Tuesday 29 October 2013

శాంతి చిరునామా


చిన్నారి 

శాంతి చిరునామా

apr -   Mon, 28 Oct 2013, IST
ధర్మాపురం అనే గ్రామంలో ధర్మన్న అనే వ్యాపారి ఉండేవాడు. పేరులో తప్ప ఆయనలో ధర్మం అనేది వీసమెత్తు లేదు.   ఎంగిలి చేత్తోకాకిని తోలని వ్యకి. వ్యాపారంలో అదృష్టంకొద్దీ విపరీతంగా లాభాలు వచ్చేవి. అయినా తన పిసిని గొట్టు బుద్ధిని ఏ మాత్రం మార్చుకోలేదు. పైపెచ్చు అది ఇంకా పెరిగింది. తన కింద పనిచేసే గుమాస్తాలకు, ఇతర ఉద్యోగులకు సమయానికి జీతం కూడా ఇచ్చేవాడు కాదు. ఆయన భార్య సితమ్మకు, పిల్లలకు మంచి బట్టలు, తిండి కూడా ఉండేది కాదు. వాళ్లు అడిగీ అడిగీ విసుగెత్తిపోయారు. మంచి బట్టలు లేక సీతమ్మ ఊళ్లో జరిగే ఏ శుభకార్యాని కి వెళ్లేది కాదు.
ధర్మన్న మాత్రం వచ్చిన లాభాలను 'ఎక్కడ దాచాలి? కొత్తగా ఏ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది?' వంటి ఆలోచనలు చేస్తూ కాలం గడిపేవాడు. చదువుకోవడానికి స్కూలు ఫీజులు అడిగే పిల్లలమీద, భార్యా, ఇతర ఉద్యోగస్తుల మీద డబ్బులు అడుగుతున్నారని కోపం తెచ్చుకునేవాడు. ఎప్పుడూ ఎవరో ఒకరిమీద కోపంతో అరుస్తూ అశాంతిగా ఉండే వాడు.
ధర్మన్న కొట్లో పనిచేస్తూ ఆయన ఇంటిముందు చిన్న గుడిసెలో ఉండేవాడు ఆనందుడు. అతడి పేరులోనేకాదు అన్నింటా ఆనందంగా గడిపేవాడు. చిన్న గుడిసెలో తనకున్నదాంట్లోనే  తృప్తిగా గడుపుతూ, తన వద్దకు వచ్చిన వారికి చేతనైన సాయం చేస్తూ కాలం గడిపేవాడు.
ఒక రోజు ధర్మన్న మేడమీద కిటికీలోంచి అనుకోకుండా.. ఆనందుడు, భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతున్న దృశ్యాన్ని చూశాడు. అంత చిన్న గుడిసెలో, తినడానికి ఏమీ లేకపోయినా అంత సంతోషంగా ఎలా గడుపు తున్నా డని  ఆలోచిస్తూ ఉండిపోయాడు. చివరకు ఎంత ఆలోచించినా ధర్మన్నకు విషయం అర్థం కాలేదు.
ఉదయాన్నే పనిలోకి వచ్చిన ఆనందుడిని పిలిచాడు ధర్మన్న. ''మీకు ఏమీ లేకపోయినా అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నా వు ?'' అని ప్రశ్నించాడు. దానికి ''బాబుగారు మీరేం అనుకోనంటే చెప్తాను అన్నాడు'' ఆనందుడు.
''మేము మాకున్న దానితో కలోగంజో అంతా కలిసి హాయిగా తాగుతాం. ఉన్నదాంట్లో తృప్తిగా బతుకుతాం. మీకు అదిలేదు'' అన్నాడు ఆనందుడు.
ఉన్నదాంట్లో తృప్తిగా బతకడం తెలుసుకున్నాక ధర్మన్న జీవితమే మారిపోయింది. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టక, ఉద్యోగులను అన్నదమ్ముల్లా చూస్తుడటంతో అందరూ ధర్మన్నతో మంచిగా ఉండడం మొదలు పెట్టారు.

