Tuesday, 30 September 2014

ఈ బుక్ 'మృత్యంతరమేలు--మరికొన్నికధలు '.-http://kinige.com/kbook.php?id=3766--

సాహితీమిత్రులందరికీ!
నమస్సులు!
దసరా శుభాకాంక్షలు!

వివిధపత్రికల్లోప్రచురితమైన నా కధలు ఒక పుస్తకంగా  ఈ బుక్ గా 'మృత్యంతరమేలు--'మరికొన్నికధలు--- కినిగె వారు ప్రచురించారు.-http://kinige.com/kbook.php?id=3766--అవకాశం ఉంటేచదివి తమ అమూల్య అభిప్రాయాలు తెలియజేయగలరు.
మీ అభిప్రాయాలు ఆహ్వానించే,
ఆదూరి.హైమవతి.

Wednesday, 9 July 2014

ప్రతిభాశాలి చాచా నెహ్రూ


Like andhraprabha.com on facebook

ప్రతిభాశాలి చాచా నెహ్రూ...

కథ: ఆదూరి హైమవతి

చిన్నారులూ! పూవు పుట్టగానే పరిమళిస్తుందనే మాట వినే ఉంటారు. తెలివైన వారు పసితనంలోనే తమ ప్రఙ్ఞను చూపుతారు. ఇది సుమారుగా 113 ఏళ్ళక్రిందట జరిగిన సంఘటన. ఒక మారు కొందరు బాలురు ఒక తోటలో బంతి ఆట ఆడుతున్నారు. వారంతా పది పన్నెండేళ్ళ వారు. షుమారుగా పాతికమంది ఉంటారు. వారి చేతిలో బత్తాయి కాయంత బంతి ఉంది. అంతా వర్తులాకారంగా నిలబడి బంతి విసురుకుంటూ ఆడుతున్నారు. అది పెద్ద తోట, పెద్దపెద్ద వృక్షాలతో ఉంది. సాయంకాలం చల్లని గాలులు వీస్తున్నాయి. పిల్లలతా ఆ చల్లని వాతావరణంలో హాయిగా ఉత్సాహంగా ఆడుకుంటున్నారు.
ఇంతలో ఒక బాలుడు ఠీవిగా నడుస్తూ చిన్న లాఠీలాంటి కర్ర విలాసంగా ఊపుకుంటూ విహారానికై ఆతోటలోకి వచ్చాడు. దూరంగా తనతోటి వయస్సు పిల్లలు  ఆడుకోడం గమనించాడు. మెల్లిగా నడుస్తూ వారి సమీపానికి వస్తున్నాడు. ఇంతలో ఒకబాలుడు విసిరిన ఆ బంతి వెళ్ళి అక్కడే ఉన్న ఒక చెట్టు తొర్రలో పడింది. అంతా పరుగుపరుగున వెళ్ళి చెట్టుచుట్టూ మూగారు. అది చాలా పెద్ద చెట్టు. దాని కాండమే  ఐదడుగుల వ్యాసంతో  ఉంది. దాని మొదట్లో ఉన్న తొర్ర ఇంకా చాలా లోతుగా ఉండటాన ఆపిల్లల చేతికి ఆ బంతి అందలేదు.
అంతా బతి విసరిన బాలుని తిట్టసాగారు. "నీవంత వేగంగా విసరటం వల్లే ఆబంతి ఈ తొర్రలో పడింది. ఇప్పుడెలా ఆడుకుంటాం. నీవల్లే ఆట ఆగి పోయింది. అందరూ తనని తిట్టడంతో ఆబాలుడు  ఏడవసాగాడు. ఇంతలో ఠీవిగా నడుస్తున్న బాబు వారి వద్దకు చేరి ఎందుకు మీరంతా అతడ్ని తిడు తున్నారు? అతడేం చేశాడు? ఆట ఆపేసి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏదైనా సాయంకావాలా? అంటూ వారిని అడిగాడు. దానికి అంతా వీడు బంతిని వేగంగా విసరటంతో అది వచ్చి ఈ చెట్టు తొర్రలో పడింది, చేతికి అందటం లేదు. ఇహ ఎలా ఆడుకుంటాం, అంతా వీడి వల్లే..' అంటూ అంతా మళ్ళీ మళ్ళీ అనడంతో వాడు ఏడ్పు సాగించాడు.
ఏడ్వకు, ఉపాయం ఆలోచించాలి. ఊరికే తూలనాడుకుంటే ఉపయోగం లేదుకదా!' అంటూ తొర్ర సమీపానికి వెళ్ళి చూశాడా బాబు. తనచేతిలోని లాఠీని లోపలికి పెట్టి చూశాడు. అది చాలా లోతుగా ఉంది. కొద్దిసేపు ఆలో చించాక 'మీరు ఆ పంపువద్దకెళ్ళి ఆ బొక్కెనతో నీరు తీసుకురండి' అంటూ చెట్లకు నీరు పోసేందుకై అక్కడ ఉన్న పంపును చూపాడు. బిరబిరా వారిలో కొందరు వెళ్ళి బొక్కెన నిండా నీరు తెచ్చారు. దాన్ని ఆ బాబు ఆచెట్టు తొర్రలో పోశాడు.అది నిండలేదు. మరో బొక్కెన , మరో బొక్కెన నీరు పోశాక చెట్టు తొర్ర నిండి తేలికగా ఉండటాన ఆ బంతి పైకి తేలింది. దాన్ని చేత్తో తీసి వారికి అందించాడు ఆబాబు. అంతా చప్పట్లు చరిచి అతడి తెలివితేటలకు ఆశ్చర్య పోయారు. బంతి తీసుకుని వెళ్ళారు.
పసితనం నుండే అలా తన ప్రఙ్ఞచూపిన ఆ బాలుడే పడిత జవహర్ లాల్ నెహ్రూ. పిల్లలందరికీ చాచా నెహ్రూ, స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రిగా సేవలందించిన ప్రఙ్ఞాశాలి.
ఆదూరి హైమవతి.

