారు చేసింది. తండ్రి మరణ వార్త విని వచ్చిన శివాజీ  చివరి రోజుల్లో తాను దగ్గర లేనందుకు  ఎంతో బాధ పడ్డాడు. కర్మ క్రతువులు పూర్తవు తుండగానే దేశ సరిహద్దుల్లో , మనదేశ సరిహద్దులను నియమాలను అతిక్రమించి దాటను యత్నించే విద్రో హుల కదలికలు పసి కట్టిన అధికారులు శివాజీని   వెంట నే రమ్మని టెలిగ్రాం ద్వారా కబురంపారు.
 శివాజీ ఆఘమేఘాలమీద బయల్దేరి తిరిగివెళ్ళాడు . అతడికి దేశమంటే  ప్రాణం. దేశ రక్షణలో తన సర్వస్వాన్నీ అర్పించను వెనుకాడని అద్వితీయ దేశ భక్తుడు  .
 వెళ్ళేముందు" మణీ! ఈ సం.రిటైరై వచ్చేస్తాను. నిన్నూ ,అమ్మనూ, పిల్లల్నూ చూసుకుంటాను." అని చెప్పివెళ్ళాడు.
రుద్రమణి పెద్దకొడుకు మీలటరీ డాక్టర్, రెండో కొడుకు విమానాలు తయారు చేసే కంపెనీలో ఇంజనీర్.కుమార్తె లక్ష్మీబాయి కేంద్రీయ విద్యాలయంలో లెక్చరర్. శివాజీ  రాగానే ముగ్గురికీ పెళ్ళిళ్ళు చేయాలని ఆలోచిస్తూన్న రుద్రమణికి అశనిపాతంవంటి వార్త అందింది.
శివాజీ మరికొందరూ వెళుతున్న యుధ్ధవిమానం మాయమై పోయిందని ఎంతవెతికినా కనపడలేదని దాన్లో శివాజీ  తోపాటుగా పది మందిమిలటరీ ఆఫీసర్లు ఉన్నారనీనీ.
 అతడి తాలూకూ వస్తువులన్నీ పంపుతున్నామని వార్త అంది మణి దిగ్భ్రమలో పడిపోయింది. ఆదిగులుతో భాస్కర్ తల్లి తుది శ్వాస విడిచింది.                                   
 "ఎంతకాలమని చింతిస్తాం చెప్పు చెల్లాయ్! బావగారు దేశభక్తులు, దేశంకోసమే ప్రాణం అర్పించారు. దేశ రక్షణ లో ప్రాణాలను పణంగా పెట్టే అసలైన దేశభక్తులు మిలటరీ ఉద్యోగులు. ఏంచేస్తాం చెప్పు మణీ! కావల్సిన పనులు వేగవంతం చేసుకో, గుండెదిటవు చేసుకో, అన్నీ తెలిసే కదా నీవీ సంబంధం అంగీకరించావు. బావ మనస్సు నీవు దుఃఖించి కష్టపెట్టకు.బావ గారి ఆత్మకుశాంతి ఉండదు. 'ధైర్యే సాహసే మణిః.'అని ఋజువు చేసుకుని బావ ఆత్మకు శాంతి కలిగించు. నీపేరే రుద్రమదేవి నాన్నగారు రుద్రమణి అని నీకు పేరు పెట్టారుకదా! రుద్రమదేవంత ధైర్యం ఉండాలినీకు ఎప్పటికీ. " అని ధైర్యం చెప్పారు అన్నలు ముగ్గురూనూ. 
       మణి అన్నల మాటలు మనస్సుకు పట్టించుకుని ముగ్గురు పిల్లలకూ చక్కని సంబంధాలు అన్నల సాయంతో చూసి వెంట వెంటనే మూడేళ్ళలో ముగ్గురిపిల్లల పెళ్ళుళ్ళూ  చేసేసింది.
