Friday 31 July 2020

గాయత్రీ మంత్రం జప విధానాలు


                        గాయత్రీ మంత్రం జప విధానాలు
ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్
తల్లిని మించి న దైవము లేదు.  గాయత్రీమంత్రమును మించినమంత్రం  మరొకటి లేదు.-
గాయత్రీ మత్ర ద్రష్ట విశ్వామిత్ర మహషి.ఆయన పేరులోనే విశ్వానికి మిత్రుడని తెలుస్తున్నదికదా! ఈ గాయత్రీ మత్రం లోకానికి ప్రసాదించడం ద్వారా ఆయన నిజంగానే లోకానికంతా మిత్రుడయ్యాడనవచ్చు. 
గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదము లో చెప్పబడినది.
గాయత్రి అనే పదము 'గయ', 'త్రాయతి' అను పదములకూడికతో ఉంది.
 "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరుల వారు వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు ‘త్రాయతే' అనగా రక్షించడం. ప్రాణములను రక్షించేది  గాయత్రీ మంత్రం.
వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్ష రమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించారు. 
అనగా గాయత్రీ మంత్రజపం చేయడం అంటే రామాయణాన్ని పఠించడంతో సమానం అనిభావించవచ్చు.
  గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరము. మహిమాన్వితమైనది.  ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించి నట్లే.
ఈ మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి.
ఓం = సర్వరక్షకుడైనపరమేశ్వరుడు .
భూః = సత్ స్వరూపం
భువః = చిత్ స్వరూపం .
స్వః = ఆనంద స్వరూపం.
తత్ = ఆయన ఇలాంటి సచ్చినానంద లక్షణములు గల పరమేశ్వరుడు.
సవితుః = ఈ సృష్టి కర్త.
వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడే వాడు.
భర్గః = శుద్ధ స్వరూపుడు అనగా పాపరహితుడు.
దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యమంగళస్వరూపము.
ధీమహి = హృదయాంతరాళాల్లో నిల్చి,
యః = ఆ పరమేశ్వరుడు.
నః ద్యః = మా బుద్ధులను.
ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ, శ్రేయములు పొందుటకు సమర్ధులముగా చేయుగాక.
గాయత్రీ మంత్రంలో 24 అక్షరములతో పాటు 24 మంది దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా ఉన్నది.
24 గాయత్రీ మూర్తులకు చతుర్వింశతి 'గాయత్రీ  అనిపేరు.
గాయత్రీమంత్రములోని 24 అక్షరాలలో 24 మంది దేవతామూర్తులు కొలువై ఉన్నారు.
తత్- విఘ్నేశ్వరుడు
-   నరసింహస్వామి
వి -   మహావిష్ణువు
తుః- శివుడు
-శ్రీకృష్ణుడు
రే -   రాధాదేవి
ణ్యం -      శ్రీ మహాలక్ష్మి
-   అగ్ని దేవుడు
ర్గోః - ఇంద్రుడు
దే -  సరస్వతీ దేవి
-   దుర్గాదేవి
స్య - ఆంజనేయస్వామి
ధీ -  భూదేవి
- సూర్య భగవానుడు
హి -  శ్రీరాముడు
ధి -  సీతాదేవి
యో -చంద్రుడు
యో  - యముడు
నః - బ్రహ్మ
ప్ర -  వరుణుదు
చో - శ్రీమన్నారాయణుడు
-  హయగ్రీవుడు
- హంసదేవత
త్ -  తులసీమాత
24మంది దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే 24 మంది దేవతామూర్తులనూ స్మరించినట్లే, వారి మంత్రాలు జపిచినట్లే.గాయత్రీ మంత్రజపంవలన కీర్తి, దివ్యమైన తేజస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు , జ్ఞానవృధ్ధి కలుగుతాయి.
సర్వశ్రేష్టమైన ఈ గాయత్రి మంత్రాన్ని గురుమంత్రము అంటారు. ప్రాచీనకాలం నుండి ఈమంత్రాన్ని అనేకమంది మునులు, సాధకులు మహాపురుషులూ  జపిస్తూ వచ్చారు.. —
సమస్త జీవులకు తేజస్సును, మనస్సును, బుద్ధిని ప్రేరేపించేది, మంచి మార్గాన నడిపించేది, సర్వలోకాలను సృష్టించేది, జ్ఞాన స్వరూపమైనది ‘గాయత్రి’. వేదమాత గాయత్రి కరుణామయి. పరమశాంత స్వరూపిణి. అడిగిన వారికి లేదనకుండా అన్నీ ఇచ్చే దయాసాగరి. 
పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వీటి తేజస్సును తనలో ఇముడ్చుకుని పంచముఖాలతో మనకు దర్శనమిచ్చి కాపాడు తుంది గాయత్రీమాత.
గాయత్రీమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాల వలన తెలుస్తున్నది. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. 
గాయత్రీమాత ఐదుకుఖాల రంగులూ ఇలా ఉంటాయి.
మొదటి ముఖం -ముత్యపు రంగు, 
రెండవముఖం -విద్రుమ అనగా పగడపు రంగు, 
మూడవముఖం- హేమము అనగా  బంగారపు రంగు,
నాల్గవ ముఖం నీలవర్ణము.
ఐదవముఖం తెల్లని రంగు కలిగి తనను స్మరించిన జపించిన వారికంతా ఆరోగ్యము, ఐశ్వర్యము, జ్ఞానము, సర్వము ప్రసాదిస్తుంది.
గాయత్రీమంత్రంలోని  ప్రతి అక్షరంలోనిదేవతలకూ  గాయత్రీ మంత్రాలున్నాయి.