మహాత్ముడెలా అయ్యాడు?







హోం >> చిన్నారి

మహాత్ముడెలా అయ్యాడు?

కథ: ఆదూరి హైమవతి

"తాతగారూ! త్వరగా రండి ఈరోజు మా తెలుగు టీచర్ గారు మనదేశంలో గొప్పవారి గురించీ చెప్తూ ‘గాంధీజీ‘ మహాత్ముడని చెప్పారు. ఆయనెలా మహాత్ముడయ్యాడో మీరు నాకు చెప్పరూ!” అంటూ తాతగారి వడి చేరాడు మనవడు మనోహర్.
“ఓ అదా! తాతా! మంచి ప్రశ్నే అడిగావు. విను మరి. గాంధీకి తల్లి తండ్రులు పెట్టిన పేరు మోహనదాస్ వాళ్ళ నాన్నగారి పేరు 'కరంచంద్' వారి ఇంటిపేరు 'గాంధీ.' మొత్తం కలిపి మోహనదాస్ కరంచంద్ గాంధీ అయింది. ఆయన చిన్నతనం నుండీ అమ్మా నాన్నగార్లతో పురాణ కాలక్షేపాలకు సత్సంగాలకు వెళ్తూ, దేవాలయానికి వెళ్తూ అమ్మా నాన్నల మాట వింటూ ఉండేవాడు. వాళ్ళ అమ్మ చాలా సాంప్రదాయాలు పాటించేది. ఆమె 'కోకిల వ్రతం' అనే వ్రతం చేసేది".
" అంటే ఏంటి తాతగారూ!"
" అంటే వసంత కాలం వచ్చిందంటే కోకిల కూత విన్నతర్వాతే భుజించేది. బాల గాంధీకి అమ్మంటే అమిత ప్రేమ. ఒకరోజున ఎంతకూ కోయిల కూయలేదు. సాయంకాలం మూడైంది. బాలగాంధీ పెరట్లోని మామిడి  చెట్టు వైపుచూస్తూ కూర్చున్నాడు, కోయిల ఎప్పుడు కూస్తుందా, అమ్మ ఎప్పుడు అన్నం తింటూందాని. ఎంతకూ కోయిల కూయక పోవడంతో, ఆమామిడి చెట్టు చాటుకెళ్ళి తానే కోయిల లాగా ' కూహూ కూహూ ' అని కూసి, లోపలికి వెళ్ళి" అమ్మా! అమ్మా! అదో కోయిల కూసింది, విన్నవా! ఇహ రా అన్నం తిను." అని పిలిచాడు.
వెంటనే పూజ గదిలో ఉన్న ఆమె బయటికి వచ్చి, బాలగాంధీ దగ్గరకు వచ్చి, అతడి చెంప పైన ఒక దెబ్బవేసింది. ఆదెబ్బకు బాల గాంధీ క్రిందపడ్డాడు. "ఛీ! నీవంటి అసత్యం చెప్పేవాడు నాకొడుకైనందుకు నేను చాలా దుఃఖిస్తున్నాను." అని లోపలికి వెళ్ళింది. బాలగాంధీకి తాను చేసినది తప్పని తెలిసింది, దానివల్లే తల్లికి కోపం వచ్చిందని అర్ధమై, దేవుని గదిలో ఉన్న తల్లి వద్దకెళ్ళి కాళ్ళుపట్టుకుని" ఇహ నా జీవితంలో ఎన్నడూ అసత్యం చెప్పను. నీమీది ఆన." అని ఏడ్చాడు. ఆమాట జీవితాంతం పాటించాడు.