    "అమ్మా! ఇంతకాలం ఎంతో ఓర్పుతో నేర్పుగా మమ్మల్ని పెంచి పెద్దచేశావ్. ఇహ నీవు హాయిగా విశ్రాంత జీవనం గడుపు, పెద్దన్నతో హిమాచల్ ప్రదేశ్ లోనో,చిన్నన్నతో బెంగుళూరులోనో, నాతో అలహాబాద్ లోనో ఉండు.వంటరిగా మాత్రం ఇక్కడ ఉండటం మే మెవ్వరం అంగీకరించం." అంది కుమార్తె లక్ష్మీబాయి.                                                         " తల్లీ లక్ష్మీ! మీఅందరికీ అమ్మమీద ఉన్నప్రేమకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీనాన్నతో వివాహం, మీ అందరి పుట్టుకలూ, తాతా, బామ్మగార్లూ నివసించిన ఈ ఇంటిని వదలి నేనెక్కడికీ రాలేను. ఏమో మీనాన్నగారు ఎక్కడైనా బ్రతికి ఉండి ఎప్పటికైనా తిరిగివస్తే నేనిక్కడ లేకపోతే ఎలా? అందరం ఏమయ్యా మో అని ఆయన భయపడరూ?మన జాడ ఆయనకెలా తెలుస్తుంది చెప్పూ?" అంది కళ్ళలోనీరుకారుతుండగా.                                                                                                          " అమ్మా!  నీదెంత పాజిటివ్ థింకింగ్ అమ్మా!ఇలాంటి మనస్సు , ఆలోచన మాకూ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. పాజిటివ్ థింకింగ్ వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, దానివల్ల శుభపరిణామాలు లభిస్తాయి. అమ్మా! నీవెంతో  గొప్ప ఆలోచనాపరురాలివి! " అంటూ తల్లిని ఆలింగనం చేసుకుంది లక్ష్మీబాయి .
 తల్లి అలా అన్నాక ఎవ్వరూ ఆమెను బలవంత పెట్ట లేదు. 
అంతావెళ్ళిపోయాక రుద్రమణి తన ఉపాధ్యాయ వృత్తిలో  మునిగి పోయింది. ఆమెకు వృత్తిపట్ల చాలా ప్రేమ, అంకిత భావమూనూ. బాలబాలికలను దేశభక్తులుగా చేయనేఆమె ఆవృత్తి చేపట్టింది,                                                                                                                 
      ఆరోజు శివాజీ జన్మదినం .రుద్రమణి పనిచేసే స్కూల్లో అతడి సేవల గురించీ , దేశభక్తి గురించీ ఆ నగరం లోని పెద్దలు ఎంతో గొప్పగా ఉపన్యసించారు. సర్కార్ స్కూళ్లలో  పేద పిల్లకందరికీ, వృధ్ధా శ్రమంలో వృధ్ధులకూ, అనాధ శరణాలయాల్లో బిడ్డలకూ , బట్టలూ స్వీట్సూ పంచి వచ్చింది రుద్రమణి  అందరిసహాయంతో.
 రోజులు సాగుతున్నాయి ఎవ్వరిప్రేమేయం లేకుండానే.
శివాజీని అతడి పుట్టిన రోజున అంతా పొగట్టం, అతడి దేశభక్తిని గూర్చి మాట్లాడటం ,విన్నప్పటినుంచీ శివాజీ పదేపదే గుర్తువస్తుండగా మరునాడు ఉదయం అతడి చిత్రపటం ముందు జ్యోతి వెలిగించి ,
" మీ బిడ్డల నందరినీ నా శాయ శక్తులా పెంచిపెద్దచేసి, దేశభక్తులుగా తీర్చిది ద్దాను. మీరు లేరన్న లోటుతప్ప నా బాధ్యత లన్నీ తీర్చుకుని దేనికోసమో తెలీకుండానే ఎదురు చూస్తున్నా ను."అంటూ కంటనీరు పెట్టుకుంటుండగాడోర్బెల్ మోగింది.. 
                                                                                                           వెళ్ళి చూసి ఒక్క క్షణం నిరుత్తరురాలైంది మణి. వచ్చింది ఎవరో కాదు, తాను ఎవరికోసం ఇంతకాలంగా కళ్ళలో వత్తులు వేసుకుని , తప్పక తిరిగి వస్తారని నిండు మనస్సుతో ఎదురుచూస్తూ ఉందో  ,తన సర్వస్వం ఐన శివాజీ!.