1.తత్       -విఘ్నేశ్వరుడు-
గణేశ గాయత్రి - ఓమ్ ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.
       
2.  నరసింహస్వామి-
నృసింహ గాయత్రి - ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహః ప్రచోదయాత్.
       
3.వి  మహావిష్ణువు-
విష్ణు గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
       
4.తుః        శివుడు      -
శివ గాయత్రి - ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్

5.  శ్రీకృష్ణుడు -
కృష్ణ గాయత్రి - ఓమ్ దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణః ప్రచోదయాత్.

6.రే   రాధాదేవి  -
రాధా గాయత్రి - ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి, తన్నోరాధా ప్రచోదయాత్.

7.ణ్యం-శ్రీ మహాలక్ష్మి -
లక్ష్మీ గాయత్రి - ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.

8.  అగ్ని దేవుడు    -
అగ్ని గాయత్రి - ఓమ్ మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్నిః ప్రచోదయాత్.

9.ర్గోః ఇంద్రుడు -
ఇంద్ర గాయత్రి - ఓమ్ సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి, తన్నోఇంద్రః ప్రచోదయాత్.

10.దే సరస్వతీ దేవి   -
సరస్వతీ గాయత్రి - ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి, తన్నోదేవీ ప్రచోదయాత్.

11. దుర్గాదేవి  ,
దుర్గా గాయత్రి - ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి, తన్నోదుర్గా ప్రచోదయాత్.

12.స్య       ఆంజనేయస్వామి    
హనుమద్గాయత్రి - ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నోమారుతిః ప్రచోదయాత్.

13.ధీ భూదేవి-
పృథ్వీ గాయత్రి - ఓం పృథ్వీదేవ్యై విద్మహే సహస్రమూర్త్యై ధీమహి, తన్నోపృథ్వీ ప్రచోదయాత్.

14.       సూర్య భగవానుడు.
సూర్య గాయత్రి - ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్.

15.హి        శ్రీరాముడు.
రామ గాయత్రి - ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నోరామః ప్రచోదయాత్.

16.ధి సీతాదేవి.
సీతా గాయత్రి - ఓం జనక నందిన్యై విద్మహే భూమిజాయై ధీమహి, తన్నోసీతాః ప్రచోదయాత్.

17.యో     చంద్రుడు.
చంద్ర గాయత్రి - ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.

18.యో     యముడు.
యమ గాయత్రి - ఓం సూర్యపుత్రాయ విద్మహే మాహాకాలాయ ధీమహి, తన్నోయమః ప్రచోదయాత్.