ఆతర్వాత ఆయన 19 వఏట న్యాయశాస్త్రం చదవను ఇంగ్లాండు వెళ్ళేప్పుడు, అది చలిదేశం గనుక, అక్కడివారికి అలవాటైన మద్యం త్రాగననీ, మాంసాహారం తినననీ తల్లికి మాట ఇచ్చి ఆ ప్రకారము సత్ ప్రవర్తనతో నడుచుకున్నాడు. స్వాతంత్య్ర సమరంలో ఆయన ఆయుధాలు సహాయ నిరాకరణ, సత్యాగ్రహము. విదేశీ వస్తువులను బహిష్కరించడం, స్వయంగా నూలు వడికి దానితో నేసిన ఖద్దరు బట్టలు ధరించడం, సత్యము పాటించడం. అహింసతో వ్యవహరించడం. కొల్లాయి గుడ్డ కట్టుకుని, చొక్కలేకుండా చేత కర్రపట్టుకుని, మురికి వాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి చెప్పాడాయన.
నీలాంటి ఒక చిన్నకుర్రాడు ఒకసారి ఆయన ఒక ఊర్లో  ఉపన్యసించాక దగ్గరకు వెళ్ళి" తాతగారూ! మీరు చొక్కా లేకుండా ఉన్నారే? చలేయదా! మానాయన గారిని అడిగి మీకు ఒక చొక్క కుట్టించి తెస్తాను వేసుకుంటారా!" అని అడగ్గా ఆయన చెప్పిన మాటేంతో తెలుసా!
"బాబూ! మంచిమాట అడిగావు, ఐతే మనదేశంలో చాలా మంది పేదలకు చొక్కాలే లేవు, నీవు వారందరికీ చొక్కాలు కుట్టించి తెస్తే నేనూ చొక్కా వేసుకుంటాను." అని నవ్వుతూ చెప్పారుట! చూశావా అదీ గొప్పతనమంటే! తెల్సిందా! ఆయన నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు జరిగాక 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతం త్య్రం వచ్చిన శుభ సందర్భంగా సంబరాలు చేసుకొంటూ ఉండగా దేశ విభజన వల్ల బాధపడుతూ, గాంధీమాత్రం కలకత్తాలో ఒక హరిజనవాడను శుభ్రముచేస్తూ గడిపాడు. ఏనాయకుడైనా ఇంత నిరాడంబరంగా ఉండటం మనం ఈ రోజుల్లో చూడం.
అందుకే ఆయన’ మహాత్మగాంధీ‘ అనీ, పిల్లలకు’ గాంధీతాత ‘అనీ, అంతా  ‘జాతిపిత’ అనీ పిలుస్తాం. తెల్సిందా! ఇహ పద లోపలికి కాళ్ళు కడుక్కుని బామ్మపెట్టే టిఫిన్ తిని పాలుత్రాగు, పార్కుకు వాకింగ్ కెళదాం అంటూ ముగించాడు తాత.

