Monday 30 September 2013

వినయానికే విజయం

వినయానికే విజయం


a-pr -   Mon, 30 Sep 2013, IST


తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరాముడు పట్టాభిషేక సమయానికి ధరించ వలసిన ఆభరణాలన్నింటినీ ఒకగదిలో పెద్ద బల్లమీద విడివిడిగా పెట్టారు. అర్ధరాత్రి అయ్యింది ఆగదిలో మెల్లగా కలకలం మొదలైంది. ''ఏంటీ ఇంకా తెల్లవారదు? సూర్యదేవుడి రథాన్ని అనూరుడు ఈ వేళ నెమ్మదిగా తోలుతున్నాడేమిటి చిత్రంగా..! ఎప్పుడు తెల్లారేను ఎప్పుడెప్పుడు నేను శ్రీరాముడి తలపై జేరి ఆనందం పొందేను'' అంది కిరీటం దర్జా ఉట్టిపడే కంఠంతో.
''అదేమి అంత ఠీవి! శౌర్యం వుట్టిపడే ఆయన భుజాలను అలంకరించే మా మాటేంటి? ఆయన బాణం అందుకుని భుజం పైకెత్తితే మొదట కనిపించేది మేమే!'' మోహనంగా ముక్తకంఠంతో అన్నాయి భుజకీర్తులు.
''ఆహా!! ఆయన చేయి పైకెత్తితే ముందు కనిపించేవి మణికట్టును చేరే మా అందాలే'' అన్నాయి మణికంకణాలు.
''అసలు ఆయన కంఠసీమన అలరారే మా అందం మాటేమిటి? సీతమ్మతల్లి కంటే ముందుగా ఆ మహారాజు కంఠసీమను అలంకరించే నా గొప్పతనం ఎవ్వరికీరాదు'' మహా గర్వంగా అంది కంఠమాల.
''ఓహో అలాగా! ఆయన తల తిప్పినప్పుడల్లా మిలమిల మెరుస్తూ గిరగిరా తిరగే మా మాటేమిటి?'' అన్నాయి కర్ణాభరణాలు.
''పాపం అదేం! ఆయన వేళ్లను అలంకరించే మా మాటేంటి! మహారాజు చేయి పైకెత్తి ఆశీర్వాదాలు, ఆజ్ఞలు జారీచేస్తుంటే ముందుగా కనిపించేది మేమే. మీరు మాకంటే గొప్పా'' అని ప్రశ్నించాయి నవరత్నాలు, వజ్రాలు.
''ఆపండి కొంచెం. కర్ణరఠోరంగా ఉన్నాయి మీ మాటలు. రాజముద్రికనైన నాకంటే ఎవ్వరూ గొప్పకాదు. నేనులేంది ఆ రామచంద్రుడు రాజశాసనాలే చేయలేడు'' అంది దర్పాలు పోతూ రాజముద్రిక.
''అసలా మహానుభావుడు సింహాసనం మీద కూర్చుని పాదపీఠంమీద పాదాలుంచినపుడు అంతా చూసి నమస్కరించే ఆయన పాదాలపై అలరారే మాసంగతేంటి?'' అన్నాయి మంజీరాలు.
''మీ గొప్పల గురించి తప్ప పక్కవారి గొప్పదనాన్ని గూర్చి ఆలోచించలేని మీ తెలివి తక్కువకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన శరీరంలో ఒక్కో భాగాన్ని అలంకరించే మీకే అంత అతిశయమైతే శ్రీరాముడి శరీరాన్నంతా ఆక్రమించే నా గొప్పదనం మీ కెవ్వరికీ రాదు'' అంటూ అహంకరించి చెప్పాయి పట్టుబట్టలు.
అన్నీ మౌనం వహించాయి. కాసేపయ్యాక ''ఏంటీ పాదుకలు మాట్లాడవు. పాపం కిందుండి ఎవ్వరికీ కనిపించని వీటినెవరు గుర్తిస్తార్లే! అందుకే ఈ మౌనం'' అంటూ పకపకా నవ్వాయి.
తక్కువ స్వరంతో ''మీరు చెప్పింది నిజం స్నేహితులారా.. తక్కువ స్వరంతో ఆయన పాదాలకింద ఉండే నాకు గుర్తింపు ఏముంటుంది. మీ అందరికంటే నేను తక్కువదాన్ని. కానీ ఆయన నాపై పాదాలు పెట్టి నడిస్తే చాలు నా జన్మ ధన్యమవుతుంది'' అంటూ అందరికీ నమస్కరించాయి పాదుకలు. అన్నీ పడీపడీ నవ్వాయి.
ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి. ''మౌనం, మౌనం ప్రభువుల వారు వస్తున్నారు'' గుసగుసలాడింది రాజకిరీటం. రామచంద్రుడు లోపలకు వచ్చాడు. పాదుకలను మాత్రమే ధరించి వడివడిగా వెళ్లిపోయాడు. అన్నీ వెలవెలబోయాయి. అంతా నవ్వి హేళన చేసి ఆ పాదుకలే అందరి నమస్కారాలు అందుకుని, భరతుని శిరస్సుపైజేరి ఆపై 14 సంవత్సరాలు సింహాసనం మీద ఆసీనమై రామునికి మారుగా రాజ్యం చేశాయి.
.