19.నః       బ్రహ్మ.
బ్రహ్మ గాయత్రి - ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి, తన్నోబ్రహ్మః ప్రచోదయాత్.

20.ప్ర        వరుణుదు.
వరుణ గాయత్రి - ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి, తన్నోవరుణః ప్రచోదయాత్.

21.చో       శ్రీమన్నారాయణుడు.
నారాయణ గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోనారాయణః ప్రచోదయాత్.

22. హయగ్రీవుడు.
హయగ్రీవ గాయత్రి - ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి, తన్నోహయగ్రీవః ప్రచోదయాత్.

23.      హంసదేవత.
హంస గాయత్రి - ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్.

24. త్       తులసీమాత.
తులసీ గాయత్రి - ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందాః ప్రచోదయాత్.
గాయత్రీ మంత్రం జపంలోని వివిధ రీతులు.
1.వాచకజపము -అనగా గాయత్రీ మంత్రాన్ని పైకి జపించడం. మనకే కాక చుట్టూ ఉన్నవారికి కూడా వినిపించేలాగా మంత్ర జపం చేయడం.

2.రహస్య జపం-[మర్మరింగ్-] నాలుక కదులు తుండ గా మన చెవులకు మాత్రమే మంత్రం వినిపించే లాగా జపించడం.

3.అంతర్ముఖ - 'హం' చేయడం. నాలుక కదులు తుండగా నోటినుండీ మాటలు రాకుండా,కేవలం కంఠంలో మాత్రమే కదలిక ఉండేలాగా మాటలు  కాక కేవలం శబ్దం మాత్రమే బయటికి వినిపించేలాగా జపించడం.  అందుకే 'హం ' చేయడం అంటున్నాం.  

4.ఖండజపం నాలుక కదులుతుందికానీ శబ్దం పైకి రాకుండా మంత్రజపం చేయడం.ఇది పైకి వినిపించదు...
5.హృదయజపం- గాయత్రీమంత్రంలోని పదాలు మనస్సులో చూస్తూ ,చదువుకుంటూ మంత్రం జపించడం.పైకి శబ్దం రాదు.మానశికంగా జపించడం.

6.ప్రాణజపం -ఉఛ్వాస,అనగా గాలి లోనికి పీల్చడం, నిశ్వాస అనగా గాలివదిలేప్పుడు గాయత్రి మంత్రం జపించడం. ముందుగా డీప్ బ్రీద్ తీసుకుని  , గాయత్రి చేయడం.దీనివలన ఎక్కువ సమయం గాలిపీల్చి ,మెల్లిగా వదలడం వలన పూర్తిగా ప్రాణవాయువు మనలోకి వస్తుంది.రెండు మార్లు అనగా గాలిపీల్చేప్పుడు ,వదిలేప్పుడు పైకే ,బయటికి వినిపించేలాగా మంత్రజపం చేయడం. ఇలా గాయత్రిని రెండుమార్లు చేసి ఒకటిగా లెక్కించాలి.

7.మస్తిష్క జపం- నుదుటిపై [మూడవకన్ను దగ్గర] దృష్టి నిల్పి గాయత్రీ మంత్రం పైకే వినిపించే లాగా జపించడం.

ఈ సప్త విధ గాయత్రీజపాల్లో మనకు ఏది అనుకూలమో దాన్ని మనం ఆచరించవచ్చు.అంతేకాక ఇలా రహస్య జపం-[మర్మరింగ్-]  అలవరచుకుంటే మనం నిరంతరం
 ఏపనిచేస్తున్నా గాయత్రీమాత ను జపించుకుంటూ ఉండటం జరుగుతుంది.ఖండజపం కూడా చాలామేలైనది. ఇలా  నిరంతరం   జపించవచ్చు. ప్రాణజపం ఇంకా ఉత్తమం గాలిపీల్చి వదిలేప్పుడంతా లోపల జపించుకోవచ్చు.అందుకే మనకు వీలైన విధా నాన్ని ఎంచుకుని నిరంతర గాయత్రీ జపం ఆచరించి అమ్మ కృపకు ప్రాత్రులమవుదాం.