--ఆదూరి హైమవతి, బెంగళూరు
 
 
 
 
 
 

బరువు దించేవాడు

బరువు దించేవాడు

కథ: ఆదూరి హైమవతి

మేలుకో కిట్టయ్య మేలుకోవయ్యా! మేలుకుని మమ్మల్ని ఏలుకోవయ్యా!
నందునీ పుత్రుడా యశోద కన్నయా ! రాధమ్మ మిత్రుడా! మాపాలిదేవుడా! తానే రాసుకున్న మేలు కొలుపులు పాడుతూ బామ్మ దేవుని గదిలో పూజకు అన్నీ సమకూర్చుకుంటున్నది.
అబ్బా! బామ్మా! ఏంటే శలవు రోజు కూడా నన్ను నిద్ర పోనివ్వవా! పాటలు మొదలెట్టావ్! కోపంగా కప్పుకున్న దుప్పటితోనే వచ్చింది వసుధ.
నీకు శలవైతే నా పూజ మానుకోవాలా ఏంటే వసూ! నా కిట్టయ్యను నిద్ర లేపోద్దుటే!
నిద్ర లేపితే కానీ లేవడా నీ కిట్టయ్య? ఐనా నీ బాధలూ బరువులూ ప్రత్యేకంగా  ఏమన్నా తీరుస్తాడా ఏం నీ కిట్టయ్య! అంటూ వాదనకు దిగింది వసుధ.
మరి బరువు బాధా తీర్చేవాడు గనుకే కదా ఆయన్నే నమ్ముకుని పూజించడం! నీకేం తెలుసే మహా ఐదోక్లాస్ చదువుతున్నావ్! దేవుడ్ని గురించీ నీకేం తెల్సుచెప్పు.  బరువు దించుతాడన్నావే అదెలాగో చెప్పు చూద్దాం... నా పరీక్షల బరువు తీర్చుతాడేమో చూస్తాను.“ బామ్మతో పంతానికి దిగి ఎదురుగా బాసిం పెట్లు వేసుకుని కూర్చుంది వసుధ, దుప్పటికప్పుకునే..  
వత్తులపెట్టె ఎదురుగా పెట్టుకుని విబూదిలో చేతులు అద్దుకుని వత్తులు చేసుకుంటూ చెప్పసాగింది బామ్మ. గోపికలు కృష్ణయ్యను ఎంతో ప్రేమించేవారు. ఒక్కరోజు కృష్ణుని  చూడకండా ఉండలేకపోయేవారు. గోపికలంతా మంచినీటి బావికి దుత్తలు తీసుకుని వెళ్ళేప్పుడు, కృష్ణయ్య కూడా వెళ్ళేవాడు. మురళి వాయిస్తూ వారికి శ్రమ తెలీకుండా  మాటలు చెప్తూ వెంటే ఉండేవాడు. వారు కృష్ణ నామం చేసుకుంటూ తమ పనులన్నీ సునాయాసంగా చేసుకునే వారు.
ఒక రోజున ఒక గోపిక వంటరిగా మంచి నీళ్ళ బావి కెళ్ళింది, వెంట కృష్ణయ్య కూడా వెళ్ళాడు మురళి వాయిస్తూ. ఆ గోపిక మూడు దుత్తలు తీసుకెళ్ళి బావి నీరు చేది దుత్తలు నింపుకుని, అక్కడే ఉన్న కృష్ణయ్యను కిట్టయ్యా! మూడు బుంగలు తలపై కెత్తు కోడం కష్టంగా ఉంది, కాస్తంత సాయం చేయవా అని అడిగింది.
కృష్ణయ్య నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు. గోపిక మళ్ళా వేడి కోలుగా అడిగింది. కిట్టయ్యా! సాయం చేయవా ఈ బుంగలు నాతల పైకెట్టవా అని. కృష్ణయ్య మళ్ళా తల అడ్డంగా ఊపాడు.                            
ఇదేం న్యాయం కిట్టయ్యా! సాయం చేయమంటే తల అడ్డంగా ఊపుతావు ఇదేనా స్నేహ మంటే! అంది.
నవ్వుతూ అక్కడి నుండీ వెళ్ళిపోయాడు కృష్ణుడు. గోపిక ఎలాగో తంటాలు పడీ పడీ బుంగలు మూడూ తల పైకెత్తుకుని మెల్లిగా ఇల్లు చేరింది. గుమ్మంవద్దే ఉన్న కృష్ణయ్య, ఆ బుంగలు దింపుకోను సాయం చేశాడు.
గోపిక కోపంగా ఏం కిట్టయ్యా! మహా వచ్చావు సాయం చేయను. బుంగలు తల కెత్తుకున్న దాన్ని దింపుకో లేననా! పెద్ద వచ్చావు సాయం చేయను! అంటూ కోపంగా మూతి ముడుచుకుని మాట్లాడింది.
'కృష్ణుడు నవ్వుతూ నేను బరువులు దింపే వాడినే కానీ బరువులు ఎత్తే వాడిని కాను. మీ బరువులు, భారాలన్నీ దింపుతాను అన్నాడు.
గోపికకు దానిలోని అంతరార్థం తెల్సివచ్చింది. భక్తితో కిట్టయ్యకు నమస్కరించింది.
“తెలిసిందిటే! కృష్ణ తత్వం నీకు తెలియాలంటే ఇంకాపెద్ద దానివి కావాలి. అప్పుడు అర్థమవుతుంది కానీ వెళ్ళి స్నానం చేసి రాపో. ప్రసాదం తయారుగా ఉంది. వేడివేడి చక్కెర పొంగలి కిట్టయ్యలాగా నీకూ ఇష్టమేగా పదపద. అంటూ బామ్మ పూజ చేసుకోడంలో మునిగిపోయింది.
రచన: ఆదూరి హైమవతి.
 

