Saturday 13 April 2019

మూగజీవుల కృతఙ్ఞత.


మూగజీవుల కృతఙ్ఞత.
  ఒకరోజు మల్లన్న పట్నానికి తన యజమాని ఎరువులు కొని తెమ్మ నగా చీకట్తోనే బయల్దే రాడు.వాని అవ్వ బుజ్జమ్మ ఒక మూటలో చల్ది అన్నం కట్టిచ్చి ,నంజుడుకు మాగాయ ముక్కలు పెట్టి , మధ్యలో నమలను కాస్తంత కారప్పూస మరో మూటలో కట్టి ఇచ్చింది.
   " ఒరే చంటోడా ! ఎప్పుడైన సరే ,ఏదీ నీవు ఒక్కడివే తినకు. ఎవరి కైనా కొంతపెట్టి తిను సుమీ!  ఎవ్వరూలేనపుడు కనీసం ఏజంతువు కో ,చీమకో ఐనాసరే కాస్తంత వేసి తిను." అని చెప్పి పంపింది.
      మల్లన్న త్వర త్వరగా బండి తోలుకుని వెళ్ళి పట్నంలో ఎరువు లు కొని , వేంటనే  తిరుగు ప్రయాణానికి బయల్దేరాడు. మధ్యలో చిన్న చిట్ట డవి  దాటవలసి ఉంది. అడవి మధ్యగా పారుతున్న నదిని సమీపించ గానే మల్లన్న కడుపులో ఎలకలు పరుగెత్తసా గాయి. 
  వాడు బండిని చెట్టు నీడన నిలిపి  ,ఎద్దులకు నీరు త్రాగించి ,బండిలో తెచ్చిన గడ్డి కాస్తంత వాటికి వేసి ,తానూ ముఖం కాళ్ళు చేతులు కడు క్కుని ,అవ్వ ఇచ్చిన చల్దిమూట విప్పాడు.
 వెంటనే వాడికి 'ఎవరికైనా కాస్తంతైనాపెట్టి తినమని ' అవ్వ చెప్పిన మాటలు గుర్తువచ్చాయి . 
చుట్టూ చూశాడు, కనుచూపు మేరలో ఎవ్వరూ కానరాలేదు. వాడికి చెట్టు సమీపంలో వున్న ఒక చీమల పుట్ట కనిపించింది.మల్లన్న కొంత అన్నం  కాస్తంత కారప్పూస తీసి పుట్ట వద్ద  ఉన్న ఆకు మీద   వుంచి , కొంత ఏదైనా జంతువు కనిపిస్తే పెట్టేందుకు పక్కన  రాతిపై కాస్తంత వుంచి ,మిగిలింది తాను కారప్పూస  మాగాయ ముక్కలతో కలిపి నంజుకుని భుజించి ,నీరు త్రాగి చెట్టు నీడన కాస్తంత సేపు విశ్రమించ ను నడుంవాల్చాడు.
    రాతి మీది అన్నం చూసిన కొన్ని కోతులు వచ్చి , తిని చెట్టు కొమ్మ లపై కూర్చున్నాయి.
 పుట్ట వద్ద వుంచిన అన్నాన్ని , కొఒత కాకులు ' కావు కావు ' మని తమ మిత్రులను, పిచిలి తినడం కొన్ని మెతుకులను, కారప్పూస ముక్కలను  చీమలు నోట కరుచుకు వెళ్ళడం , అంతా గమనిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు మల్లన్న. 
       ఎంత సేపైందో  కోతుల , కాకుల గోలకు , నిద్రమెలకువవచ్చి , చూడగా  పుట్టవద్దవున్న  నల్లత్రాచును పొడుస్తున్న కాకులు ,  చుట్టు ముట్టి కుడుతున్న చీమల గుంపులు, పోరాడుతున్న కోతులు  కనిపిం చాయి.  మల్లన్నకు అంతా క్షణంలో  అర్ధమై  తన అవ్వ చెప్పిన మాట ప్రకారం తాను ఒక్కడే తినక , తోటి ప్రాణులకు కొంత అన్నం పెట్టడం వల్ల , అవి దాన్ని తిని అక్కడే ఉండటాన త్రాచును చూసి, తనప్రాణం కాపాడను, కాస్తంత తిండి వేసిన తనపట్ల కృతఙ్ఞతగా , ' ఆనోరు లేని, మ నసున్న మూగజీవులు  ' రోజు తన ప్రాణాన్ని ఎలా కాపాడాయో చూసి ఆశ్చర్యం , ఆనందం కనిగింది. నోరు లేని ప్రాణులే ఇంత సాయం చేయ గా ,' నోరు, వివేకం, విచక్షణాఙ్ఞానం  వున్న మానవులు ఒకరి కొకరు తప్పక సాయ చేసుకు తీరాల్సిందే ! 'తన అవ్వ చెప్పిన చిన్న మాటలో ఎంత అంతరార్ధం దాగి ఉందో !' అనుకుంటూ  మల్లన్న తన అవ్వకు విషయం చెప్పను త్వర త్వరగా  బండితోలుకుని వెళ్ళసాగాడు.
                              *****

No comments:

Post a Comment