మనవి--  కొన్ని అంశాలు నా గ్రంధాలయం నుండి, కొన్ని ఉపన్యాసాల్లో విన్నవి, కొన్ని గూగుల్ నుండీ గ్రహించినవాని సంకలనం ఈవ్యాసం.



Tuesday 28 July 2020

న్యాయవర్తనం



                        న్యాయవర్తనం
      
          రాఘవాపురంలో ఒక నిరుపేదరాలైన రాఘవమ్మ  ఏకైకపుత్రిక పూజ. ఆఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో శ్రధ్ధగా చదువుకునేది. రైతుకూలీ ఐన ఆమె త్రండ్రి హటాత్తుగా చనిపోడంతో తల్లి రాఘవమ్మ ఎంతో ఓర్పుగా, నేర్పుగా , ప్రతిరోజూ రాత్రిపూట న్యాయాన్నీ, ధర్మాన్నీ గురించి చెప్తూ తన బిడ్ద మనస్సులో న్యాయాన్ని నాటుతూ తన బిడ్డను పెంచి, పోషించ సాగింది.ఆమెమారు బేరానికీ కూరలు తెచ్చి ఊర్లో , ఎంతో  నిజాయితీగా ,సాధారణ లాభంతో  అమ్మి వచ్చిన దాంతో బిడ్ద చదువుకు ఆ సొమ్ము దాచి పొదుపుగా ఖర్చుచేసేది . న్యాయవర్తనమే ఆమె ధనంగా జీవించేది  .
 