ప్రచార సాధనాలు

http://ipr.ap.nic.in/AndhraPradeshPatrika/issues/2014/July/Telugu/page22.html#

ఈ లింక్ లో ఆంధ్రప్రదేశ్ పత్రికలో  july 2014 ప్రచురితమైన నాకధవ్' ప్రచార సాధనాలు ' చదవి తమ అమూల్య అభిప్రాయాలు

తెలుపవలసినదిగా మిత్రులందరికీ మనవి..

**************************
 
ప్రచార సాధనాలు

జూన్ నెల రెండోవారం ప్రవేసించినా సూర్యప్రతాపం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.మధ్యాహ్న భోజనం పూర్తిచేసి శ్రీమతి స్వయంగా చేసి అందించినకమ్మనికిల్లీ బుగ్గనపెట్టుకుని  సుగంధభరిత

ఊటనీరు కొంచెంకొంచెంగా మ్రింగుతూ , వేప చెట్టుక్రింద వాలుకుర్చీలో కళ్ళుమూసుకుని

పరవశంగా పడుకునున్నాను. వేపచెట్టు చల్లని గాలులు హాయిగా శరీరాన్ని తాకుతుంటే,మనస్సూ,మేనూకూడా  స్వర్గానికి బెత్తెడే

ఎడంలో వున్నట్లున్న ఆశుఖాన్ని అనుభవిస్తూ ,శ్రీనాధుని తలంచుకుంటూ మెల్లిగానిద్రలోకిజారు

కున్నట్లున్నాను. ఎప్పుడునిద్రపట్టిందో తెలీదు.----------పూర్తికధ ఈ పై లింక్  లో

Saturday, 17 May 2014

చిటికెలపందిరి.

 

 

 

హోం >> చిన్నారి                        

 

చిటికెలపందిరి.

 

కథ: ఆదూరి హైమవతి

 

 