 "మణీ ! నేనే!  "అంటూ దగ్గరకొచ్చి ఆలింగనం చేసు కుంటున్న వ్యక్తిని పట్టి పట్టి చూస్తూ "మీరు -- నిజమే నా ! నాకళ్లను నేను నమ్మవచ్చా?" అంది ఉద్వేగం తో.
"మణీ! నేనే! నమ్ము. విమాన ప్రమాదంలో ఎక్కడో పడి పోయాం మేమంతా . అడవిలోంచీ ఎలా బయట పడ్డామో మాకే తెలీదు.కోయ దొరలు కాపాడారు. మాలో కొందరు ఇంకా కోలుకోనే లేదు. మరికొందరు ఏమయ్యా రో తెలీనే లేదు.మా విమానాన్ని ముష్కరులు పేల్చే శారు. క్రిందపడి ప్రాణాలతో ఉండటం చిత్రమే! మెదడుకు తగిలిన దెబ్బవల్ల ఙ్ఞాపకశక్తి పోయింది. నేనేవరో నాకే తెలీకుండా ఈ ఎనిమిదేళ్ళూ గడిచి పోయింది. మనిషిగా ఉన్నానేగానీ ఏమీ తెలియలేదని కోయదొరచెప్పాడు. ఆ ధన్వంతరి కోయదొర వాడిన  మూలికావైద్యం వల్ల 10 రోజులక్రితం తిరిగి నాకు మెల్లిగా ఙ్ఞాపక శక్తి వచ్చింది. మా అధికారులకు సమాచారం తెలిపాను. వారు నిన్ననే నన్ను హెలికాప్టర్ ద్వారా తెచ్చి రాజధానిలో దింపారు. మిగతావారిని వైద్యశాలలకు తరలించారు. తప్పక నీవు ఇక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటావని భావించి నేను వెంట నే వచ్చాను మణీ! నిన్న ఆంధ్ర దేశంవచ్చాక అదృష్టవశాత్తూ పాత న్యూస్ పేపరొకటి దొరికింది. నీవు నా జన్మదినం నాడు చేసిన సేవాకార్యక్రమాల విశే షాలు చదివి ఎంతో సంతోషించాను.ఇదో ఈ పేపర్ వల్లే నీవు ఇంకా ఇక్కడే నాకోసం ఎదురుచూస్తూ ఉన్నావని వచ్చేశాను. "అంటూ శివాజీ చెప్పాక రుద్రమణి వెంటనే ఆశుభ సమాచారం తన బిడ్డలకూ  అన్నలకూ, మేత్తకూతెలియపరిచింది .                                                                              
అంతా  ఆఘమే ఘాల మీద వచ్చి వాలారు.
 అన్నలంతా " అమ్మా! మణీ! నీ జీవితంలో తిరిగి వసంతం వచ్చిందమ్మా! మీ దేశభక్తే మిమ్ము కాపా డింది. దేశమాత కరుణ చాలా గొప్పది." అని సంతోషంతో ఆమె నుదురుపై ముద్దులు పెట్టి ఆనందించారు.
" అమ్మ పాజిటివ్ ఎనర్జీ నాన్నగారిని తిరిగి తెచ్చింది మా ఇంటికి వెలుగు తెచ్చింది. మా నాన్న దేశభక్తీ, మా అమ్మ మంచి మనసూ మా ఇంట తిరిగి వెలుగు నింపింది .మేం మీ పిల్లలం కావడం నిజంగా మా అదృష్టం " అంటూ అమ్మా నాన్నల చుట్టూ తిరుగుతూ క్లాప్స్ కొట్టారు పిల్లలంతా.
మేనత్త వారందరినీ చిరునవ్వు తో మురిపెంగాచుసుకుంటూ అందరికీ పెద్ద పళ్ళెంలో ఎర్రనీటిలో కర్పూరం వెలిగించి దిష్టి తీసింది.