 ఎవరు గమనించినా గమనించకున్నా  సర్వాంత ర్యామి ఐన భగవంతుడు  అంతా గమనిస్తాడని ' ఆమె నమ్మిక. న్యాయమైన సంపాదనే తమకు అచ్చుబాటవుతుందని ఆమె ప్రగాఢవిశ్వాసం.   
     ఆసొమ్ముతో ఇద్దరి కడుపులు నింపుకుంటూ ,కలో గంజో త్రాగుతూ కొంతపైకం బిడ్దపై చదువుకు దాచేది. ఇలా ఉండగా పూజ తమ ఊర్లో చదువు పూర్తై పై చదువులకు పట్నం వెళ్ళాల్సి వచ్చింది.
 రాఘవమ్మ తనగోడు రోజూతన  వద్ద కూరలుకొనే ఒక ఆఫీసరమ్మ తో చెప్పుకునేది.
 ఒకరోజు రాఘవమ్మ ఆమె తో " ఆపీసరమ్మా!! నగరంలో నాబిడ్దను సదవేయాలి .ఎక్కడేస్తే మంచిగుంటదో ,ఏసదువు బాగుంటదో సెప్పండమ్మా పున్నెముంటాది!." అని అడగ్గా , ఎంతో కాలంగా నిజాయితీ గా కూరలు వాడుగ్గా తనకు ఇస్తున్న ఆమెను చూసి ఆ ఆఫీసరమ్మ " రాఘవమ్మా!! నేను రేపు నగరం వెళుతున్నాను. నా బిడ్దనుకూడా కాలేజీ లో వేయాలి. నీ బిడ్దనూ నాతోపంపు. నేను చేరుస్తాన్లే, భయపడకు. నీవు రానక్కరలేదుకే." అని తీసుకెళ్ళి పూజమార్కులు చూసి సంతోషించి ,తనకు బాగా తెలిసిన కాలేజీలో  నర్శింగ్ లోచేర్పించి ,హాస్టల్లో సీటు ఇప్పించి , ఫీజుకూడా తానే   కట్టి వచ్చింది.పూజ మార్కులకు ఎటూ స్కాలర్ షిప్ వస్తుందని  ఆమెకు తెల్సు.
      పూజ  శ్రధ్ధగా చదువుకుని మంచి మార్కులతో పాసయ్యింది.ఆఫీసరమ్మ సూచన మేరకు  ఒక పెద్ద హాస్పెటల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకుంది పూజ.  మార్కులూ అన్నీ బాగున్నా , ఏమాత్రం తెలీని పల్లెటూరిపిల్ల పూజకు ఉద్యోగం ఇవ్వను సుముఖత చూపలేదు ఆహాస్పెటల్ యజమానులు . ఐతే ఆ ఇంటర్వ్యూలో ఒక పెద్ద  స్వంత హాస్పెటల్ ఉన్న ఒక వైద్యుడుకూడా ఉన్నాడు. "నీకు ఇక్కడ ఉద్యోగం ప్రస్తుతం ఇవ్వలేము, నీవు వెళ్లవచ్చు.అవకాశం వున్నపుడు నీకు తెలియపరుస్తాం " అని చెప్పి తాము ముందుగా తెలియ పరచిన ప్రకారం అందరికీ ఇచ్చినట్లే రానూ పోనూ ఖర్చులు , భోజనం కోసం ఖర్చులూ ఇచ్చి పంపారు. 
        పూజ  బయటికి వచ్చి  చూసుకోగా తన బస్సుకు రానూపోనూ ఐన చార్జీలకంటే ఎక్కువ సొమ్ము ఇవ్వడం గమనించింది. వారు భోజనానికి కూడా ఇవ్వటాన అదీ ఎక్కువగానే ఉంది.  తాను తన ఇంటినుంచీ అమ్మ కట్టిచ్చిన భోజనం తెచ్చుకుని తినడం వల్ల ఆసొమ్ముకూడా మిగిలింది.
 పూజ అందరికీ ఇంటర్వ్యూలు పూర్తై ఆఫీసర్లు బయటికి వచ్చేవరకూ అక్కడి ప్రధాన ద్వారం వద్దే వేచిఉంది. ఇంటర్వ్యూలు నిర్వహించిన పెద్ద డాక్టరు బయట వేచి ఉన్న ఆమెను చూసి " నీకు ఉద్యోగం ఇవ్వలేము  వెళ్ళ మని చెప్పారు కదా! ఇంకా ఎందుకు ఉన్నావూ? పొద్దుపోతున్నది వెళ్లవచ్చుకదా!" అని అడిగాడు.
 పూజ నమస్కరించి  ,వినయంగా " సార్!  నాకు ఎక్కువ సొమ్ము ఇచ్చారు. నా ఊరికి రానూ పోనూ అంత టికెట్టుకు ఖర్చుకాలేదు. పైగా  భోజనానికీ ఇచ్చారు. నేను మా అమ్మ వండి ఇచ్చిన భోజనం తెచ్చుకుని తిన్నాను.అందువల్ల ఆ సొమ్మూ ఎక్కువే ఐంది. న్యాయార్జితం కానిసొమ్ము నేను తీసుకోను సార్!అదంతా మీకు చెప్పి తిరిగి ఇవ్వనే ఇక్కడ వేచి ఉన్నాను. మన్నించండి" అని చెప్పి ఆసొమ్ము ఇవ్వబోగా  , ఆ ఇంటర్వ్యూచేసిన డాక్టరు గారు ఆమె నిజాయితీకి ఆశ్చర్యపడి " సరే పూజా! నీవు రేపు వచ్చినా హాస్పెటల్లో  ఉద్యోగంలో చేరు. ఆ సొమ్ము తో పాటుగా నీ మొదటి నెలజీతం కూడా ఇదుగో తీసుకో . ఇదో నా హాస్పెటల్ అడ్రెస్ " అంటూ ఒక విజిటింగ్ కార్డు, సొమ్మూ ఇచ్చేసి వెళ్లాడు.
 చూశారా! పిల్లలూ! సత్ప్రవర్తన వల్ల రాదనుకున్న ఉద్యోగంకూడా పూజకు వచ్చింది. న్యామవర్తనమే మంచి రెకమెండేషన్. ఇది బాలలూ! న్యాయవర్తన మహిమ .చిన్న తనం నుండే న్యాయం గా ఉండటం అలవరచుకుని మంచి పేరు తెచ్చుకుంటారుగా!
 నీతి- న్యాయవర్తనమే మనలను కాపాడే నావ. 
                       ****