---- ఆదూరి హైమావతి, చికాగో.
******************
ఆంధ్రప్రభ  27సెప్టెంబర్ ఆదివారం  లో ప్రచురితం

Friday 11 October 2013

మేలుకొలుపు-- కధ

http://vihanga.com/?p=7374    లింక్ లో March విహంగ మహిళా వెబ్ పత్రికలో రిత మైన నాకధ 'మేలుకొలుపు 'కధ  పూర్తి గా చదవచ్చు.

ఊబి -కధ


 http://vihanga.com/?p=9272-    ఈ లింక్ లో 'విహంగ ' జులై నెలలో ప్రచురితమైన నాకధ 'ఊబి  ' కధ పూర్తిగాచదివిమీఅమూల్యఅభిప్రాయాలుతెలుపగలరు.                                                                     

Thursday 10 October 2013

ఈ పాప మెవరిది ?


ఈ పాప మెవరిది ?

ఏడెనిమి నెలల పసికూన నేలమీదపడి ఏడుస్తున్నాడు.ఫక్కనే సోఫాల్లో విడివిడిగా వాడి అమ్మా నాన్నాతమ ల్యాప్ ట్యాప్స్ లో టకటకా ఏదో కొట్టుకుంటున్నారు. వాడి ఏడ్పు తారస్థాయికి వెళ్ళింది.

 " ఏయ్ రంజనీ !వాడ్ని చూడూ! ఏంటా వెధవగోల?" కోపంగా అరిచి తిరిగి తన టకటకా ల్లోపడిపోయాడుదినేష్.  " నాకు ముఖ్యమైన పవర్ పాయింట్  ప్రెజెంటేషన్ ఉంది ఈరోజు. పని ఆపికాస్త నీవే చూడు దినేష్! " తనూ అదే స్థాయిలో అరచి , తిరిగి తన టకటాకల్లో పడిపోయింది ఆమె ,అదే రంజని  .

 పిల్లవాడి ఏడ్పు మరికాస్త పెరిగింది. " ఏయ్ నిన్నే ! వాడి ఏడ్పు వినిపించట్లేదా! వాడి ఏడ్పు ఆపు, నాకు విసుగ్గా  ఉంది. " మొరిగాడు దినేష్.

" నీవే చూడు దినేష్ ! నాకు టైం లేదు.500 మంది ముందు నాప్రెజెంటేషన్ ఉంది ." అంటూ తానూ మొరిగి, తిరిగి పనిలో పడింది రంజని.ఆమె ఒళ్ళో  ల్యాప్ ట్యాప్  క్రిందపడి ఏడుస్తున్న వాడిని చూసి నవ్వింది. నీ  స్థానం లో నేను పర్మె నెంట్ ఐపోయానని. అదేం తెలీని ఆపసివాడు ఆకలికీ , డైపర్ నిండి ఇబ్బంది పెడు తున్న పుప్పూ ,పిప్పీలకూ  వాడి ఆయుధమైన ఏడ్పు పెంచాడు.   

" ఏయ్ ! చెవుడొచ్చిందా ! ఎన్ని సార్లు చెప్పాలి నీకు ? వాడి ఏడ్పు వినిపించట్లేదా! "ఉరిమాడు దినేష్ .

" దినేష్ ! నిన్నే చూడమని నేనూ చెప్పాను, నాకు అర్జెంట్ ప్రెజెంటేషన్ ఉంది.  " తనూఉరిమింది  రంజని.

" నీవు తల్లి వేనా బిడ్డ ఏడుస్తుంటే కదలవు"  కసిగా కసిరాడు దినేష్.       

" నీవు తండ్రి వి కాదా వాడికి! ఒక్కరోజు చూస్తే ఏంటవుతుంది?" తానూ కసిరింది రంజని.

" ఆడమనిషి  చేయాల్సిన  పనులు  నేను చేయటమేంటి? నేను మగాడ్ని"

" మగవాళ్ళు చేసే ఉద్యోగాలు చేసి మేము సంపాదిస్తే మీమగజాతి అనుభవించట్లేదా? ఆడట ఆడ!"

" మితి మీరు తున్నావ్ ! అసలు వీడ్ని మీ అమ్మ వద్దకు పంప మంటే విన్నావా?"