- ఆదూరి హైమావతి.
************************************
ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం  

Sunday 1 September 2013

అవసరాన్ని బట్టి...

అవసరాన్ని బట్టి...


apr -   Mon, 2 Sep 2013, IST


వరదాపురంలో వరదయ్య పెద్ద వడ్డీ వ్యాపారి. తన వద్దకు వచ్చే వారి అవసరాలను బట్టి వడ్డీరేట్లలో మార్పులు చేర్పులు చేస్తూ అధిక లాభాలను సంపాదించేవాడు. పొరుగూళ్లకు వసూళ్లకు వెళ్లడంలో దొంగల భయానికి భీముడు అనే వ్యక్తిని పనిలో పెట్టుకున్నాడు. ఒకరోజు సాయంకాలం తీరుబడిగా అరుగుమీద కూర్చున్న వరదయ్య దగ్గరకు ఆ ఊరి భూకామందు భూమయ్య అదరాబాదరా వచ్చాడు. ఆయన్ను చూసిన వరదయ్య ''ఊరకరారు మహాత్ములు.. ఏం పనిమాద వచ్చారో'' అన్నాడు.
''ఎంతటి వారైనా నీ దగ్గరకు రాక తప్పుతుందా వరదయ్యా! మా అవసరాలు అటువంటివి'' అన్నాడు భూమయ్య. ''ఇప్పటికిప్పుడు నీకంత అవసరం ఏమొచ్చిందయ్యా? అయనా ఊరి మొత్తానికి నీ అంత కామందు లేడే'' అని ప్రశ్నించాడు వరదయ్య.
''ఏముంది వరదయ్యా.. అమ్మాయి పెళ్లి కుదిరింది. వియ్యాలవారేమో ఈ శ్రావణ మాసంలోనే పెళ్లి చేయాలని పట్టుబట్టారు. ఉన్న సొమ్మంతా మామిడి తోటలమీద, పొలాలమీద పెట్టాను. మే నెల వరకూ సొమ్ము చేతికి రాదు. మంచి సంబంధం వదులు కోవడం ఇష్టం లేదు. నీవేమైనా ఆదుకుంటావని..'' అంటూ నాన్చాడు భూమయ్య.
''పెద్దచిక్కే తెచ్చిపెట్టావ్‌ భూమయ్యా! సాయం కోసం నిన్న సాయంత్రమే పొరుగూరి పుల్లయ్య, ఎల్లయ్యా ఇదే విషయంతో నన్ను కలిస్తే రేపు రమ్మని చెప్పా. ఏం చేయనబ్బా'' అని నసిగాడు వరదయ్య.
''బాబ్బాబు.. అలా అనకు. నీకు దండం పెడతా. వడ్డీ కావాలంటే కాసింత ఎక్కువే తీసుకో. నాకు ఎలాగైనా 20 వేల వరహాలు కావాలి. సొమ్ము చేతికి రాగానే పూవుల్లో పెట్టి ఇచ్చుకుంటాను'' అంటూ భూమయ్యా బతిమాలసాగేడు.
