Sunday 22 July 2012

భారతజాతీయోద్యమ పిత -బాలగంగాధర తిలక్

                     భారతజాతీయోద్యమ పిత -బాలగంగాధర తిలక్

భారతజాతీయోద్యమ పిత గా.భారత అశాంతికి జనకుడు"స్వాతంత్ర్యం నాజనం హక్కని చాటిన మహా యోగి, స్వాతంత్ర్య సమరయోధుడు,బాలగంగాధర తిలక్ 1856 జూలై 23వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరిలో జన్మించాడు. ఆయన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక సంస్కృత పండితుడు,మంచి ఉపాధ్యాయుడు.తల్లి మహాభక్తురాలు . బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణితశాస్త్రం లోనూ,సంస్కృతంలోనూ మంచి శిక్షణ ఇచ్చాడు తండ్రి.. తిలక్  విశేష ప్రతిభ కనబరచేవాడు.అతనికి  చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమా తిలక్ ది.. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం . కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు.
        తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు ఆయన తండ్రికి రత్నగిరి నుంచి పుణెకు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో చాలా మార్పు తెచ్చింది. ఆయన అక్కడ ఆంగ్లో-వెర్నాకులర్ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యనభ్యసించాడు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే ఆయన తన తల్లిని, తన పదహారేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయాడు.

     మెట్రిక్యులేషన్ చదువు తున్నప్పుడే ఆయనకు సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయిన తరువాత, అతని పినతండ్రి ప్రభుత్వరంగంలో ఒక ఉద్యోగానికి సిఫారసు చేసి చేయించాడు. అయితే చిన్నప్పటినుంచి స్వతంత్ర భావాలున్న తిలక్, ఆ ఉద్యోగంలో చేరలేదు. భారతదేశ ప్రజలు అమాయకంగా ఉండి చదువు లేకపోవటంవల్లనే ఆంగ్లేయులు అధికారం చెలాయిస్తునారని, వారి అధికారం నుంచి భారతీయులు స్వేచ్చ పొందాలంటే చదువు ముఖ్యమని భావించి తిలక్ దక్కన్ కళాశాలలో చేరాడు. 1877లో ఆయన గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఆయన తనచదువును కొనసాగించి ఎల్ ఎల్ బి. పట్టా కూడా పొందాడు.


                1880లో తన మిత్రుడు అగర్మర్ తో కలిసి పూనాలో ఒక పాఠశాల స్థాపించాడు. ఆంగ్లేయులు భారతీయ సంస్కృతిని కాలరాస్తూ, వారి నాగరికతను మన మీద రుద్దుతూ, హిందువులను వారి మతం లోకి మార్చుతుంటే, తిలక్ భరించలేకపోయాడు. కేవలం వ్యాపారం చేయడానికిమనదేశాన్నిఆశ్రయించి, ఏకుమేకై కూర్చున్నట్లుగా వారు మనమీద పెత్తనం చెలాయించటం తిలక్ సహించలేకపోయాడు. తన పాఠశాలలో ప్రతి విద్యార్ధి దేశానికి నిజమైన సేవ చేయాలంటే బాగా చదువుకొని బ్రిటీషువారి పీడ వదిలించుకోవటానికి సిద్దపడాలనీ, అందుకు అవసరమైతే ప్రాణాలు అర్పించటానికైనా వెనుకంజ వేయరాదని నూరిపోశాడు.
         