చిన్నారులూ! మీరు చిన్నారులు కాదు మహా మేధావులు. ఏలాగంటారా! ఇది చదవండి మీకే తెలుస్తుంది, మీలాంటి ఒక చిన్నారి చివరకు ఆంజనేయ స్వామినే బురిడీ కొట్టించాడు మరి! ఆ కథనం బెట్టిదనిన...
కిరణ్‌కు క్రికెట్ అంటే ప్రాణం. చదువంటే అంతగా గిట్టదు. ఏదో అమ్మా నాన్నగార్ల కోసం స్కూల్ కెళుతుంటాడు, పైగా అక్కడ వాడి తోటి క్రికెట్ ఆటగాళ్ళంతా ఉంటారాయె!
నాన్న నరసింహం కిరణ్ మార్కులు చూసినపుడల్లా అపర నరసింహావతారం దాల్చుతుంటాడు. తల్లి లీలావతి ఆపద కాస్తుంటుంది.
"ఈ మారు మార్కులు 60 దాటకపోతే హాస్టల్లో పడేస్తాను. అక్కడ మెడలు వంచి చదివిస్తారు."అని హెచ్చరించాడు. కిరణ్‌కు హాస్టలంటే మహాభయం. అక్కడ వాడిక్లాస్ మేట్ ఒకడున్నాడు. చాపమీద క్రిందపడుకోవాలిట, చన్నీటి స్నానమట. తిండి రేషన్‌లా పెడతారుట! రాత్రి 11గం.వరకూ చదవాలిట! తెల్లవారు ఝామున మూడింటికే లేపుతారుట! లేకపోతే కొడతారుట! బాబోయ్! వాడురోజూ ఏడుస్తుంటాడు. భయంతో కిరణ్ తల్లి కొంగుచాటున చేరి "అమ్మా! నేను హాస్టల్లోచేరనే, ఇంట్లోనే చదువుకుంటా. నాన్నకు చెప్పవే!"అంటూ బ్రతిమాలాడు.
"ఏంటండీ మీరుమరీనీ, ఒక్కగానొక్కబిడ్డను హాస్టల్లో వేస్తారా! వాడేం దిక్కులేనివాడా! చాల్చాలు ఆపండి" అంటూ వాడ్ని వెనకేసుకొచ్చింది. తల్లిప్రేమకదా.
"ఒరేనాయనా! నీవు నాతోపాటుగా రోజూ ఆంజనేయస్వామి ఆలయానికి రారా! ఆయన పిలిస్తే పలికే దేవుడురా! నిన్ను తప్పక ప్యాస్ చేయిస్తాడు." అంటూ వాడికి భక్తినూరిపోసింది. దాంతోవాడు ఉదయం గుడికీ, స్కూల్ తర్వాత క్రికెట్‌కూ హాయిగా వెళుతూ ఆంజనేయ స్వామిమీద భారం మోపాడు.
పరీక్షలు దగ్గరపడేసరికి పదోతరగతి పిల్లలందరికీ దేవునిపై భక్తిపెరిగిపోయింది. ముడుపులు కట్టేవారూ, ఆంజనేయ స్వామికి తమలపాకుల దండలేస్తామనేవారు, చిట్టిగారెలు, అప్పాలూ వేస్తామనే వారు, మక్కువగా రోజుకో మొక్కు మొక్కుతున్నారు. 
ఒకరోజున కిరణ్ "అమ్మా! ఆంజనేయస్వామి నన్ను ప్యాస్ చేయిస్తాడుగా?'మా క్లాస్ మేట్సంతా చాలామొక్కులు మొక్కుతున్నారమ్మా! నేను ఏదో ఒక కొత్తమొక్కు మొక్కుకుంటానే!" అన్నాడు.
"దాందేముంది నాయనా! 40రోజులు ప్రదక్షిణాలూ, పాసయ్యాక వంద కొబ్బరికాయలూ కొడతానని మొక్కుకో."అంది వాళ్ళమ్మ కిరణ్ తల ప్రేమగా నిమురుతూ.
ఆమాటలు విన్న వాళ్ళనాన్న "చదివితే పాసవుతారుగాని, పుస్తకం పట్టకుండానే మొక్కులు మొక్కినంత మాత్రాన ఏదేవుడూ పాస్ చేయించడు, బధ్ధకపు వెధవా! వాడికితోడు నీవో బడుధ్ధాయి తల్లివి. కూర్చోబెట్టి చదివించు. ఫలితం ఉంటుంది." అని కోప్పడ్డాడు. తల్లి నాయనా కాస్తంత చదవరా! దేనికైనామంచిది" అని బ్రతిమాలగా కిరణ్ పుస్తకాలు ముందేసుకుంటే, ఒక్కటీ అర్థమై చావట్లేదు వాడికి. ఏనాడైనా పుస్తక తెరిస్తేనా!