సరే ఏదో నా తంటాలు నేను పడతాను. అయితే ఈ విషయం మాత్రం బయట చెప్పకు. ఎందుకంటే ముందు అడిగిన వారికి కాదని నీకు ఇస్తే నా పరువు పోతుంది'' అని చెప్పి ఇంట్లోకి వెళ్లాడు వరదయ్య. వెళ్లే ముందు భీముడిని పిలిచి ''ఒరే ఇక్కడేవుండు. పుల్లయ్య, ఎల్లయ్య వస్తే నేను బయటకు వెళ్లానని చెప్పు'' అని ఆదేశించాడు. ఇంట్లోకి వెళ్లి 20 వేల వరహాలకు వడ్డీ లెక్కకట్టి 20 వరహాలను మొదటి నెల వడ్డీకింద మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని భూమయ్యకు అందించాడు.
భూమయ్య వెళ్లాక ''అయ్యా! మన వద్దకు నిన్నా, మొన్న కూడా ఎవరూ రాలేదు. మీరు భూమయ్యతో అలా అన్నారేంటి'' అని ప్రశ్నించాడు. ''అదంతా వ్యాపార రహస్యం రా'' నీకు అర్థం కాదని చెప్పాడు.వసూళ్లకు పొరుగూరికి వెళ్లిన ఇద్దరూ పని ముగించుకుని ఇంటిముఖం పట్టారు. తిరిగి వస్తుండగా వర్షం నెమ్మదిగా మొదలైంది. వాతావరణాన్ని గమనించిన భీముడు ''అయ్యా! బండి కట్టించుకుని వెళ్దాం'' అని చెప్పాడు.
ఇప్పుడు బండి కట్టమంటే 10 వరహాలు అడుగుతాడు. అయినా ఈ వర్షం చిన్నదే. నాలుగు చినుకులు పడి తగ్గిపోతుంది అనుకుని ''బండిఅవసరం లేదు లేరా'' అని చెప్పాడు.
కొద్ది దూరం వెళ్లాక వర్షం పెద్దగా పడటం మొదలైంది. అప్పుడు వారి వెంట ఒక బండి వస్తోంది. ''బండాపి మేమిద్దరం వరదాపురం వెళ్లాలి. మమ్మల్ని దించుతావా'' అని అడిగాడు వరదయ్య.
''అయ్యో! దానికేం భాగ్యం. తప్పకుండా అయితే మనిషికి 20 వరహాలు ఇవ్వాలి. అదికూడా బండి ఎక్కడడానికి ముందే'' అని షరతు పెట్టాడు బండివాడు.
''అదేంటి మాములూ 10 వరహాలేగా! ఆశ్చర్యంగా అడిగాడు'' వరదయ్య.
''అవునండి మీరు చెప్పింది నిజమే. అయితే అవసరాలను బట్టి రేటుంటుంది'' అయినా ఎక్కుతారా లేదా. తొందరగా చెప్పండి. అని గద్దించాడు బండివాడు. చేసిదిలేక మొత్తం 40 వరహాలు ఇచ్చి బండి ఎక్కాడు వరదయ్య. వారిద్దర్నీ ఇంటివద్ద దింపి వడ్డీపోనూ వచ్చిన లాభాన్ని చూసుకుంటూ ఇంటిముఖం పట్టాడు కామందు భూమయ్య.
ఆదూరి హైమావతి, చికాగో.
*************************
ఆంధ్రప్రభ ఆదివారం-చిన్నారిలో-ప్రచురితం.