" ఏం మీ అమ్మచూడలేదా? మా అమ్మ నాకు వేవిళ్ళంటే వచ్చి  ఏడాదిపాటు ఉందిక్కడ. మా నాన్న గారికి వంట్లో బావులేదంటే వెళ్ళింది.మీ అమ్మవద్ద దింపిరమ్మన్నాను  , విన్నావా?"

" ఆవిడెక్కడ చూస్తుంది ? మా తాతా తోనే సరిపోతుంది."

" మరెందుకు మనవడు కావాలని తొందరపెట్టి కనిపించింది. కాన్పుకోసం పెట్టిన రెండు నెలల సెలవుల్లో  నా కెరీరంతాపాడైంది.  వీడ్ని కనమన్నావిడ  చూడలేదాఏం?"

" వీడ్ని కనింది కేవలం మా అమ్మకోసమేనా?"

" కాక మరేంటి ? నాకోస మనుకున్నావా? ఆరోజే చెప్పాను , నాకిప్పుడే పిల్లల్నుకనాలని లేదని,  నీవూ నీ అమ్మా కల్సి నా ప్రాణం తీశారు, ఇప్పుడేమో వీడ్నిచూడను తనవల్ల కాదంటుందా ఆవిడ?"      

"ఏంటే మా అమ్మ నీ కొడుకును  చూడాలా?"

" ఆహా! నీ క్కాదా కొడుకు? నీ ప్రమేయం లేకుండా నే వాడు పుట్టుకొచ్చాడా! నీ బలవంతం మీదే కన్నాను."

" తెలివితక్కువగా మాట్లాడకు. ఎవరిపిల్లల్ని వాళ్ళు పెంచుకోవాలని కూడా తెలీదానీకు?"

" అదే అంటున్నాను, వీడ్ని పెంచటంలో నీకూ భాగముందని , ఈరోజు వీడ్ని నీవే చూడాలి ,వెళ్తూ వెళ్తూ దార్లోడేకేర్లోదించివెళ్ళి సాయంకాలం తీసుకురా! నేను వచ్చేసరికి   లేటవుతుంది." అంటూ ల్యాప్ టాప్ బ్యాగ్ లో వేసుకుని లేచింది .

" ఏంటే మరీ రెచ్చిపోతన్నావ్! చేతిలోకారు  , క్రెడిట్ కార్డూ ఉన్నాయని పొగరా!"

" షిట్ ! మాట్లాడకు ,నాసంపాదన మాత్రమే వాడుతున్నాను , ఇంటి ఖర్చులకు సైతం, షేర్ చేసుకోను చేతకాని వాడివి ఎందుకు కనమన్నావ్ వీడ్ని? " అంటూ కారు తాళాలు తీసుకుని వెళ్ళిపోయింది .

" బుల్ షిట్ ! " అంటూ స్నానాల గదికెళ్ళిపోయాడు దినేష్,పసివాడ్ని  వాడిఖర్మానికి వాడ్నివదిలేసి. పిల్లాడి ఏడ్పు గంటనుంచీ వింటున్న పక్కింటి పార్వతమ్మ ఇహ ఆగలేక  గబగబా వచ్చింది . పిల్లాడు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లాడు. వాడి డైపర్ మార్చి, వంటగదిలోకెళ్ళిపాలు వేడిచేసి తెచ్చి పట్టింది. పాలుత్రాగి , ఆకలి ,శరీరబాధ తీరగానే అలసటతో వాడు నిద్రలోకిజారుకున్నాడు.ఈలోగా దినేష్  తయారై  వచ్చి చూశాడు. నిద్రపోతున్న పిల్లడ్నీ, పార్వతమ్మగారినీనీ.  " అయ్యో ! పిన్నిగారూ ! మీరా! వీడు ఉదయం నుంచీ ఒకటే ఏడ్పు."

" విన్నాన్నాయనా! మీ ఆవిడ లేనట్లుంది ఇంట్లో , అందుకే పిల్లడి ఏడ్పు గంటనుంచీ  వింటూ మరి ఉండలేక వచ్చాను, ఏమీ అనుకోకునాయనా! పాతకాలం వాళ్ళం పిల్లలేడుస్తుంటే వింటూ ఉండలేము బాబూ ! వస్తాను." అంటూ ఆవిడవెళ్ళగానే , తానీరోజు వీడ్నిడేకేర్లో  దించి  వెళ్ళాలని గుర్తువచ్చి  , బేబీ సీట్ తీసి కార్లో వేసి  , నిద్రపోతున్న పిల్లడ్ని తీసి కారు సీట్లో పెట్టి , ఇంటికి తాళంవేసి బయల్దేరాడు.

కారు స్టార్ట్ చేయగానే , ఆఫీస్ నుండీ ఫోన్. మొబై ల్లో  మాట్లాడుతూ ఆఫీస్ కెళ్ళిపోయాడు దినేష్.  కారు పార్క్ చేసి పరుగులాంటి నడకతో   తన ఛాంబర్ కేసి వెళ్ళి ,  సీట్లోకూర్చుని పనిమొదలెట్టాడు.

రాత్రి పదయ్యాక  ఆరోజుకు అంగడి కట్టేసి వచ్చి కార్లోకూర్చోగానే తిరిగి కాల్ రావటంతో,మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తూ ఇల్లు చేరి సోఫాలో కూర్చుని మాట్లాడసాగాడు . రాత్రి 11గంటలకు ఇల్లు చేరిన రంజని అలసటతో సోఫాలో వాలిపోయి ,పది నిముషాలయ్యాక , " ఏయ్! దినేష్ ! బాబేడీ!నిద్రపోతున్నాడా!" అంది.

మొబైల్ పక్కనపడేసి " బాబా! నాకేంతెల్సు?" అన్నాడు.

" ఉదయం నిన్నుడే కేర్లోదింపి సాయంకాలం తెమ్మన్నాగా ! తేవటం మర్చిపోయావా? " అంది.

" నన్ను తెమ్మన్నావా!" 

" ఔను నిన్నే దిపి తెమ్మన్నానుకూడా"

" ఉండుండు " అంటూ కారు తాళాలు తీసుకుని  గరేజ్ లోకి పరుగెట్టాడు దినేష్ .రెండునిముషాలకు,

" రంజనీ! రంజనీ !" అని పెద్దగా అరిచాడు. అరుపులు రంజనితోపాటు ఇరుగుపొరుగుకు అంతా విని పించాయి.రంజని గరేజ్ లోకి దూకి  తలుపు తీసి ఉన్నకార్లోకి చూసి మ్రాన్పడి .పెద్దగా అరుస్తూ క్రింద పడి పోయింది. పక్కింటి పార్వతమ్మ కుటుంబం , అప్పుడే నిద్ర పోబోతున్న ఇరుగుపొరుగు వారంతా వచ్చి  జరిగిన ఘోరాన్ని చూసి   " అయ్యో !అయ్యో ! బిడ్డడు చచ్చిపోయాడు! ఎలాజరిగిందీ ఘోరం ?!" అంటూ ప్రశ్నించ సాగారు.రోజూ జరిగేవి వద్దన్నా గోడే అడ్డంకనుక అంతా చూచాయగా తెలిసున్న పార్వతమ్మ మాత్రం " పెంచలేని వాళ్ళకే బిడ్డలనిస్తాడు   భగవంతుడు! పండంటిబిడ్డ ! పాపం ఎవరిది?" అంటూ లోనికెళ్ళిపోయింది. 

ఔను ఆపాపం ఎవరిఖాతాలో రాస్తాడు యమధర్మరాజు? వాళ్ళకు పెళ్ళిచేసినపెద్దలకా? వద్దనుకుంటూనే బిడ్డనుకన్న తల్లికా? తన వృత్తిధర్మం  తప్ప పితృధర్మం తెలీని తండ్రికా? వారికి ఉద్యోగాలిచ్చిన సంస్థకా?

ప్రమోషన్లవేటలో పడి తల్లిదండ్రులమని తమ ధర్మం మరచిన వారిద్దరికీనా?  వారికి పండాంటి బిడ్డనిచ్చిన బ్రహ్మదేవునిదా? ఎవరిది ఈపాపం?    
**************
 బెంగుళూరు తెలుగుతేజం మాసపత్రిక నిర్వహించిన చిన్నకధలపోటీలో బహుమతిపొందిన నాకధ