"ఒరే భలే ఐడియారా! ఈ ఒక్క ఐడియాతో మన జీవితాలే మారిపోతాయి. మనం ఆంజనేయ స్వామికి పూల పందిరి వేయిద్దాం, కనీసం బిట్ పేపర్ ఆన్సర్స్ తెలిసేలా చేయమని ప్రార్ధిద్దాం , బిట్స్ మాత్రమే చదువుదాం సరా!" అని కిరణ్ క్రికెట్ ఫ్రండ్స్ అంతా బిట్స్ ఏకబిగిని కంఠతా పట్టసాగారు.
పరీక్షలు రానే వచ్చాయి. మొదటి రోజున కిరణ్ ఫ్రండ్స్ అంతా చిటికె లేసుకుంటూ పరీక్ష హాల్లోకి వెళ్లసాగారు. అప్పుడే కిరణ్‌కు ఒక గొప్ప ఐడియా తట్టింది."స్వామీ! ఆంజనేయా! నీకు చిటికెల పందిరేయిస్తాను స్వామీ! నన్ను పాస్ చేయించు ప్రభూ!" అని మొక్కుకుని పరీక్ష హాల్లో ప్రవేశించాడు.
ఆలయంలోని ఆంజనేయస్వామికి చాలా సంభ్రమం కలిగింది.'ఇంతవరకూ ఒక్క భక్రుడైనా వేయించని ' చిటికెల పందిరి ' వేయిస్తానంటున్నాడు, ఈమొక్కు ఏ నాడూ నేను కనలేదూ, విననూలేదు, వీడినెలాగైనా పాస్ చేయించి ఆ ’చిటికెల పంది’రేయించుకోవాలి ' అనుకుని, బిట్స్ అన్నీవాడు చదివినవే వచ్చేలా చేశాడు. కిరణ్ బిట్సన్నీ బాగా వ్రాసి పరీక్షపాసయ్యాడు. 
తల్లి మురిసి ముద్దైపోయి "రానాయనా! ఆంజనేయ స్వామి ఆలయానికెళ్ళి మొక్కులు తీర్చుకొద్దాం “ అని తమలపాకుల మాలా, చిట్టి గారెలమాలా, కొబ్బరి కాయలూ పట్టుకుని బయల్దేరింది. అన్ని మొక్కులూ తీర్చుకున్నాక ,"అమ్మా! ఉండవే! మరో మొక్కు మిగిలి పోయింది.దేవుడికి చిటికెలపందిరేయాల" అంటూ దేవునికి ఎదురుగా నిల్చుకుని,
"స్వామీ! ఇదిగో చిటికెల పందిరి --" అంటూ చేత్తో చిటికె లేస్తూ ఇది ఒక స్తంభం, ఇది మరో స్థంభం అంటూ నోటితో పలుకుతూ చిటికె లేస్తూ స్థంభాలూ, అడ్డపట్టెలూ నిలువుపట్టెలూ, ఆకులూ ‘అని పలుకుతూ చిటికెలు వేస్తూ," స్వామీ నీమొక్కు తీర్చుకున్నాను చిటికెల పందిరేశాను." అని చెప్పి నమస్కరించి వెళ్ళాడు కిరణ్. 
ఆంజనేయస్వామి "ఓరీ నన్నే బురిడీ కొట్టించావు కదరా! ఇదా చిటికెల పందిరంటే!" అని విస్తుపోయాడు, పాపం దేవుడు.
రచన: ఆదూరి హైమవతి.

Friday, 16 May 2014

ఇ బుక్ గా కినిగె లో నీతికధలు పిల్లలప్రీతికధలు, బామ్మచెప్పిన భలే భలే కధలు అనే రెండు

అందరికీ నమస్కారం!

ఈ లింక్ లో నేను చిన్నపిల్లలకోసం  వ్రాసిన నీతికధలు , కొత్తపల్లి, ఆంధ్రభ్రభ దినపత్రికల్లో ప్రచురితమైన కధలు ఇ books ,[పిల్లలప్రీతికధలు, బామ్మచెప్పిన భలే భలే కధలు అనే రెండు  ] గా కినిగె లో   ప్రబ్లిష్ అయ్యాయని  తెలుపు టకు సంతోషించుచున్నాను. , దయచేసి చదివి మీ అమూల్య అభిప్రాయాలు తెలుపవలసినదిగా మనవి.మీకు నచ్చితే ఆవిషయం  కినిగె లో ప్రచురించవలసినది గాకోరుచున్నాను..
with best regards,
ఆదూరి.హైమవతి.