     దేశసేవ నినాదంతో తన పాఠశాలను ఎంతో అభివృద్ది చేసుకుని అనేక దేశభక్తులను తయారు చేశాడు తిలక్. తోటి ఉపాధ్యాయులు కానీ, తను కానీ, ఎటువంటి జీతభత్యాలు తీసుకోకుండా పిల్లల బంగారు భవిష్యత్తుకై కృషి చేస్తూ, ఎప్పటికైనా భారతీయులు స్వేచ్ఛ పొందాలని కలలు కనేవారు. ఏ కోశానా స్వార్ధం లేని ఆ మేధావులు ఎందరో ఆణిముత్యాలను దేశానికి సమర్పించారు. తిలక్ పట్టుదల, కృషి, దీక్షవలన ఆ పాఠశాల ఉత్తమ పాఠశాలగా గుర్తింపు తెచ్చుకుని, భారతదేశంలోని యితర విద్యార్థులు కూడా అక్కడ చేరేలాగా ప్రాముఖ్యం పొందింది. 
          ఈ పాఠశాల విజయాలు గమనించిన బ్రిటీషు ప్రభుత్వం ఆ రోజుల్లో ఒకింత కలవరపడింది. కారణమేమంటే భారతదేశం నలుమూలల నుండి విధ్యార్ధులు వచ్చి చేరుతున్నారు. వీళ్ళు చదువుతో పాటు దేశసేవ, దేశభక్తి అంటూ నూరిపోస్తున్నారు. వీళ్ళు చదువు పూర్తిచేసుకొని వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలుచేయవచ్చు, అందుకని ఈ పాఠశాలను మొగ్గగా ఉన్నప్పుడే తుంచివేయాలి, అనే దురుద్దేశంతో పాఠశాలలో రాజకీయాలు నేర్పుతున్నారనే మిషతో గుర్తింపును రద్దు చేస్తూ తాఖీదు పంపారు.
            తాఖీదు అందుకున్న తిలక్ ఉగ్రుడై బ్రిటీషు ప్రభుత్వంపై కోర్టులో దావా వేసి, తానే వాదించి తిరిగి గుర్తింపు పొందాడు. ఆ సంఘటన ప్రభుత్వ ప్రతిష్టను చాలా బలహీనపరచింది. ఆ సమయంలోనే తెల్లదొరల గర్వం అణగదొక్కడానికి భారతీయులను తెల్లవారి దొరతనం నుంచి విముక్తి కలిగించటానికి వార్తా పత్రిక ఎంతో అవసరమని భావించి, తన స్నేహితుడితో కలిసి 'మరాఠా', 'కేసరి' అనే పత్రికలు స్థాపించి ప్రభుత్వం చేసేఅవకతవకలు, వారిలోపాలు వరుసపెట్టి దుమ్మెత్తిపోయటం ప్రారంభించాడు. 



   అనతికాలంలోనే ఆ పత్రికలు పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి. "కేసరి" పత్రికలను ఆ రోజుల్లో అందరికన్నా ముందుగా దొరలే కొనుక్కొని చదువుకొనేవారు. బ్రిటీషు ప్రభుత్వంచేత నాటి రాజద్రోహ నిరోధకచట్టం క్రింద విచారించబడి, శిక్షించబడిన మొదటి భారతీయుడు తిలక్. అతనిని అనేక పర్యాయాలు జైలుకు పంపారు. అతడు స్వాతంత్ర్య యోధుడేకాదు; గొప్పవిద్వాంసుడు కూడా. 'గీతారహస్యం', 'ఆర్కిటిక్ హొం ఆఫ్ వేదాస్' అనే గ్రంథాలను అతడు రచించెను. అతడు, బ్రిటీషు పరిపాలనపై ప్రజలలో చైతన్యాన్ని ను పెంపొందించాడు. ఇదే అతని నుండి జాతీయోద్యమానికి వచ్చిన కానుక. తిలక్ 'లాఠీక్లబ్' 'అఖ్ఖారస్' అనే వ్యాయామశాలనూ, 'గోహత్యా నిషేధ సంఘాల'నూ స్థాపించాడు.. అతని తీవ్రవాద విధానాల వల్ల, అతనిని "భారత అశాంతికి జనకుడు" అన్నారు. "స్వరాజ్యం నా జన్మ హక్కు"అని చాటింది ఇతడే. బాల్యవివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించాడు.
          తిలక్ 1890లో కాంగ్రెస్ లో సభ్యుడుగా చేరాడు. కానీ త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని ఆయన నమ్మాడు. ."స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను." అని గర్జించాడు. 1907లో మహారాష్ట్రలోని సూరత్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్, ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి 1916లో లక్నోలో జరిగిన సమావేశంలో అంతా ఒకటయారు. అదే సమావేశంలో కాంగ్రెస్ కు, ముస్లిం లీగుకు మధ్య లక్నో ఒప్పందం కుదిరింది.
           

                           జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం ఆయనే మొదలుపెట్టాడు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విడుదలయ్యాక ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1906లో దేశద్రోహం నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళు ప్రవాసశిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే ఆయన "గీతారహస్యం" అనే పుస్తకం రాశాడు. ఆయన చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని ఆయన అభిప్రాయం.
       1916 ఏప్రిల్ లో హోంరూల్ లీగ్ ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామయాత్రలు చేశాడు.. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అనేక ఉద్యమాలు నడిపి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి తన జీవితమంతా దేశ స్వాతంత్ర్య సాధనకొరకు అర్పించి మహాత్మాగాంధీలాంటి మహానాయకులకు, ఆదర్శమూర్తిగా నిలిచి ప్రజలచే లోకమాన్యుడనిపించుకున్న మహావ్యక్తి బాలగంగాదర్ తిలక్. ఆయన 1920 ఆగష్టు 1 న స్వర్గస్థులయినారు. 



జులై 23 లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా వార్త దినపత్రికలో ప్రచురితం        





1 comment: