Monday 30 September 2013

వినయానికే విజయం

వినయానికే విజయం


a-pr -   Mon, 30 Sep 2013, IST


తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరాముడు పట్టాభిషేక సమయానికి ధరించ వలసిన ఆభరణాలన్నింటినీ ఒకగదిలో పెద్ద బల్లమీద విడివిడిగా పెట్టారు. అర్ధరాత్రి అయ్యింది ఆగదిలో మెల్లగా కలకలం మొదలైంది. ''ఏంటీ ఇంకా తెల్లవారదు? సూర్యదేవుడి రథాన్ని అనూరుడు ఈ వేళ నెమ్మదిగా తోలుతున్నాడేమిటి చిత్రంగా..! ఎప్పుడు తెల్లారేను ఎప్పుడెప్పుడు నేను శ్రీరాముడి తలపై జేరి ఆనందం పొందేను'' అంది కిరీటం దర్జా ఉట్టిపడే కంఠంతో.
''అదేమి అంత ఠీవి! శౌర్యం వుట్టిపడే ఆయన భుజాలను అలంకరించే మా మాటేంటి? ఆయన బాణం అందుకుని భుజం పైకెత్తితే మొదట కనిపించేది మేమే!'' మోహనంగా ముక్తకంఠంతో అన్నాయి భుజకీర్తులు.
''ఆహా!! ఆయన చేయి పైకెత్తితే ముందు కనిపించేవి మణికట్టును చేరే మా అందాలే'' అన్నాయి మణికంకణాలు.
''అసలు ఆయన కంఠసీమన అలరారే మా అందం మాటేమిటి? సీతమ్మతల్లి కంటే ముందుగా ఆ మహారాజు కంఠసీమను అలంకరించే నా గొప్పతనం ఎవ్వరికీరాదు'' మహా గర్వంగా అంది కంఠమాల.
''ఓహో అలాగా! ఆయన తల తిప్పినప్పుడల్లా మిలమిల మెరుస్తూ గిరగిరా తిరగే మా మాటేమిటి?'' అన్నాయి కర్ణాభరణాలు.
''పాపం అదేం! ఆయన వేళ్లను అలంకరించే మా మాటేంటి! మహారాజు చేయి పైకెత్తి ఆశీర్వాదాలు, ఆజ్ఞలు జారీచేస్తుంటే ముందుగా కనిపించేది మేమే. మీరు మాకంటే గొప్పా'' అని ప్రశ్నించాయి నవరత్నాలు, వజ్రాలు.
''ఆపండి కొంచెం. కర్ణరఠోరంగా ఉన్నాయి మీ మాటలు. రాజముద్రికనైన నాకంటే ఎవ్వరూ గొప్పకాదు. నేనులేంది ఆ రామచంద్రుడు రాజశాసనాలే చేయలేడు'' అంది దర్పాలు పోతూ రాజముద్రిక.
''అసలా మహానుభావుడు సింహాసనం మీద కూర్చుని పాదపీఠంమీద పాదాలుంచినపుడు అంతా చూసి నమస్కరించే ఆయన పాదాలపై అలరారే మాసంగతేంటి?'' అన్నాయి మంజీరాలు.
''మీ గొప్పల గురించి తప్ప పక్కవారి గొప్పదనాన్ని గూర్చి ఆలోచించలేని మీ తెలివి తక్కువకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన శరీరంలో ఒక్కో భాగాన్ని అలంకరించే మీకే అంత అతిశయమైతే శ్రీరాముడి శరీరాన్నంతా ఆక్రమించే నా గొప్పదనం మీ కెవ్వరికీ రాదు'' అంటూ అహంకరించి చెప్పాయి పట్టుబట్టలు.
అన్నీ మౌనం వహించాయి. కాసేపయ్యాక ''ఏంటీ పాదుకలు మాట్లాడవు. పాపం కిందుండి ఎవ్వరికీ కనిపించని వీటినెవరు గుర్తిస్తార్లే! అందుకే ఈ మౌనం'' అంటూ పకపకా నవ్వాయి.
తక్కువ స్వరంతో ''మీరు చెప్పింది నిజం స్నేహితులారా.. తక్కువ స్వరంతో ఆయన పాదాలకింద ఉండే నాకు గుర్తింపు ఏముంటుంది. మీ అందరికంటే నేను తక్కువదాన్ని. కానీ ఆయన నాపై పాదాలు పెట్టి నడిస్తే చాలు నా జన్మ ధన్యమవుతుంది'' అంటూ అందరికీ నమస్కరించాయి పాదుకలు. అన్నీ పడీపడీ నవ్వాయి.
ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి. ''మౌనం, మౌనం ప్రభువుల వారు వస్తున్నారు'' గుసగుసలాడింది రాజకిరీటం. రామచంద్రుడు లోపలకు వచ్చాడు. పాదుకలను మాత్రమే ధరించి వడివడిగా వెళ్లిపోయాడు. అన్నీ వెలవెలబోయాయి. అంతా నవ్వి హేళన చేసి ఆ పాదుకలే అందరి నమస్కారాలు అందుకుని, భరతుని శిరస్సుపైజేరి ఆపై 14 సంవత్సరాలు సింహాసనం మీద ఆసీనమై రామునికి మారుగా రాజ్యం చేశాయి.
.

- ఆదూరి హైమావతి.
************************************
ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం  

2 comments:

  1. రామ కథా కథనములో
    ధీమంతులు తలపనట్టి దివ్యాంశ మిటున్
    సామర్థ్యముతో తెలిపిన
    హైమవతీ! నీదు ప్రతిభ కభినందనముల్!

    ReplyDelete
    Replies
    1. ఏమియు తెలియనిదానిని
      ఏమాయయో వ్రాయించెను రీతిగ నాచే
      ఏమారను రామనామము
      ఏమున్నది మీరుపొగడ ఆచార్య ఫణీ!
      ఆచార్య ఫణీంద్రగారికి కృతఙ్ఞతలండీ!

      Delete